ఏదో రకంగా రెయిజ్ అవ్వడమేగా కావాల్సింది

ఏపీ సీఎం జ‌గ‌న్ తీసుకున్న మూడు రాజ‌ధానుల పుణ్యమాని.. రాష్ట్రంలో రెండు నెల‌లుగా ముఖ్యంగా రాజధాని అమ‌రావ‌తి ప్రాంతంలో చోటా మోటా నాయ‌కులు కూడా రోడ్ల మీద‌కు [more]

Update: 2020-03-01 14:30 GMT

ఏపీ సీఎం జ‌గ‌న్ తీసుకున్న మూడు రాజ‌ధానుల పుణ్యమాని.. రాష్ట్రంలో రెండు నెల‌లుగా ముఖ్యంగా రాజధాని అమ‌రావ‌తి ప్రాంతంలో చోటా మోటా నాయ‌కులు కూడా రోడ్ల మీద‌కు వ‌స్తున్నారు. ఇక‌, రాజ‌కీయాలకు దూరం అయిపోయారు. అస్త్రస‌న్యాసం చేసేశారు. అనుకున్న కురువృద్ధ నేత‌ల నుంచి ప్రజాద‌ర‌ణ కోల్పోయి రాజ‌కీయంగా దారి క‌నిపించ‌క క‌కావిక‌లం అవుతున్న నాయ‌కుల వ‌ర‌కు కూడా చాలా మంది ఇప్పుడు యాక్టివ్ అయ్యారు. ఇలా యాక్టివ్ అయిన వారిలో ప్రముఖంగా వినిపిస్తున్న పేరు వంగ‌వీటి రాధాకృష్ణ. ఎంత విచిత్రం అంటే వంగ‌వీటి keDe ఇప్పుడు బ‌య‌ట‌కు వ‌స్తున్నట్టు గ‌త ప‌దేళ్లలో ఎప్పుడూ రాలేద‌నే చెప్పాలి.

బయటకు రాకుండానే…?

2009లో ప్రజారాజ్యం నుంచి ఓట‌మి త‌ర్వాత ఐదేళ్ల పాటు పూర్తి స్తబ్దుగా ఉన్న వంగ‌వీటి రాధా తిరిగి 2014 ఎన్నిక‌ల్లో పోటీ చేశారు. ఆ ఓట‌మి త‌ర్వాత కూడా వంగ‌వీటి రాధా బ‌య‌ట‌కు రాలేదు. వంగ‌వీటి బ‌య‌ట‌కు రావ‌డం లేద‌నే జ‌గ‌న్ ఆయ‌న్ను సెంట్రల్ నియోజ‌క‌వ‌ర్గ ప‌గ్గాల నుంచి త‌ప్పించి మ‌రీ మ‌ల్లాది విష్ణుకు ఇచ్చారు. ఆ త‌ర్వాత వంగవీటి రాధా టీడీపీలోకి వెళ్లడంతో రంగా అభిమానుల్లో చాలా మంది జీర్ణించుకోలేక‌పోయారు. 2004 ఎన్నిక‌ల్లో విజ‌య‌వాడ తూర్పు నియోజ‌క‌వ‌ర్గం నుంచి గెలిచిన త‌ర్వాత ఇప్పటి వ‌ర‌కు ఒక్క విజ‌యాన్ని కూడా ద‌క్కించుకోలేక పోయిన వంగ‌వీటి రాధా ఇప్పటి వ‌ర‌కు నాలుగు పార్టీలు మారారు. కాంగ్రెస్ టు ప్రజారాజ్యం దాని నుంచి వైసీపీ దీని నుంచి టీడీపీ. అయినా కూడా ఎక్కడా ఆయ‌న పుంజుకోలేక పోయారు.

ఆవేశమే అనర్థానికి?

త‌న ముక్కుసూటి త‌నం.. ఎవ‌రి మాటా వినిపించుకోక‌పోవ‌డం.. వ్యూహం లేని రాజ‌కీయాలు వంటివి వంగవీటి రాధాను ఎక్కడిక‌క్కడ దెబ్బేశాయి. దీంతో వంగ‌వీటి రాధా రాజ‌కీయాల్లో స‌క్సెస్ కు క‌డుదూరంలోనే ఉండిపోయారు. గ‌త ఏడాది ఎన్నిక‌ల్లో వైసీపీ అధినేత జ‌గ‌న్ మాట విని ఉంటే.. ఎమ్మెల్యే అయి ఉండేవార‌ని అంటారు ఆయ‌న అనుచ‌రులు. చివ‌ర్లో వంగవీటి రాధాకు మ‌చిలీప‌ట్నం ఎంపీ సీటు సైతం జ‌గ‌న్ ఆఫ‌ర్ చేశారు. ఆఖ‌ర్లో అవ‌నిగ‌డ్డ నుంచి అయినా పోటీ చేయ‌మ‌ని చెప్పారు. అయితే వంగవీటి రాధా అవేమి ప‌ట్టించుకోకుండా ఆవేశంతో టీడీపీలోకి వెళ్లారు.

ఉన్నట్లుండి యాక్టివ్ అయి….

స‌రే! గ‌తం గ‌తః కాబ‌ట్టి ఇప్పుడు వంగవీటి రాధా ఉన్న టీడీపీ అధికారంలోకి రాలేదు. దీంతో ఎన్నికల త‌ర్వాత మ‌ళ్లీ ముఖం చాటేశారు వంగ‌వీటి రాధా. అయితే, తాజాగా రాజ‌ధాని అంశాన్ని అడ్డు పెట్టుకుని మ‌ళ్లీ రోడ్డెక్కారు. తాజాగా రాజ‌ధాని రైతుల ప‌క్షాన త‌న గ‌ళం వినిపిస్తున్నారు. జ‌గ‌న్ రెడ్డి- అని సంభోదిస్తూ.. ప్రత్యేక‌త‌ను సంపాయించుకునే ప‌నిచేస్తున్నారు. రాజ‌ధానిలో అమ‌రావ‌తి కోసం దీక్షలు చేప‌ట్టిన రైతుల శిబిరాల‌కు వెళ్లి.. అక్కడ వారికి మ‌ద్దతిస్తున్నారు. వారి త‌ర‌ఫున జ‌రుగుతున్న ర్యాలీల్లోనూ పాల్గొంటున్నారు. మొత్తంగా ఈ ప‌రిణామాలు చూస్తున్న వంగ‌వీటి రాధా అభిమానులు.. పోనీలో ఏదో ర‌కంగా మావోడు రెయిజ్ అవుతున్నాడుగా అని చెప్పుకోవ‌డం గ‌మ‌నార్హం. మ‌రి ఈ ఊపు ఎన్నాళ్లు ఉంటుందో చూడాలి .

Tags:    

Similar News