అనితకు అందలం అందుకేనా?

విశాఖ జిల్లాకు చెందిన వంగలపూడి అనితకు తెలుగుదేశంలో ఇపుడు ఎక్కడలేని ప్రాధాన్యత దక్కుతోంది. ఆమె ఒక ఉపాధ్యాయురాలిగా ఉంటూ అకస్మాత్తుగా రాజకీయ రంగ ప్రవేశం చేశారు. 2014 [more]

Update: 2020-10-27 09:30 GMT

విశాఖ జిల్లాకు చెందిన వంగలపూడి అనితకు తెలుగుదేశంలో ఇపుడు ఎక్కడలేని ప్రాధాన్యత దక్కుతోంది. ఆమె ఒక ఉపాధ్యాయురాలిగా ఉంటూ అకస్మాత్తుగా రాజకీయ రంగ ప్రవేశం చేశారు. 2014 ఎన్నికల్లో పాయకరావుపేట నుంచి గెలిచి సత్తా చాటారు. ఇక అసెంబ్లీలో ఆమె వాణిని బలంగా వినిపిస్తూ ఆనాటి విపక్ష వైసీపీని ఎక్కడికక్కడ కట్టడి చేశారు. ఒక దశలో ఆమెకు మంత్రి పదవి ఇస్తారని ప్రచారం అయితే సాగింది. కానీ అది కుదరలేదు టీటీడీ బోర్డు మెంబర్ ఇచ్చినా మతం కారణంగా అది వెనక్కు తీసుకున్నారు. ఇక 2019 ఎన్నికల్లో వంగలపూడి అనితను తప్పించి డాక్టర్ బంగార్రాజుకు స్థానిక నాయకులు టికెట్ ఇప్పించారు. దాంతో ఆమె వేరే జిల్లా నుంచి పోటీ చేసి ఓటమిపాలు అయ్యారు.

మళ్లీ అలా ….

ఇక అంతటితో వంగలపూడి అనిత రాజకీయ జీవితం సమాప్తం అనుకున్న వేళ హఠాత్తుగా చంద్రబాబు పిలిచి మరీ తెలుగు మహిళా ప్రెసిడెంట్ పదవి కట్టబెట్టారు. ఆ పదవిలో అనిత ఇప్పటిదాకా చూస్తే బాగానే రాణిస్తున్నారు. జగన్ సర్కార్ ఏర్పడిన కొత్తల్లో టీడీపీ నుంచి ఒక్కరు కూడా మాట్లాడేందుకు సాహసించిన దాఖాలు లేవు కానీ అనిత మాత్రం ముందుకు వచ్చి గట్టిగానే తగులుకున్నారు. విశాఖలో మత్తు డాక్టర్ సుధాకర్ ఎపిసోడ్ లో వైసీపీ మీద బండలు వేసి కధను సీబీఐ దాకా నడిపించడంలో వంగలపూడి అనిత ఫుల్ సక్సెస్ అయ్యారు. దాంతో నాటి నుంచి చంద్రబాబు మరింతగా గుర్తింపు ఇచ్చారు.

అది రికార్డే…..

తెలుగుదేశం పొలిట్ బ్యూరోలో విశాఖ జిల్లా నుంచి ఎంతో మంది పెద్ద నాయకులకే చోటు దక్కలేదు. విశాఖ టీడీపీ రాజకీయాల్లో సీనియర్ నేతగా ఉంటూ ఎన్నో పదవులు నిర్వహించిన ఎంవీవీఎస్ మూర్తి పొలిట్ బ్యూరో మెంబర్ కావాలని ఎన్నో సార్లు అనుకున్నా బాబు ఆ చాన్స్ అసలు ఇవ్వలేదు. ఇక జిల్లా నుంచి ఒక్క అయ్యన్నపాత్రుడే ఈ రోజు వరకూ ఏకైక ‌నేతగా కొనసాగుతున్నారు ఇపుడు ఆయనతో పాటు వంగలపూడి అనితను కూడా చంద్రబాబు తీసుకున్నారు అంటే ఆమెకు టీడీపీలో ఎంతటి గౌరవం దక్కుతుందన్నది అర్ధం చేసుకోవాలి. ఒక విధంగా చూస్తే కేవలం అరేళ్ల రాజకీయ జీవితంలో ఆమె టీడీపీ అత్యున్నత విధాయక మండలిలో సభ్యత్వం సంపాదించడం అంటే రికార్డు అంటున్నారు.

Tags:    

Similar News