వంగా “గీత” మారింది.. ఎలా

కాకినాడ ఎంపీ, వైసీపీ నాయ‌కురాలు వంగా గీతపై రాష్ట్రంలో ఆస‌క్తిక‌ర చ‌ర్చ జ‌రుగుతోంది. గీత రాత స‌రిగాలేద‌ని, ఇక రాజ‌కీయాల‌కు దూర‌మైన‌ట్లే అని గ‌తంలో ఆమెను తీవ్రంగా [more]

Update: 2019-07-18 05:00 GMT

కాకినాడ ఎంపీ, వైసీపీ నాయ‌కురాలు వంగా గీతపై రాష్ట్రంలో ఆస‌క్తిక‌ర చ‌ర్చ జ‌రుగుతోంది. గీత రాత స‌రిగాలేద‌ని, ఇక రాజ‌కీయాల‌కు దూర‌మైన‌ట్లే అని గ‌తంలో ఆమెను తీవ్రంగా విమ‌ర్శించిన ప‌లువురు నాయ‌కులు ఇప్పుడు నాలుక క‌ర్చు కుంటున్నార‌ట‌. త‌మ పార్టీలోకి వస్తానంటే, వద్దని వారించిన నేత‌ల‌కు కూడా త‌న గెలుపుతో ఎంపీ స‌మాధానం చెప్పారు. రాజ‌కీయాల్లో ఎన్ని ఒడిదొడుకులు ఎదురైనా, సొంత పార్టీ నేత‌లే ఆమె ఎదుగుద‌ల‌ను అడ్డుకునే ప్రయ‌త్నం చేసినా అనూహ్యంగా రెండో ప‌ర్యాయం పార్లమెంట్‌లో అడుగుపెట్టారు ఎంపీ వంగా గీత‌.

సామాన్య కార్యకర్త నుంచి…..

టీడీపీ ఆవిర్భావంతో రాజకీయాల్లోకి అడుగుపెట్టిన గీత, దశాబ్దకాలంపాటు సామాన్య కార్యకర్త నుంచి చురుకైన నేతగా ఎదిగారు. జెడ్పీ చైర్మన్‌గా, ఎమ్మెల్యేగా, రాజ్యసభ సభ్యురాలిగా కొనసాగారు. అయితే తెలుగుదేశం పార్టీలోని అంత‌ర్గత విభేదాల వ‌ల్ల ఆమె టీడీపీని వీడారు. టీడీపీలో చంద్రబాబు ఆమెకు ఎంతో ప్రయార్టీ ఇచ్చారు. ఆమె ఆ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయాల‌ని అనుకున్నా య‌న‌మ‌ల లాంటి సీనియ‌ర్ నేత‌లు ఆమెను రాజ‌కీయంగా అణ‌గ‌దొక్కార‌న్న టాక్ ఉంది.

ప్రజారాజ్యంలో చేరి…..

ఎలాగైనా అసెంబ్లీలో అడుగు పెట్టాల‌ని డిసైడ్ అయిన వంగా గీత 2009లో ప్రజారాజ్యం పార్టీలో చేరారు. చిరంజీవి ప్రోత్సాహంతో ఆ పార్టీ త‌రుఫున పోటీచేసి పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. అనంత‌రం ఈ ఎన్నిక‌ల‌కు ముందు టీడీపీలో చేరాలని ప్రయత్నం చేయ‌గా, కొంతమంది నేతలు మద్దతు పలికినప్పటికీ, పెద్దలు మాత్రం అభ్యంత‌రం తెలిపారు. ఈ స‌మ‌యంలో ఇక ఆమె రాజకీయాల నుంచి వైదొలుగుతారన్న చర్చ జరిగింది. అలాంటి గీత ఎవ్వరూ ఊహించ‌ని విధంగా ఎంపీ అయిపోయారు.

జగన్ పిలిచి మరీ…

ఐదేళ్ల పాటు ఆమె క్రియాశీల రాజ‌కీయాల‌కు, ప్రజ‌ల‌కు దూరంగా ఉన్న వంగా గీత రాజ‌కీయ ప్రస్థానం ముగిసింద‌ని అంతా భావించారు. టీడీపీలో గేట్లు మూసుకుపోవ‌డంతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఎన్నిక‌ల స‌మ‌యం ద‌గ్గర ప‌డిన ఆఖరి నిమిషంలో వంగా గీతకు జ‌గ‌న్ పిలిచి మ‌రీ ఎంపీ సీటు ఇచ్చారు. టీడీపీ అభ్యర్థి సునీల్ వ‌రుస‌గా రెండుసార్లు ఓడిపోయి ఉండ‌డంతో అత‌డిపై సానుభూతి కూడా ఉంది. అయితే అంత‌కు మించి బ‌లంగా వీచిన వైసీపీ వేవ్‌లో వంగా గీత 23 వేల ఓట్ల మెజార్టీతో గెలిచారు. వైసీపీ వేవ్‌…. తెలుగుదేశం నేత‌ల‌తో ఉన్న విస్తృత పరిచయాలు, అదేవిధంగా కాపు నేతగా అన్ని పార్టీల్లోని నేతలతో ఉన్న సంబంధాల‌తో ఆమె ఎంపీగా విజ‌యం సాధించి తిరిగి త‌న ప‌ట్టు నిలుపుకున్నారు. మొత్తానికి క‌నుమ‌రుగు అయిపోయింద‌నుకున్న వంగా గీత కాస్తా రాత మార్చుకుని ఎంపీ అయ్యారు.

Tags:    

Similar News