వంగా గీత చూపంతా దానిపైనేనట?

మంత్రి ప‌ద‌వి అంటే ఎవ్వరికి మాత్రం మోజు ఉండ‌దు. రాజ‌కీయాల్లో ఎన్ని ప‌ద‌వులు చేప‌ట్టినా మంత్రిగా కొన్ని రోజులు ఉన్నా చాల‌ని చాలా మంది క‌ల‌లు కంటూ [more]

Update: 2021-01-25 06:30 GMT

మంత్రి ప‌ద‌వి అంటే ఎవ్వరికి మాత్రం మోజు ఉండ‌దు. రాజ‌కీయాల్లో ఎన్ని ప‌ద‌వులు చేప‌ట్టినా మంత్రిగా కొన్ని రోజులు ఉన్నా చాల‌ని చాలా మంది క‌ల‌లు కంటూ ఉంటారు. అయితే ఈ క‌ల తీరేది కొంద‌రికి మాత్రమే.. ఇప్పుడు కాకినాడ వైసీపీ ఎంపీ వంగా గీత కూడా ఈ క‌లే కంటున్నార‌న్న చ‌ర్చలు స్థానికంగా వినిపిస్తున్నాయి. ప్రస్తుతం పిఠాపురం ఎమ్మెల్యేగా పెండెం దొర‌బాబు ఉన్నారు. 2019 ఎన్నిక‌ల్లో ఫ్యాన్ గాలి వీయ‌డంతో పాటు స్థానిక ఎమ్మెల్యే వ‌ర్మపై ఉన్న వ్యతిరేక‌త‌తో దొర‌బాబు విజ‌యం సాధించారు. అప్పుడెప్పుడో 2004లో బీజేపీ నుంచి విజ‌యం సాధించిన దొర‌బాబు మ‌ళ్లీ 15 ఏళ్లకు అసెంబ్లీ మెట్లెక్కారు. మృదుస్వభావిగా పేరున్న ఆయ‌న నియోజ‌క‌వ‌ర్గాన్ని అభివృద్ధి చేస్తాడ‌ని అనుకుంటే.. చివ‌ర‌కు అటు నియోజ‌క‌వ‌ర్గ ప్రజ‌ల‌కు, పార్టీ కేడ‌ర్‌కు అందుబాటులో లేకుండా పోయాడ‌ని పార్టీ వ‌ర్గాలు అస‌హ‌నంతో ఉన్నాయి.

ప్రజలకు దూరంగా…..

ఎమ్మెల్యే అయ్యాక త‌న సొంత వ‌ర్గానికి కూడా దూరం అయిన ప‌రిస్థితి. కార్యక‌ర్త‌లు బ‌హిరంగంగానే విమ‌ర్శిస్తున్నారు. చివ‌ర‌కు గొల్లప్రోలు జ‌డ్పీటీసీగా పోటీ చేస్తోన్న సొంత పార్టీ నేత బుల్లి బాబ్జీ ఎమ్మెల్యేపై విమ‌ర్శలు చేసి సంచ‌ల‌నం రేపాడు. ఎమ్మెల్యే దొర‌బాబు ఆయ‌న అనుచ‌రులు, పీఏ చ‌క్రి ఆధ్వర్యంలో నియోజ‌క‌వ‌ర్గంలో భారీ ఎత్తున అక్రమ గ్రావెల్ త్రవ్వకాలు, మ‌ట్టి త్రవ్వకాలు జ‌రుగుతున్నాయ‌న్న ఆరోప‌ణ‌లు తీవ్రంగా ఉన్నాయి. వీటిని సొంత పార్టీ నేత‌లే బ‌య‌ట పెట్టారు. చివ‌ర‌కు జ‌డ్పీటీసీ అభ్యర్థే ఎమ్మెల్యే నుంచి త‌న‌కు ప్రాణ‌హానీ ఉంద‌ని సెల్ఫీ వీడియో రిలీజ్ చేయ‌డం జిల్లా వైసీపీ వ‌ర్గాల్లో సంచ‌ల‌నంగా మారింది. క‌రోనా స‌మ‌యంలో దొర‌బాబు నియోజ‌క‌వ‌ర్గానికి దూరంగా ఉండ‌డం కూడా ప్రజ‌లు, పార్టీ కేడ‌ర్‌కు ఆయ‌న‌తో దూరం పెంచింది.

పిఠాపురంపై గీత‌కు….

పిఠాపురం నియోజ‌క‌వ‌ర్గంతో ఎంపీ వంగా గీత‌కు ఎంతో అనుబంధం ఉంది. 2009 ఎన్నిక‌ల్లో ప్రజారాజ్యం పార్టీ నుంచి పోటీ చేసిన వంగా గీత‌ ఎమ్మెల్యేగా గెలిచారు. అప్పటి నుంచి ఇక్కడ ఆమెకు ప్రత్యేక‌మైన అనుబంధం ఉంది. కాకినాడ పార్లమెంటు ప‌రిధిలో ఏడు సెగ్మెంట్లు ఉన్నా వంగా గీత‌ మాత్రం ప్రత్యేకంగా పిఠాపురంపై ప్రేమ చూపిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ ప‌థ‌కాల అమ‌లుపై శ్రద్ధ చూపించ‌డంతో పాటు త‌న నిధుల‌ను కూడా ఇక్కడే ఎక్కువుగా వెచ్చిస్తున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేపై ప్రస్తుతం కేడ‌ర్‌లో ఉన్న వ్యతిరేక‌త‌ను క్యాష్ చేసుకునేందుకు చాప‌కింద నీరులా పావులు క‌దుపుతున్నార‌ట‌.

ఇప్పటి నుంచే….

వంగా గీత‌ ఇప్పటికే జ‌డ్పీచైర్‌ప‌ర్సన్‌, రాజ్యస‌భ ఎంపీ, ఎమ్మెల్యే.. ఇప్పుడు లోక్‌స‌భ స‌భ్యురాలిగా ఉన్నారు. ఇన్ని ప‌ద‌వులు చేప‌ట్టినా ఆమె మ‌న‌సులో మాత్రం మంత్రి ప‌ద‌వి చేప‌ట్టాల‌న్న కోరిక‌తో ఉన్నార‌ట‌. దీనికోసం ఇప్పటి నుంచే పిఠాపురంపై ప్రత్యేకంగా దృష్టి పెడుతూ అక్కడ రాజ‌కీయాల్లో ఏం జ‌రుగుతోందో ఓ కంట గ‌మ‌నిస్తున్నార‌ట‌. వంగా గీత‌ ప్రత్యేకంగా దొర‌బాబును టార్గెట్ చేయ‌క‌పోయినా అక్కడ ప‌రిణామాల‌ను త‌న‌కు అనుకూలంగా మ‌లుచుకునేందుకు వ్యూహాత్మకంగా ముందుకు వెళుతున్నార‌ట‌. మ‌రి వంగా గీత‌ మంత్రి ప‌ద‌వి కోరిక నెర‌వేరుతుందా ? లేదా ? అన్నదానిని కాల‌మే నిర్ణ‌యించాలి.

Tags:    

Similar News