వారిద్దరూ అటల్, అద్వానీలు కారుగా ?

భారతీయ జనతా పార్టీ అంటే విలువలకు పట్టం కట్టే పార్టీ. క్రమశిక్షణకు పెట్టింది పేరు. ఆరెస్సెస్ నేపథ్యంలో పుట్టి శ్యాం ప్రసాద్ ముఖర్జీ, అటల్ బిహారి వాజ్ [more]

Update: 2019-06-21 18:29 GMT

భారతీయ జనతా పార్టీ అంటే విలువలకు పట్టం కట్టే పార్టీ. క్రమశిక్షణకు పెట్టింది పేరు. ఆరెస్సెస్ నేపథ్యంలో పుట్టి శ్యాం ప్రసాద్ ముఖర్జీ, అటల్ బిహారి వాజ్ పేయి, ఎల్ కె అద్వానీ వంటి వారి ఆదర్శాలతో నడిచే పార్టీ. ఈ సంప్రదాయాలు ఇప్పుడు పాత చింతకాయ పచ్చడి అంటుంది నరేంద్ర మోడీ సారధ్యంలోని కాషాయ దళం. నీతులు మా పార్టీకైనా కాంగ్రెస్ చేసినప్పుడు దేశ వాసులు ఏమి పీకారన్న రీతిలో అడుగులు వడివడిగా నయా రాజకీయాలపై వేస్తూ ప్రత్యర్థులకు వణుకు పుట్టిస్తుంది. బిజెపి కూడా రాజకీయ పార్టీ నే అని ఛారిటీ సంస్థ కాదని ఒక సందర్భంలో రామ్ మాధవ్ తెలంగాణ లో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు అందరికి అర్ధం అవుతున్నాయి. ఆపరేషన్ ఆకర్ష్ ద్వారా దేశ వ్యాప్తంగా ఫిరాయింపులపై పెద్ద చర్చకే బిజెపి తెరతీసింది. పేరుకు బిజెపి అయినా తాము కాంగ్రెస్ సంప్రదాయాలను కొనసాగించడంలో ఏ మాత్రం వెన్నక్కి తగ్గేది లేదని తేల్చి కొత్త సవాల్ ను ప్రజాస్వామ్యవాదులకు విసురుతుంది కమలం.

ఒక్క ఓటు తేడా వున్నా ….

గతంలో అటల్ బిహారి వాజ్ పేయి పై జయలలిత ఎన్డీయే లొంచి బయటకు వచ్చి అవిశ్వాస తీర్మానం వచ్చేలా చేశారు. నాడు అటల్ సర్కార్ కి మెజారిటీ కి ఒక్కఓటు తేడా ఉందని తెలిసినా ఎలాంటి ప్రలోభాలకు తెరతీయలేదు. ప్రభుత్వం ఉంటే ఉంటుంది పోతే పోతుందని పక్క పార్టీ ఎంపీల కొనుగోలుకు ఎలాంటి ఆదేశాలు కానీ ప్రలోభాలకు ప్రయత్నం చేయనీయలేదు ఆయన. నాటి అవిశ్వాసం ఓటింగ్ లో ఒడిస్సా ముఖ్యమంత్రి గిరిధర్ గొమాంగో ఓటు చెల్లదని తెలిసినా స్పీకర్ బాలయోగి కి ఎలాంటి సూచనలు ఆయన చేయలేదు. గొమాంగో ను ఓటు చేయనీయకుండా స్పీకర్ ద్వారా అడ్డుకునే వీలు వున్నా అటల్ బిహారి వాజ్ పేయి విలువలకు కట్టుబడి దేశ రాజకీయాల్లో శిఖర సమానమైపోయారు. అత్యున్నత పార్లమెంటరీ విలువలకు ప్రతిరూపంగా నిలిచి ప్రజల గుండెల్లో ఉండిపోయారు. ఆ విలువలే ఆయన తిరిగి అధికారంలోకి రావడానికి దోహదం చేశాయి.

మోడీ , షా మార్క్ అది కాదు …

ముల్లును ముల్లుతోనే తీయాలి. అఖండ భారత్ అంతా బిజెపి పాలన కిందకు తేవాలి. ఇదే ఇప్పుడు నరేంద్ర మోడీ, అమిత్ షా ల లక్ష్యం. అందుకోసం ఎలాంటి రాజకీయాలకు దిగినా తప్పులేదన్నది వారి ఆలోచన. మడికట్టుకుని కూర్చోవడం కాదు ప్రతి రాష్ట్రంలో కాషాయ జండా ఎగురవేసి ప్రత్యర్థులను నిర్వీర్యం చేసే ఎత్తుగడ వారిది. దానికోసమే పార్టీలో తమ అగ్రనేతలు నెలకొల్పిన సంప్రదాయాలను పూర్తిగా పక్కన పెట్టి అన్ని పార్టీలకు తొడకొట్టారు మోడీ, షా టీం. ఆ ఫలితమే ఫిరాయింపులు, ప్రలోభాలు, బెదిరింపులు సిబిఐ,ఈడీ వంటి అన్ని సంస్థలను పూర్తిగా వినియోగంలో పెట్టేశారు. కమలం అదృష్టం కొద్ది ప్రస్తుత రాజకీయాల్లో ప్రజాసేవకు జీవితాలు అంకితం చేసేవారు వేళ్ళమీద లెక్కపెట్టొచ్చు. అత్యధికం రాజకీయాలను వ్యాపారం గా చేసుకుని వచ్చేవారే కావడం వారు కాంట్రాక్టులు కోసం అధికారపార్టీ పంచనే ఉండేందుకు తహతహ లాడటం మరింత కలిసొచ్చింది.

Tags:    

Similar News