ఇక్కడ వీక్ అవుతారా? స్వీప్ చేస్తారా..?

గత ఎన్నికల్లో టీడీపీకి ఏకపక్షంగా అండగా ఉంది ఉత్తరాంధ్ర. విశాఖపట్నం, విజయనరం, శ్రీకాకుళం జిల్లాల్లోని మొత్తం 34 స్థానాల్లో తెలుగుదేశం పార్టీ 24 స్థానాల్లో, ఆ పార్టీ [more]

Update: 2019-01-28 14:30 GMT

గత ఎన్నికల్లో టీడీపీకి ఏకపక్షంగా అండగా ఉంది ఉత్తరాంధ్ర. విశాఖపట్నం, విజయనరం, శ్రీకాకుళం జిల్లాల్లోని మొత్తం 34 స్థానాల్లో తెలుగుదేశం పార్టీ 24 స్థానాల్లో, ఆ పార్టీ మిత్రపక్షంగా బరిలో దిగిన బీజేపీ 1 స్థానంలో విజయం సాధించింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేవలం 9 స్థానాల్లో మాత్రమే దక్కించుకోగలిగింది. ఆ ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి రావడానికి, వైసీపీ ప్రతిపక్షానికే పరిమితం కావడానికి ప్రధాన కారణం ఉత్తరాంధ్ర జిల్లాలు టీడీపీ వైపు నిలబడటమే. అయితే, ఈ ప్రాంతంలోనూ తమ పట్టును నిలపుకుని ఈ ఎన్నికల్లోనూ సత్తా చాటాలని టీడీపీ ఉవ్విళ్లురుతుంటే… గత ఎన్నికల్లో చేజారిన ఉత్తరాంధ్రలో మెజారిటీ స్థానాలు సాధించాలని వైఎస్సార్ కాంగ్రెస్ భావిస్తోంది. ఇక, జనసేన పార్టీ కూడా ఉత్తరాంధ్రపై ఎక్కువగానే ఆశలు పెట్టుకుంది. అయితే, ఉత్తరాంధ్ర జిల్లాలపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ దృష్టి సారించింది. ఈ మూడు జిల్లాల్లో ఆధిపత్యం ప్రదర్శించేందుకు వ్యూహాలు రచిస్తోంది. పార్టీ అధినేత జగన్ కూడా ఈ మూడు జిల్లాల్లో సుదీర్ఘంగా పాదయాత్ర నిర్వహించారు. ఆయనకు ప్రజల్లో మంచి స్పందన కూడా లభించింది.

విశాఖపట్నంలో బలహీనంగానే…

ఉత్తరాంధ్రలో ప్రధానంగా విశాఖపట్నం జిల్లాలో 15 స్థానాలు ఉన్నాయి. వీటిల్లో గత ఎన్నికల్లో టీడీపీ – బీజేపీ 12 స్థానాలు గెలవగా వైసీపీ కేవలం 3 స్థానాల్లో మాత్రమే విజయం సాధించింది. ముఖ్యంగా విశాఖపట్నం నగరంలో టీడీపీ హవా వీచింది. వైసీపీ పూర్తిగా చతికిలిపడింది. అయితే, ఈ జిల్లాలోని ఎజెన్సీ ప్రాంతంలో మాత్రం వైసీపీ బలం చాటుకుంది. ఆ పార్టీ గెలిచిన మూడు నియోజకవర్గాలూ ఏజెన్సీలోనివే. కానీ, తర్వాత ఫిరాయింపుల వల్ల ఆ పార్టీకి నష్టం జరిగింది. అయినా క్యాడర్, గిరిపుత్రుల్లో వైసీపీ పట్ల అభిమానం మాత్రం కనిపిస్తోంది. ఏజెన్సీ నియోజకవర్గాల్లో వైసీపీ ఇప్పటికీ బలంగానే ఉంది. కానీ, విశాఖపట్నం అర్బన్, ఇతర నియోజకవర్గాల్లో మాత్రం పార్టీ ఇంకా బలహీనంగానే కనిపిస్తోంది. ఈ మధ్య కొందరు నేతలు చేరినా వారి బలం పార్టీ విజయానికి సరిపోదు. ఇదే సమయంలో టీడీపీ మంచి పట్టు ఏర్పరుచుకుంది. అయితే, ఈసారి మోదీ, పవన్ టీడీపీతో లేకపోవడం ఫలితాలు ఆ పార్టీకి గత ఎన్నికల మాదిరి ఏకపక్షంగా ఉండే అవకాశాలు తక్కువే అంటున్నారు. అయితే, వైసీపీకి ఇప్పుడున్న బలంతో ఏజెన్సీని మినహాయించి మిగతా నియోజకవర్గాల్లో మెజారిటీ స్థానాలు దక్కించుకోవడం కష్టంగానే కనిపిస్తోంది.

రెండు జిల్లాల్లో పెరిగిన బలం…

ఇక, విజయనగరం జిల్లాలో గతంలో కంటే వైసీపీ బాగా బలపడినట్లు కనిపిస్తోంది. జిల్లాలో పట్టున్న బొత్స కుటుంబం వైసీపీలో చేరడంతో నాలుగైదు నియోజకవర్గాల్లో పార్టీ బలం పెరిగింది. గత ఎన్నికల్లో జిల్లాలోని తొమ్మిది స్థానాల్లో వైసీపీ 3 స్థానాలు మాత్రమే గెలుచుకుంది. అందులో బొబ్బిలి మినహా మిగతా రెండూ ఏజెన్సీ నియోజకవర్గాలే. ఈ రెండు నియోజకవర్గాల్లో మళ్లీ వైసీపీకి మొగ్గు కనిపిస్తోంది. అయితే బొబ్బిలి ఎమ్మెల్యే టీడీపీలోకి చేరడంతో అక్కడ ఆ పార్టీ బలంగా ఉంది. అ యితే, గత ఎన్నికల కంటే ఈసారి వైసీపీకి ఫలితాల మెరుగయ్యే అవకాశాలు మాత్రం కనిపిస్తున్నాయి. ఇక, అదే సమయంలో జిల్లా వైసీపీ నేతల మధ్య వర్గపోరు, సమన్వయలేమి పార్టీని దెబ్బతీసే అవకాశం ఉంటుంది. ఇవి దూరం చేసుకుంటే ఈసారి వైసీపీ మెజారిటీ స్థానాలు దక్కించుకోవడం పెద్ద కష్టమేమీ కాదంటున్నారు. ఇక, శ్రీకాకుళం జిల్లాలో ధర్మాన కుటుంబం, ఇతర బలమైన నాయకులు వైసీపీలో ఉన్నారు. అయితే, గత ఎన్నికల్లో ఆ పార్టీ 10 స్థానాల్లో కేవలం మూడు స్థానాల్లో మాత్రమే వైసీపీ గెలిచింది. ఈసారి కూడా ఈ నియోజకవర్గాల్లో వైసీపీ బలంగానే ఉంది. ఇక, గత ఎన్నికల్లో ఓడిన ధర్మాన కుటుంబం ఈసారి సత్తా చాటితే పార్టీ పరిస్థితి మెరుగవుతుంది. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలో జగన్ పాదయాత్రకు కూడా మంచి స్పందన వచ్చింది. ప్రత్యేకించి శ్రీకాకుళంలో ఆయన 50 రోజులకు పైగా పాదయాత్ర నిర్వహించారు. దీంతో కొంత ఆ పార్టీకి కొంత అనుకూలత పెరిగింది. ఇప్పటివరకైతే విశాఖపట్నం మినహా విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో వైసీపీ కొంత మెరుగైనట్లు స్పష్టమవుతోంది.

Tags:    

Similar News