ఉత్తమ్ పదవికి మూడినట్లేనా…?

తెలంగాణ ఎన్నికల్లో పరాజయం తర్వాత కాంగ్రెస్ పార్టీలో పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి క్లిష్ట పరిస్థితులనే ఎదుర్కొంటున్నారు. పార్టీ దారుణంగా ఓడిపోవడంతో ఆయన సమాధానం చెప్పుకోలేని [more]

Update: 2019-01-20 02:30 GMT

తెలంగాణ ఎన్నికల్లో పరాజయం తర్వాత కాంగ్రెస్ పార్టీలో పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి క్లిష్ట పరిస్థితులనే ఎదుర్కొంటున్నారు. పార్టీ దారుణంగా ఓడిపోవడంతో ఆయన సమాధానం చెప్పుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు. ఇదే సమయంలో సర్వే సత్యనారాయణ వంటి సీనియర్ నేత ఉత్తమ్ పై ఘాటుగా స్పందిస్తున్నారు. ఉత్తమ్ వల్లే పార్టీ ఓడిందని, ఆయనను వెంటనే తప్పించాలని డిమాండ్ చేస్తున్నారు. వాస్తవానికి, ఎన్నికల్లో ఓడిపోతే తాను మళ్లీ గాంధీ భవన్ లో అడుగుపెట్టనని ఉత్తమ్ సవాల్ విసిరారు. అయితే ఎన్నికల వేళ పార్టీలో ఉత్సాహాన్ని నింపడానికి నాయకులు ఇటువంటి సవాళ్లు విసరడం సహజమే అయినా ఓటమతో నైరాశ్యంలో ఉన్న క్యాడర్ లో ఉత్తమ్ మళ్లీ ఉత్సాహం నింపగలరా..? పార్లమెంటు ఎన్నికలు సమీపిస్తున్నందు నేతలను ఎన్నికలకు సిద్ధం చేయగలరా..? అనే ప్రశ్నలు పార్టీ నేతలు లేవనెత్తుతున్నారు.

అధిష్ఠానం నమ్మకంతో…

2014 ఎన్నికల సమయంలో ఉత్తమ్ పీసీసీ వర్కింగ్ ప్రసిడెంట్ గా ఉన్నారు. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడినా ఉత్తమ్ కి ప్రమోషన్ ఇచ్చింది కాంగ్రెస్ అధిష్ఠానం. నాలుగేళ్లుగా ఉత్తమ్ సారథ్యంలో వచ్చిన ఉపఎన్నికలు, పలు కార్పొరేషన్ల ఎన్నికల్లో కాంగ్రెస్ దారుణంగా ఓడింది. దీంతో ఇటీవలి ఎన్నికలకు ముందువరకు ఉత్తమ్ ను పీసీసీ అధ్యక్ష పదవి నుంచి తొలగించాలని సీనియర్ నేతలు చాలా మంది డిమాండ్ చేశారు. ఇక, కోమటిరెడ్డి సోదరులైతే ఉత్తమ్ నాయకత్వాన్ని చాలారోజుల పాటు అంగీకరించలేదు. పలుమార్లు విఫలమైన ఉత్తమ్ ను ఎన్నికల వరకు పీసీసీ అధ్యక్షుడిగా కొనసాగించవచ్చని కోరారు. పైకి కొందరే మాట్లాడినా అంతర్గతంగా చాలామంది నేతలు ఉత్తమ్ ను తప్పించి తమకు పీసీసీ చీఫ్ పదవి ఇవ్వాలని కాంగ్రెస్ అధిష్ఠానాన్ని కోరుతూ వచ్చారు. కానీ, ఉత్తమ్ పైనే భరోసా పెట్టుకున్న కాంగ్రెస్ ఆయన సారథ్యంలోనే ఇటీవలి అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లింది. ఉత్తమ్ కి ఎన్నికల్లోనూ మంచి ప్రాధాన్యతే ఇచ్చింది.

పార్లమెంట్ ఎన్నికల వరకు సేఫ్

అయితే, ఈ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ ఓడింది. అయినా, ఉత్తమ్ కుమార్ రెడ్డి మాత్రం సేఫే అంటున్నారు. పార్లమెంటు ఎన్నికల వరకైతే ఉత్తమ్ నాయకత్వాన్ని కొనసాగించాలని కాంగ్రెస్ అధిష్ఠానం భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఎన్నికల్లో ఓటమికి ఉత్తమ్ ఒక్కరే కారణమైతే ఆయనను తొలగించే వారేమో కానీ కాంగ్రెస్ ఓటమికి చాలా కారణాలే ఉన్నాయి. పైగా దారుణంగా ఓడిపోవడం వల్ల ఉత్తమ్ ని ఒక్కరినే బాధ్యుడిని చేయడం కూడా సరికాదంటున్నారు. పైగా ఎన్నికల ముందు ఉత్తమ్ ను తొలగించాలని గట్టిగా డిమాండ్ చేసిన వారు కూడా ఇప్పుడు సైలెంట్ అయిపోయారు. సర్వే సత్యనారాయణ వంటి ఒకరిద్దరు మాత్రమే ఉత్తమ్ ను దించేయాల్సిందే అని డిమాండ్ చేస్తున్నారు. అయితే, పార్లమెంట్ ఎన్నికలకు ఎక్కువగా సమయం లేకపోవడంతో ఇప్పుడు పీసీసీ చీఫ్ ను మార్చే అవకాశమైతే లేనట్లు కనిపిస్తోంది. పార్లమెంట్ ఎన్నికల తర్వాత అయి పీసీసీని పూర్తిగా ప్రక్షాళన చేసే అవకాశం ఉందని రాష్ట్ర కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు.

Tags:    

Similar News