ఇంత జరుగుతుంటే…ఉండవల్లి ఎక్కడ…?

ఉండవల్లి అరుణ్‌ కుమార్‌. రెండు సార్లు ఎంపీగా రాజమండ్రి నుంచి విజయం సాధించిన ఆయన రాష్ట్ర విభజ న తర్వాత కాంగ్రెస్‌ పార్టీకి దూరమై.. రాజకీయాల్లో ఒక [more]

Update: 2019-08-05 05:00 GMT

ఉండవల్లి అరుణ్‌ కుమార్‌. రెండు సార్లు ఎంపీగా రాజమండ్రి నుంచి విజయం సాధించిన ఆయన రాష్ట్ర విభజ న తర్వాత కాంగ్రెస్‌ పార్టీకి దూరమై.. రాజకీయాల్లో ఒక విశ్లేషకుడిగా మిగిలిపోయారు. ప్రస్తుతం పార్టీలకు తటస్థంగా ఉన్న ఆయన.. ఎప్పటికప్పుడు తాజా రాజకీయ పరిస్థితులను క్షుణ్ణంగా అధ్యయనం చేయడం, వాటి పై నిశిత విమర్శలు చేయడం ఉండవల్లికి రాజకీయంగా అబ్బిన ప్రధాన లక్షణం ఈ క్రమంలోనే ఉండవల్లి అరుణ్‌ కుమార్‌ ఇటు చంద్రబాబు ప్రభుత్వాన్ని, అటు కేంద్రంలోని నరేంద్రమోడీ ప్రభుత్వాన్ని కూడా విశ్లేషించి తూర్పారబట్టిన పరిస్థితులు చాలానే ఉన్నాయి.

పోలవరం ప్రాజెక్టు విషయంలో….

మరీ ముఖ్యంగా ఏపీలో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న పోలవరం ప్రాజెక్టు విషయంలో ఆయన మరింత ఎక్కువగా స్పందించేవారు. పోలవరం జీవనాడి అని.. దీని నిర్మాణంలో పెద్ద ఎత్తున దోచేస్తున్నారని, అవసరం లేకున్నా ప్రాజెక్టు వ్యయాన్ని పెంచేస్తున్నారని ఉండవల్లి అరుణ్‌ కుమార్‌ ఆరోపించిన సందర్భాలు అనేకం ఉన్నాయి. అదేసమయంలో ప్రభుత్వాలకు రాష్ట్ర విభజన హక్కులు, కేంద్రం నుంచి రావాల్సిన నిధుల విషయంలో నిలదీసిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇటీవల ఏపీలో ఎన్నికల ఫలితాలు వచ్చే వరకు దేశంలోనే ఉన్న ఉండవల్లి అరుణ్‌ కుమార్‌ జగన్‌కు కొన్ని సూచనలు కూడా చేశారు.

పట్టిసీమలో లోపాలు….

ఇక పోల‌వ‌రంకు బ‌దులుగా తాత్కాలికంగా చంద్రబాబు ప్రభుత్వం నిర్మించిన ప‌ట్టిసీమ ఎత్తిపోత‌ల‌పై, ఆ ప‌థ‌కంలో జ‌రిగిన అవినీతిపై ఉండవల్లి అరుణ్‌ కుమార్‌ తీవ్ర విమ‌ర్శలు చేశారు. ప‌ట్టిసీమ‌లో ఉన్న లోపాలు, లొసుగులు అన్నింటిని మీడియా ముఖంగా ఎన్నోసార్లు బ‌హిరంగంగా చెప్పారు. ఇక సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టకముందుగానే అవినీతిని అంతం చేస్తామని జగన్‌ ప్రకటించడంపై ఉండవల్లి అరుణ్‌ కుమార్‌ హర్షం వ్యక్తం చేశారు. అనంతరం ఆయన అమెరికా వెళ్తున్నట్టు మీడియాతో చెప్పుకొచ్చారు.

ప్రాజెక్టుపై……

అయితే, అమెరికా వెళ్లిన ఉండవల్లి అరుణ్‌ కుమార్‌ తాను 40 రోజుల్లోనే ఇండియాకు వస్తానని చెప్పినా.. ఇప్పటి వరకు మాత్రం ఆయన మీడియాలో ఎక్కడా కనిపించలేదు. పైగా.. ఇప్పుడు పోలవరం విషయంపై అటు కేంద్రం ఇటు, రాష్ట్రం కూడా సంచలన నిర్ణయాలు, వ్యాఖ్యల దిశగా అడుగులు వేస్తున్న నేపథ్యంలో దీనిపై అనేక ప్రెస్‌ మీట్లు పెట్టి వ్యాఖ్యానించిన, అనేక సూచనలు చేసిన ఉండవల్లి అరుణ్‌ కుమార్‌ లేక పోవడాన్ని రాజమండ్రి వాసులే కాకుండా రాష్ట్రంలోని కీలకమైన రాజకీయ నేతలు కూడా ఉసూరు మంటున్నారు. ప్రస్తుతం జగన్‌ ప్రభుత్వం ప్రాజెక్టు నుంచి నవయుగ కంపెనీని తప్పించింది. ఈ నేపథ్యంలో కేంద్రం రాష్ట్రంపై ఫైరైంది. ఇలా అయితే, ఎలా? అంటూ మంత్రి పార్లమెంటులో నే నిట్టూర్పు విడిచారు. అయితే అవినీతిని ప్రోత్సహించాలా? అనేది జగన్‌ ప్రభుత్వ వాదన. ఈ నేపథ్యంలో ఉండవల్లి అరుణ్‌ కుమార్‌ వ్యాఖ్యలు మిస్‌ కావడం కొంత ఇబ్బందిగానే ఉందని అంటున్నారు విశ్లేషకులు. మ‌రి ఈ విష‌యంలో ఉండ‌వ‌ల్లి అరుణ్ కుమార్ ఇప్పట‌కీయినా స్పందిస్తారేమో చూడాలి.

Tags:    

Similar News