ఉండవల్లికి జగన్ అండ

ఉందవల్లి అరుణ్ కుమార్ రాజకీయంగా రాటుదేలిన నేత. ఆయన వైఎస్సార్ కి అభిమాన పాత్రుడు. ఆయన కుమారుడు జగన్ అంటే కూడా ఉండవల్లి అరుణ్ కుమార్ ఎనలేని [more]

Update: 2020-01-25 03:30 GMT

ఉందవల్లి అరుణ్ కుమార్ రాజకీయంగా రాటుదేలిన నేత. ఆయన వైఎస్సార్ కి అభిమాన పాత్రుడు. ఆయన కుమారుడు జగన్ అంటే కూడా ఉండవల్లి అరుణ్ కుమార్ ఎనలేని అభిమానం చూపిస్తారు. ఆయన ఆ విషయాన్ని ఎక్కడా దాచుకోరు. తాను జగన్ పక్షపాతినని, అందువల్ల ఆయన పాలన మీద మార్కులు సరిగ్గా వేయలేనని కూడా క్లారిటీగానే చెప్పేస్తారు. అటువంటి ఉండవల్లి అరుణ్ కుమార్ పోరుకు జగన్ అండగా ఉంటారా అన్న చర్చ ఇపుడు ఏపీ రాజకీయాల్లో సాగుతోంది.

మళ్ళీ మార్గదర్శి…

మార్గదర్శి కేసు విషయం మరో మారు చర్చకు వస్తోంది. ఈ కేసు విషయంలో సుప్రీం కోర్టు తాగాజా కీలకమైన ఆదేశాలను జారీ చేసింది. మార్గదర్శి కేసులో ఏపీ సర్కార్ని ప్రతి వాదిగా చేర్చింది. ఈ పరిణామం సహజంగానే మార్గదర్శి అధినేత రామోజీవావుకు ఇబ్బందిని కలిగించేదే అంటారు. వైఎస్ కుటుంబంతో వ్యక్తిగత వైరాన్ని పెంచుకున్న రామోజీరావుని తండ్రి వైఎస్ హయాంలో కోర్టుల దాకా తెచ్చారు. ఆయన మరణించడం, హైకోర్టులో నుంచి స్టే తెచ్చుకోవడంతో కధ ముగిసిందని అంతా అనుకున్నారు. అయితే దాని మీద పోరాడిన ఉండవల్లి సుప్రీం కోర్టుకు వెళ్ళి మళ్ళీ కేసుని కీలకదశకు తెచ్చారు. ఇక ఈ కేసు ఉమ్మడి ఏపీకి చెందినందున ఏపీ సర్కార్ ని కూడా ప్రతివాదిగా చేర్చాలన్న ఉండవల్లి అరుణ్ కుమార్ కోరికని సుప్రీం మన్నించింది. ఇదే ఇపుడు పెద్ద చర్చగా ఉంది.

గట్టిగా నిలబడితే…

జగన్ ఈ కేసు విషయంలో గట్టిగా నిలబడితే ఉండవల్లి అరుణ్ కుమార్ మరో మారు చెలరేగిపోతారని అంటున్నారు. నాడు కేసు ఉండవల్లి అరుణ్ కుమార్ వేసినా వెనక బలమంతా వైఎస్ దేనని అంటారు. ఇపుడు కొడుకు ముఖ్యమంత్రిగా ఉన్నారు. మళ్ళీ ఆ కేసు తెర మీదకు వచ్చింది. పైగా సుప్రీం ఏపీ సర్కార్ ని కూడా చేర్చింది. ఇక జగన్ సైతం ఆ రెండు పత్రికల మీద గట్టిగానే పోరాడుతున్నారు. దాంతో ఆయనకు కూడా కలసివచ్చేలా ఉండవల్లి కేసు ఉందని అంటున్నారు. అంటే మళ్ళీ ఒక ప్రభుత్వం తన వెనక ఉంచుకుని ఉండవల్లి బరిలోకి దిగుతున్నారన్న మాట. అదే జరిగితే రామోజీరావుకు చిక్కులు తప్పవని అంటున్నారు.

ఇదీ కధ …

మార్గదర్శి ఫైనాన్షియర్స్‌ చైర్మన్ రామోజీరావు నిబంధలకు విరుధ్ధంగా డిపాజిట్లు సేకరించార‌న్న దానిపైన 2008లో అప్పటి కాంగ్రెస్ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ హై కోర్టుని ఆశ్రయించారు. దాని మీద కేసు సీరియస్ గా ఉన్న దశలోనే వైఎస్ దుర్మరణం పాలు కావడం జరిగింది. ఆ తరువాత రామోజీ రావు డిశ్చార్జ్‌ పిటిషన్ తో ఉపశమనం పొందారు. ఈ కేసు నుంచి రామోజీరావుని డిశ్చార్జ్‌ చేయడాన్ని సవాల్ చేస్తూ మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌ కుమార్ గతంలో పిటిషన్‌ను దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ పిటిషన్‌పై జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ ఎంఆర్ షాతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది రిజర్వు బ్యాంకు ప్రత్యేక అధికారిని కూడా ఇందులో భాగస్వామ్యం చేయాలని న్యాయస్థానం ఆదేశాలు ఇచ్చింది. ఈ మేరకు సవరించిన మెమోను దాఖలు చేయాలని ఆదేశిస్తూ తదుపరి విచారణకు రెండు వారాలకు వాయిదా వేసింది. ఈ కేసులో మార్గదర్శి ఫైనాన్షియర్స్ సంస్థ ,రామోజీరావు పలు స్టేలు పొందుతూ వచ్చారని, ఇప్పుడు సుప్రింకోర్టు ఈ ఆదేశాలు ఇచ్చిందని అరుణకుమార్ అన్నారు. ఎప్పటికైనా ఎంతటి వారైనా కూడా కేసుల నుంచి తప్పించుకోలేరని ఆయన అనడం విశేషం. ఈ కేసులో కనుక తప్పు రుజువై తీర్పు వస్తే ఏడు వేల కోట్ల రూపాయల భారీ జరీమానాతో పాటు రెండున్నరేళ్ళ జైలు శిక్ష కూడా ఉంటుంది. ఇపుడు ఏపీ రాజకీయాల్లో ఇది హాట్ టాపిక్ గా ఉంది.

Tags:    

Similar News