న్యూట్రల్ అని చెప్పుకోవడానికేనా ఈ తాపత్రయం?

జగన్ అంటే ఇష్టం. ఏపీ సీఎం అంటే ఇష్టం లేదు. ఇదీ మాజీ ఎంపీ, వైఎస్సార్ కి అత్యంత సన్నిహితుడుగా ముద్ర వేసుకున్న ఉండవల్లి అరుణ్ కుమార్ [more]

Update: 2020-06-29 02:00 GMT

జగన్ అంటే ఇష్టం. ఏపీ సీఎం అంటే ఇష్టం లేదు. ఇదీ మాజీ ఎంపీ, వైఎస్సార్ కి అత్యంత సన్నిహితుడుగా ముద్ర వేసుకున్న ఉండవల్లి అరుణ్ కుమార్ తాజా వ్యాఖ్యలు. జగన్ని తాను వైఎస్ కొడుకుగానే ఇష్టపడతాను తప్ప సీఎం గా ఆయన్ని వదిలిపెట్టనని, తనకు చంద్రబాబు ఎలాగో జగన్ కూడా అంతేనని ఉండవల్లి అంటున్నారు. ఏడాది జగన్ పాలన మీద ఆయన తనదైన శైలిలో నిప్పులే చెరిగారు. అందులో అధిక శాతం టీడీపీ ప్రతీ రోజూ వల్లె వేస్తున్నవే. ఇక తాను రాజకీయ తటస్థుడిని అనిపించుకోవడానికి ఉండవల్లి అరుణ్ కుమార్ గట్టిగా ప్రయత్నం చేస్తున్నట్లుగా ఉంది. అందుకే జగన్ని ఘాటుగా విమర్శిస్తూ విపక్ష టీడీపీకి ఆనందం కలిగించారు. తన మీడియా మీట్లకు ఎక్కువ వ్యూస్ వస్తున్నాయంటే దానికి చంద్రబాబు ఫ్యాన్స్ కారణమని కూడా చెప్పుకున్నారు. అనుకున్నట్లుగానే ఉండవల్లి తాజాగా చేసిన విమర్శలు అన్నీ టీడీపీ అనుకూల మీడియాలో బాగా హైలెట్ అవుతున్నాయి.

నాడు చెప్పలేదేం….?

ఉండవల్లి అరుణ్ కుమార్ అంటే అందరికీ గౌరవం ఉంది. ఆయన రాజకీయ మర్యాదస్తుడు అని పేరు తెచ్చుకున్నారు. కానీ ఉండవల్లి హఠాత్తుగా జగన్ కి నీతులు చెబుతున్నారు. పాలకుడు అన్న వాడు ప్రజల పక్షం ఉండాలి తప్ప రాజకీయ ప్రత్యర్ధుల మీద పగలూ, ప్రతీకారాలు ఉండరాదని నెల్సన్ మండెలా ఉదంతాన్ని ఉదహరించారు. ఇదంతా బాగానే ఉంది అనుకున్నా నాడు అయిదేళ్ల చంద్రబాబు పాలనలో ప్రత్యర్ధి వైసీపీని చీల్చి చెండాడినపుడు ఇదే మాటలు బాబుకు ఉండవల్లి అరుణ్ కుమార్ ఎందుకు చెప్పలేకపోయారని వైసీపీ నుంచి వస్తున్న ప్రశ్న.

బ్రేకులు వేస్తే…?

నిజానికి జగన్ అధికారంలోకి వచ్చిన తరువాత ప్రజల కోసమే పనిచేస్తూ వస్తున్నారు. ఆయన ఒకసారి అసెంబ్లీలో తప్పించి చంద్రబాబు మీద ఎక్కడా హార్ష్ గా మాట్లాడిన దాఖలాలు లేవు. ఇక ఆయన పధకాలు, విధానాలకు, కార్యక్రమాలకు అడుగడుగునా బ్రేకులు వేస్తున్న తెలుగుదేశం పార్టీని టార్గెట్ చేయకుండా ఎలా ఉండగలరు, ఆయన ప్రజలకు మేలు చేద్దామనుకుని తెచ్చిన పధకాలు కాకుండా చేస్తూంటే మరి యుధ్ధమే చేయాలి కదా. అది కూడా ప్రజల కోసమే కదా అన్న మాట వైసీపీ వైపు ఉంచి వస్తోంది. ఇక జగన్ ఏలుబడిలో ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు గత ఏడాదిలో జరిగాయి. వాటి గురించి టీడీపీ ఎటూ చెప్పదు, కనీసం రాజకీయ పరిశీలకుడిగా ఉన్న ఉండవల్లి అరుణ్ కుమార్ కి కూడా అవి కనబడలేదా అని అంటున్నారు.

ప్రక్షాళన చేస్తే….?

రాజకీయాల్లో అవినీతి వద్దు అని జగన్ అంటూ వచ్చారు. ఆయన అధికారంలోకి వచ్చాక పోలవరం లో రివర్స్ టెండరింగ్ కి వెళ్ళి వందల కోట్ల ఆదాయం మిగిలిచారు. అలాగే అనేక కీలక శాఖలను ప్రక్షాళన చేస్తున్నారు. మరి అవినీతి పునాదులు పెకిలించే పనిని జగన్ చేయవద్దు అని ఉండవల్లి చెప్పదలచారా అన్న ప్రశ్న కూడా ఇపుడు వస్తోంది. అప్పు చేసి పప్పుకూడు అంటూ జగన్ బడ్జెట్ ని ఉండవల్లి అరుణ్ కుమార్ అంటున్నారు, అయిదేళ్ళలో రెండున్నర లక్షల కోట్ల అప్పు తెచ్చి రాష్ట్రాన్ని ముంచేసిన టీడీపీ హాయాం గురించి ఉండవల్లి ఒక్క మాట అనడంలేదేమని కూడా వైసీపీ నుంచే ప్రశ్న వస్తోంది. మొత్తానికి ఉండవల్లి అరుణ్ కుమార్ కి ఏపీ సీఎం గా జగన్ నచ్చకపోవడానికి హేతుబధ్ధమైన కారణాలు ఉంటే చెప్పాలన్న మాట కూడా ఉంది. అన్ని వైపుల నుంచి జగన్ కి రాజకీయంగా శత్రువులు పెరిగిన తరుణంలో వైఎస్సార్ సన్నిహితునిగా ఉండవల్లి సానుకూల విమర్శలు చేస్తే బాగుండేదని, అలా కాకుండా ఆయన టీడీపీకే కొత్త ఆయుధాలు అందిస్తున్నారని వైఎస్సార్ అభిమానులు కూడా వాపోతున్నారు.

Tags:    

Similar News