ఉండవల్లి దారిలో పెట్టినట్లుందిగా?

ఏ అంశం అయినా కుండబద్ధలు కొట్టినట్లు చెప్పడం ఆయనకు అలవాటు. అలాగే అరటిపండు వలచినట్లు క్లిష్టమైన అంశాలను పండిత, పామరులకు చెప్పడంలో ఆయన దిట్ట. ఆయనే మాజీ [more]

Update: 2020-03-27 05:00 GMT

ఏ అంశం అయినా కుండబద్ధలు కొట్టినట్లు చెప్పడం ఆయనకు అలవాటు. అలాగే అరటిపండు వలచినట్లు క్లిష్టమైన అంశాలను పండిత, పామరులకు చెప్పడంలో ఆయన దిట్ట. ఆయనే మాజీ పార్లమెంట్ సభ్యుడు ఉండవల్లి అరుణ కుమార్. క్లిష్ట సమయాల్లో సలహాలు సూచనల కోసం స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి సంప్రదించేవారు. ఆయన అడ్వయిజరీ టీం లో ఉండవల్లిది కూడా చాలా కీలక పాత్రే. పార్టీలో సమస్య వచ్చినా పాలనలో సమస్య వచ్చినా తన అత్యంత సన్నిహితులతో కూడిన కోర్ టీం, క్లోజ్ టీం మార్గదర్శకత్వంలో వైఎస్ నడిచేవారు.

జగన్ ఇప్పుడు పాటిస్తున్నారు …

అలాంటి టీం లో నాడు సభ్యుడైన ఉండవల్లి అరుణ్ కుమార్ గత ఎన్నికలకు ముందు ఆ తరువాత వైఎస్ కుమారుడు ముఖ్యమంత్రి జగన్ కి పలు సూచనలు, సలహాలను మీడియా ద్వారా అందించేవారు. చాలా కాలం వీటిలో కొన్ని పట్టించుకుని కొన్ని వదిలేసిన ఎపి సీఎం ఇటీవల కొంతకాలంగా ఉండవల్లి అరుణ్ కుమార్ చెప్పే అంశాలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారు. రేషన్ కార్డులు రద్దు, పెన్షన్ల తొలగింపు లో ప్రజల్లో ఉన్న అపోహలు ప్రభుత్వానికి వచ్చే చెడ్డ పేరు ఎలా ఉంటుంది మెజారిటీ ఉంది కదా అని ప్రభుత్వాలు దూకుడు గా వెళితే చరిత్ర ఏమి చెప్పిందన్న అంశాలను కొద్ది కాలం క్రితం ఉండవల్లి మీడియా ద్వారానే హెచ్చరించారు. ఆ వెంటనే ముఖ్యమంత్రి పాలనలో మార్పులు చేశారు. తన తండ్రి సన్నిహితుడి మాటలకు పెద్దపీట వేశారు. పర్యవసానంగా సర్కార్ తీరుపై ఫీడ్ బ్యాక్ నెగిటివ్ నుంచి పాజిటివ్ వచ్చింది అని తెలుస్తుంది.

కరోనా పై యుద్ధంలో కూడా …

కరోనా వైరస్ పై ఎపి ప్రభుత్వం చేస్తున్న కృషిని తెలుగు పోస్ట్ ద్వారా ప్రశంసిస్తూ కొన్ని విలువైన సూచనలు, సలహాలు ఇచ్చారు ఉండవల్లి అరుణ్ కుమార్. క్లిష్ట సమయంలో సర్కార్ ఎలా వ్యవహరించాలో చెప్పారు. ప్రజలకు భరోసా కల్పించడానికి పేదలకు అండగా ఉండాలిసిన అవసరం విడమరిచి చెప్పారు. పోలీసులకు సూచనలు చేశారు. కూరగాయలు, నిత్యావసరాలు ఇంటి వద్దకే వచ్చేలా చర్యలు తీసుకోవాలని సూచించారు ఉండవల్లి అరుణ్ కుమార్. సాయం చేసే వారికి అకౌంట్ నెంబర్ ఇచ్చి ప్రచారం చేయాలని కోరారు. తరచూ మీడియా లోకి వచ్చి ప్రజలకు ధైర్యం చెప్పాలన్నారు. జగన్ తన వాలంటీర్ల వ్యవస్థను బ్రహ్మాస్త్రం గా మార్చుకుని తిరుగులేని నేతగా చాటుకునే తరుణం ఆసన్నం అయ్యిందని ప్రజల సంక్షేమానికి వారిని ఎలా వినియోగించాలో వివరించారు.

స్పందించిన జగన్ …

తాజాగా మీడియా ముందుకు వచ్చిన ఎపి సిఎం జగన్ ఉండవల్లి చెప్పిన అన్ని సూచనలను దాదాపు ఆచరణలో పెట్టేశారు. ముందుగా మీడియా ను కలవడం, ఆ తరువాత నేరుగా ప్రజల ముందుకే నిత్యావసరాల ఏర్పాట్లకు అధికారులను ఆదేశించడం, 1902 అనే నెంబర్ టోల్ ఫ్రీ నెంబర్ ప్రకటించి ప్రజలకు ఎలాంటి కష్టం వచ్చినా దానికి డైల్ చేయమని పిలుపునివ్వడం చక చకా జరిగిపోయాయి. కూడు, గూడు లేని వారు ఎవరున్నా కూడా సమాచారం ఇస్తే ఆదుకుంటామని, వ్యాధి లక్షణాలు వున్న వారు దీనికి తెలియచేస్తే వైద్యం అందిస్తామని భరోసా ఇచ్చారు. అలాగే ఎక్కడి వారు అక్కడ ఉంటేనే ప్రభుత్వం ఏ పని అయినా చేయగలుగుతుంది కూడా చెప్పేశారు. వాలంటీర్లతో ఇంటింటికి మరోసారి ఆరోగ్య సర్వే కి ఆదేశించామని వెల్లడించారు. ఇలా ఉండవల్లి అరుణ్ కుమార్ సూచనలు, సలహాలు గౌరవించడం ఇటీవలి కాలంలో జగన్ ఇమేజ్ ను సైతం పెంచుతుంది. క్షేత్ర స్థాయిలో తనకు వచ్చే ఇన్ పుట్స్ తీసుకుని వాటికి పరిష్కారాలను కూడా ఉండవల్లి మీడియా ద్వారా బయటకు చెబుతూ ఉండటం, దానికి తమ అధినేత సానుకూలంగా స్పందించడం కూడా మంచి పరిణామం గా వైసిపి శ్రేణులు సంతోష పడుతున్నాయి. దీనివల్ల ప్రజలకు ఉభయులు ఎంతో మేలు చేస్తున్నారని హర్షం వ్యక్తం చేస్తున్నారు.

బాధితులతో మాట్లాడటమే మిగిలింది …

ఉండవల్లి అరుణ్ కుమార్ చేసిన సూచనలు 90 శాతం అమల్లో పెట్టిన ముఖ్యమంత్రి కరోనా పాజిటివ్ బాధితులతో ఫోన్ లో మాట్లాడలేదు. వారిలో ధైర్యాన్ని పెంచడానికి ఇలాంటి చర్యలు దోహద పడతాయని ఉండవల్లి అరుణ్ కుమార్ సూచించారు. సిఎం, మంత్రులు అలా పలకరించడం ద్వారా బాధితులకు అన్ని విధాలా అండగా ఉంటారన్న భరోసా కలుగుతుందని చెప్పారు ఉండవల్లి. ఇక రేపో మాపో ఈ సూచనను కూడా జగన్ అమల్లో పెట్టేలాగే ఉన్నారు. తాజా మీడియా సమావేశం లో ముఖ్యమంత్రి గతానికి భిన్నంగా వ్యవహరించారు. ఎలాంటి ఆవేశాలకు లోను కాకుండా పరిస్థితి తీవ్రతను ప్రజల్లోకి గట్టిగానే తీసుకువెళ్లారు. సున్నితంగా సుత్తి లేకుండా సంయమనంతో ప్రభుత్వ చర్యలను వివరించడం చూస్తే యువ సిఎం వ్యవహారశైలిలో బాగా మార్పు వచ్చిందని విశ్లేషకులు అంటున్నారు. తెలంగాణ సిఎం కెసిఆర్ తన మాటల తూటాలతో ఆకట్టుకుంటారు. దాంతో ఇద్దరు ముఖ్యమంత్రులకు ఈ అంశంలో పోలిక తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయం అవుతూ ఉంటుంది. మొత్తానికి వైఎస్ తనయుడిని ఉండవల్లి అరుణ్ కుమార్ దారిలోకి తెచ్చినట్లే కనిపిస్తుందనే టాక్ బాగానే పొలిటికల్ సర్కిల్స్ లో నడుస్తుంది.

Tags:    

Similar News