Undavalli : ఉండవల్లిని అలా వదిలేయడమే మంచిదా?

పార్టీ సీనియర్ నేత ఉండవల్లి అరుణ్ కుమార్ ను వైసీసీ వ్యూహాత్మకంగా సైడ్ చేయాలని నిర్ణయించినట్లుంది. ఉండవల్లి కున్న క్రెడిబులిటీ దృష్ట్యా ఆయన జోలికి వెళ్లకపోవడమే మంచిదన్న [more]

Update: 2021-11-06 14:30 GMT

పార్టీ సీనియర్ నేత ఉండవల్లి అరుణ్ కుమార్ ను వైసీసీ వ్యూహాత్మకంగా సైడ్ చేయాలని నిర్ణయించినట్లుంది. ఉండవల్లి కున్న క్రెడిబులిటీ దృష్ట్యా ఆయన జోలికి వెళ్లకపోవడమే మంచిదన్న అభిప్రాయంలో వైసీపీ ఉంది. అందుకే ఆయన ప్రభుత్వంపై ఎన్ని విమర్శలు చేసినా చూసీ చూడనట్లు వదిలేయడమే మంచిదన్న నిర్ణయానికి వైసీపీ వచ్చినట్లుంది. దీనిపై వైసీపీ అధినాయకత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలు కింది స్థాయి నేతలకు కూడా అందాయి.

ఆధారాలతో….

ఉండవల్లి అరుణ్ కుమార్ కు ఒక ప్రత్యేకత ఉంది. ఆయన విమర్శలు అర్థవంతంగా, ఆధారసహితంగా ఉంటాయి. ఆయన మాటలను ప్రజలను కూడా విశ్వసిస్తారు. ఇటీవల ఉండవల్లి అరుణ్ కుమార్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలే చేశారు. వైసీపీ ప్రభుత్వం శక్తికి మించి అప్పులు చేస్తుందన్నారు. దూరదృష్టి లేకుండా అప్పులు చేస్తూ పోతున్నారని ఉండవల్లి అరుణ్ కుమార్ అభిప్రాయపడ్డారు. ఇలాగే చేస్తూ పోతే ఏడాదికి నలభై వేల కోట్లు వడ్డీ రూపంలోనే చెల్లించాల్సి వస్తుందని కూడా ఆయన ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

ఆయన విమర్శలకు….

కానీ ఎవరి విమర్శలపైనైనా వెంటనే సమాధానాలు చెప్పే వైసీపీ నేతలు ఉండవల్లి అరుణ్ కుమార్ విషయంలో వెనక్కు తగ్గినట్లే కన్పిస్తుంది. ఆయన విమర్శలు చేసి నెల రోజులు గడుస్తున్నా నైస్ గా దానిని పక్కన పెట్టేశారు. ఇందుకు కారణాలు కూడా లేకపోలేదు. ఉండవల్లి అరుణ్ కుమార్ ప్రస్తుతం ఏ రాజకీయ పార్టీలో లేరు. ఆయన ఏడాదిలో రెండు, మూడుసార్లు మాత్రమే మీడియా సమావేశాలు పెట్టి తన మనసులో మాటను చెబుతుంటారు.

ఆయన జోలికి వెళితే….?

ఉండవల్లి అరుణ్ కుమార్ తాను చేసిన విమర్శలకు కౌంటర్ వస్తే వెంటనే మళ్లీ ఫైర్ అవుతారు. తాను చెప్పిన విషయాలతో పాటు అదనపు అంశాలను జోడించి మరీ ఎండగట్టే గుణం ఉండవల్లి అరుణ్ కుమార్ కు ఉంది. అందుకే ఉండవల్లి జోలికి వెళ్లకపోవడమే మంచిదన్న అభిప్రాయంలో వైసీపీ అధినాయకత్వం ఉంది. ఆయన విమర్శలను చూసీ చూడనట్లు వదిలేస్తేనే మంచిదన్న అభిప్రాయానికి వచ్చింది. అందుకే ఆయన రాష్ట్ర అప్పులు మీద చేసిన ఆరోపణలపై ఏ ఒక్క వైసీపీ నేత రెస్పాండ్ కాలేదు.

Tags:    

Similar News