స్టాంప్ పడకూడదని ఉండవల్లి?

ఒక అంశాన్ని కుండబద్దలు కొట్టినట్లు అందరికి అర్ధమయ్యే రీతిలో అనర్గళంగా మాట్లాడే మేధావి మాజీ పార్లమెంట్ సభ్యుడు ఉండవల్లి అరుణ కుమార్. ఎపి రాజకీయాల్లో గేమ్ చేంజర్ [more]

Update: 2020-02-24 05:00 GMT

ఒక అంశాన్ని కుండబద్దలు కొట్టినట్లు అందరికి అర్ధమయ్యే రీతిలో అనర్గళంగా మాట్లాడే మేధావి మాజీ పార్లమెంట్ సభ్యుడు ఉండవల్లి అరుణ కుమార్. ఎపి రాజకీయాల్లో గేమ్ చేంజర్ ఎవరన్నా ఉన్నారంటే ఆ కోవలో మొదటి వరసలో ఉంటారు ఉండవల్లి అరుణ కుమార్. స్వర్గీయ రాజశేఖర రెడ్డి కి అత్యంత ఇష్టుడైన ఉండవల్లి గత టిడిపి ప్రభుత్వంపై సాగించిన మాటల దాడి పరోక్షంగా ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషించిందనే చెప్పాలి. వైసిపి ఒక పక్క ప్రజా క్షేత్రంలో పోరాడుతుంటే అన్ని వర్గాల ప్రజలను ఆకట్టుకునేవిధంగా చంద్రబాబు ప్రభుత్వం చేస్తున్న తప్పులను క్రమబద్ధంగా ఎత్తిచూపుతూ పరోక్షంగా విపక్షం అధికారపక్షంలోకి రావడానికి ఉండవల్లి అరుణ కుమార్ దోహదం చేశారు. సంప్రదాయ మీడియా, సోషల్ మీడియా ల ద్వారా కోట్లాదిమంది ఉండవల్లి మాటలకు ప్రభావితులు అయ్యేవారు. ఆ విధంగా పసుపుకోట బీటలు వెనుక మాటల మాంత్రికుడి పాత్ర అంతో ఇంతో ఉందన్నది విశ్లేషకులు చెప్పే విషయం.

జగన్ అధికారంలోకి వచ్చాక …

వైఎస్ జగన్ అధికారం లోకి వచ్చాక కొంతకాలం మౌనంగానే వున్నారు ఉండవల్లి అరుణ కుమార్. కొత్త ప్రభుత్వానికి కనీసం ఏడాది సమయం అయినా ఇవ్వాలనే ఆయన పెట్టుకున్న నిబంధనతో విమర్శల జోలికి పోకుండా అప్పుడప్పుడు సలహాలు, సూచనలు ఇచ్చేవారు. దాంతో టిడిపి ఉండవల్లి సర్కార్ నిర్ణయాలపై స్పందించాలంటూ వత్తిడి పెంచింది. తాజాగా ఇటీవల మీడియా ముందుకు వచ్చిన ఉండవల్లి అరుణ కుమార్ తనదైన శైలిలో ప్రభుత్వం పై విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టారు. ఏడాది వేచి చూడాలనుకున్నా జగన్ ప్రభుత్వం తప్పులు సరిదిద్దుకోవాలనే మాట్లాడాలిసివచ్చిందని ముక్కుసూటిగా చెప్పేశారు. తాను ఏ పార్టీలో లేనని రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యంగా రంధ్రాన్వేషణే ఇక ముందు కొనసాగిస్తా అని చెప్పేశారు. గతంలో చంద్రబాబు కి మోడీ వంటి వారికి లేఖలు సంధించిన విధంగానే ఇప్పుడు ఉండవల్లి అరుణ కుమార్ నేరుగా ముఖ్యమంత్రి పాలనలో తప్పులు ఎత్తిచూపుతూ వాటిని సరిదిద్దుకోవాలంటూ లేఖలు రాస్తూ సంచలనాలకు తెరతీస్తున్నారు. ఘాటైన విమర్శలు సర్కార్ పై చేస్తున్నారు. పనిలో పనిగా దేశ రాజకీయాలపైన తనదైన శైలిలో ఉండవల్లి అరుణ కుమార్ విశ్లేషిస్తున్నారు.

ప్రత్యక్ష రాజకీయాలకు దూరం …

ఉండవల్లి అరుణ కుమార్ ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఏ పార్టీలో చేరకుండా ఉండాలనే నిర్ణయానికే కట్టుబడ్డారు. పదేళ్ళ పాటు ఎంపి గా పనిచేయడం వైఎస్ వంటి నాయకుడు దూరం అయ్యాక ఇక పాలిటిక్స్ కి దూరం కావడమే మంచిదని భావిస్తున్నారు. రాష్ట్ర విభజన అంశంలో కాంగ్రెస్ వ్యవహరించిన తీరుతో నేటికీ ఆయన ఆవేదనతోనే వున్నారు. అందుకే ఆ పార్టీ లో తిరిగి చేరాలని కాంగ్రెస్ అధిష్టానంలో సన్నిహితుల నుంచి ఆహ్వానం వచ్చినా సున్నితంగా తిరస్కరించారు ఉండవల్లి అరుణ కుమార్. ఈ నేపథ్యంలో ఆయన వైసిపి ద్వారా రాజకీయాల్లో రీ ఎంట్రీ ఇస్తారనే ప్రచారం జోరుగా సాగినా వాటిని ఖండిస్తూ వచ్చారు. వైసిపి పక్షపాతిగా టిడిపి ముద్ర వేయడంతో దాన్ని ఇప్పుడు చెరుపుకునే పనిలో పడ్డారు ఉండవల్లి అరుణ కుమార్.

వైసిపికి నిజమైన ప్రతిపక్షంగా …

తనకు ఏ పార్టీ అయినా ప్రజల క్షేమం మాత్రమే ప్రధానమని తన వాగ్ధాటితో వైసిపి కి నిజమైన ప్రతిపక్షం గా ఉండవల్లి అరుణ కుమార్ మారిపోనున్నారు. ప్రజాక్షేత్రంలో జరిగే తప్పులను ఉండవల్లి వంటివారు ఎత్తిచూపితే ఒకరకంగా వైసిపికి మంచి చేసేదే. అయితే వాటిని సరిదిద్దుకునే ప్రయత్నం సర్కార్ నిర్ణయాలు ఉంటే ఫ్యాన్ పార్టీకి మరమ్మత్తులు జరుగుతాయి. ఇప్పటికే పలు అంశాల్లో జగన్ ఏకపక్షంగా దూకుడుగా వెళుతున్నారన్న అపవాదులు ఎదుర్కొంటున్నారు. ఆయనకు ప్రతిపక్షం నిర్మాణాత్మక రీతిలో విమర్శలు ఆరోపణలు కాకుండా వ్యక్తిగత విమర్శలకు ప్రాధాన్యత ఇస్తుంది. విపక్షం నుంచి విలువైన సూచనలు వచ్చినా వాటిని కనీసం వైసిపి పట్టించుకునే పరిస్థితి లేనేలేదు. దాంతో ఉండవల్లి అరుణ కుమార్ వంటివారు తమ పంథా మార్చుకుని జగన్ ప్రభుత్వ పాలనలో లోపాలు ఎత్తి చూపే ప్రక్రియ తీసుకోక తప్పలేదని తెలుస్తుంది. అయితే దీనిని అధికారపార్టీ సానుకూలంగా తీసుకుని తప్పులు దిద్దుకుంటుందా ? లేక పట్టించుకోకుండా తమ పని తాము చేసుకుంటూ పోతుందా అన్నది వేచి చూడాలి.

Tags:    

Similar News