జగన్ పై స్టాండ్ మార్చేసుకున్నారా?

తమ్ముడు తమ్ముడే పేకాట పేకాటే అని కచ్చితంగా చెప్పేస్తున్నారు మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్. ఆయన తన పొలిటికల్ స్టాండ్ విషయంలో చాలా క్లారిటీగా ఉంటున్నారు. [more]

Update: 2020-11-30 13:30 GMT

తమ్ముడు తమ్ముడే పేకాట పేకాటే అని కచ్చితంగా చెప్పేస్తున్నారు మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్. ఆయన తన పొలిటికల్ స్టాండ్ విషయంలో చాలా క్లారిటీగా ఉంటున్నారు. ఆయన్ని అర్ధం చేసుకునే విషయంలోనే వైసీపీ అభిమానులు, వైసీపీ నేతలు అయోమయంలో పడుతున్నారనుకోవాలి. ఉండవల్లి అరుణ్ కుమార్ వైఎస్సార్ కి చాలా సన్నిహితుడు. ఇష్టమైన సహచరుడు కూడా. అరుణ్ అని చాలా చనువుగా వైఎస్సార్ ఆయన్ని పిలుస్తారు. ఆ బంధం వేరు. ఆ రాజకీయం వేరు. ఇపుడు ఉండవల్లి అరుణ్ కుమార్ మాజీ ఎంపీ. ఆయన ఏ పార్టీకి అటాచ్ అయి లేరు. స్వేచ్చా జీవి కూడా. ఇక పోలవరం ప్రాజెక్ట్ విషయంలో వైఎస్సార్ కి ఉన్న కమిట్ మెంట్ ఉండవల్లికీ ఉంది.

అదే అభిమానం……

జగన్ అంటే తనకు వ్యక్తిగతంగా అభిమానం ఉంది. తన స్నేహితుడి కొడుకు గా అది ఎప్పటికీ ఉంటుంది. అదే ముఖ్యమంత్రి జగన్ అంటే మాత్రం ఒక విమర్శకుడిగానే చూస్తాను అని ఇప్పటికి చాలా సార్లు ఉండవల్లి అరుణ్ కుమార్ చెప్పారు. తాను ప్రతిపక్ష నాయకుడిగా పనిచేస్తాను అని కూడా ఆయన అంటున్నారు. ఏపీ ప్రయోజనాల కోసమే తన ఆరాటం పోరాటం అంతా కూడా అని ఆయన చెప్పుకొస్తున్నారు. ఏపీకి సంబంధించి అన్యాయం జరిగితే తనకు చంద్రబాబు అయినా జగన్ అయినా ఒక్కటేనని కూడా అంటున్నారు.

నమ్ముతారు జగన్ ….

ఉండవల్లి అరుణ్ కుమార్ అంటే తటస్థవాది అని పేరుంది. ఆయన నోటి వెంట వచ్చే మాటలను విశ్వసించేవారు ఏపీలో ఎక్కువగానే ఉన్నారు. ఆయన పోలవరం సహా ఏపీకి జరిగిన అన్యాయాన్ని ఎప్పటికపుడు ఏకరువు పెడుతూనే ఉన్నారు. కేంద్రాన్ని ఎందుకు జగన్ నిలదీయలేకపోతున్నారు అని కూడా అంటున్నారు. జగన్ కి ఏ మొహమాటాలు అడ్డు వస్తున్నాయని కూడా ప్రశ్నిస్తున్నారు. జగన్ సీబీఐ కేసుల‌కు భయపడే ఇలా చేస్తున్నారు అని కూడా జనం మాటగా చెబుతున్నారు. ఇది పదే పదే ఉండవల్లి అరుణ్ కుమార్ నోటి వెంట చెబుతూంటే జనం కూడా అదే నమ్ముతారు కూడా.

సద్విమర్శలే ….

రాజకీయాల్లో అందరూ శత్రువులు కారు. ఉండవల్లి అరుణ్ కుమార్ లాంటి వారు చేసేవి సద్విమర్శలు. వాటిని జగన్ సర్కార్ అలాగే తీసుకోవాలి.అంతే తప్ప తన మందబలం చూపించకూడదు,చేతిలో ఎంపీలు, ఎమ్మెల్యేలు ఉన్నారు కదా అని ఆయన మీద మాటల దాడిని చేయించినా అది బూమరాంగ్ అవుతుంది. ఉండవల్లి చెప్పేవి జనం అనుకుంటున్న మాటలు. ఏపీలో జగన్ కి ఏది మంచో ఏది చెడ్డో తెలియచేసే మీడియా లేకపోవడం ఒక దురదృష్టకరమైన పరిణామం. మెజారిటీ మీడియా రాజకీయంగా విడిపోయింది. అందువల్ల వాస్తవాలు బయటకు రావు. ఉండవల్లి అరుణ్ కుమార్ లాంటి వారికి ఏ రాజకీయ ప్రయోజనాలు లేవు. వారు కేవలం రాష్ట్రం కోసమే ఆలోచన చేస్తారు. అందువల్ల ఆయన మాటలను పాజిటివ్ గా తీసుకుంటే జగన్ కి వైసీపీకి అదే శ్రీరామ రక్ష అని అంటున్నారు.

Tags:    

Similar News