థ్రాక్రే దారికి వచ్చింది ఇందుకేనా…?

మహారాష్ట్రలో శివసేన, భారతీయ జనతా పార్టీ పొత్తు ఖరారయిన సంగతి తెలిసిందే. గత కొన్నేళ్లుగా భారతీయ జనతా పార్టీ అగ్రనేతలైన నరేంద్రమోదీ, అమిత్ షాల మీద శివసేన [more]

Update: 2019-03-02 17:30 GMT

మహారాష్ట్రలో శివసేన, భారతీయ జనతా పార్టీ పొత్తు ఖరారయిన సంగతి తెలిసిందే. గత కొన్నేళ్లుగా భారతీయ జనతా పార్టీ అగ్రనేతలైన నరేంద్రమోదీ, అమిత్ షాల మీద శివసేన అధినేత ఉద్ధవ్ థాక్రే విరుచుకుపడుతున్న సంగతి తెలిసిందే. నరేంద్ర మోదీ తీసుకున్న ప్రతి నిర్ణయాన్ని థాక్రే వ్యతిరేకిస్తూ వస్తున్నారు. అంతేకాదు ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పైన కూడా ప్రశంసలు కురిపించారు. తన అధికార పత్రిక సామ్నాలో సయితం మోదీపై విమర్శలు, రాహుల్ ఇమేజ్ పెరుగుతుందన్న సంపాదకీయాలు రావడంతో రెండు పార్టీల మధ్య పొత్తు కుదరదన్న సంకేతాలు బలంగా వచ్చాయి.

ఆగ్రహం తగ్గినట్లేనా?

అయితే థాక్రే మునుపటి లాగే బీజేపీతో పొత్తు కుదుర్చుకోవడానికి కారణాలేంటి? మోదీ, అమిత్ షాల మీద ఆగ్రహం తగ్గిందా? లేక భారతీయ జనతా పార్టీ మీద ప్రేమ చెరిగిపోలేదా..? ఈ ప్రశ్నలన్నీ శివసైనికులను వేధిస్తున్నాయి. ఎందుకంటే తొలినుంచి మోదీ, అమిత్ షాలపైనే విమర్శలు చేస్తున్న థాక్రే భారతీయ జనతా పార్టీ గురించి మాత్రం ఎక్కడా పన్నెత్తు మాట అనలేదు. గుజరాత్, ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లోనూ శివసేన ఒంటరిగానే బరిలోకి దిగింది. దీనికితోడు ఇటీవల కాలంలో గడ్కరీ వంటి నేతలు సయితం మోదీ, షాలకు వ్యతిరేకంగా చేసిన వ్యాఖ్యలు కూడా థాక్రేను ఆలోచనలో పడేశాయంటున్నాయి.

భంగపాటు తప్పదనే….

బీజేపీతో పొత్తు పెట్టుకోకుండా ఒంటరిగా శివసేన బరిలోకి దిగితే భంగపాటు తప్పదన్న విషయం థాక్రే కు తెలియంది కాదు. అయితే వరుసగా ఎన్డీఏ మిత్రపక్షాలు బీజేపీని వీడుతున్నా శివసేన మాత్రం సంయమనాన్ని పాటిస్తూనే ఉంది. అటు కేంద్రంలోనూ, ఇటు రాష్ట్రంలోనూ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉంది. పొత్తు కుదుర్చుకోవడానికి గల కారణాలను అధికారికంగా ఇప్పటివరకూ శివసేన ప్రకటించకపోవడంతో శివసైనికుల నుంచే తీవ్ర విమర్శలు విన్పిస్తున్నాయి.

కాంగ్రెస్ అధికారంలోకి వస్తే….

ఈ నేపథ్యంలో థాక్రే రెండు రోజుల క్రితం పెదవి విప్పారు. యాభై ఏళ్ల పాటు అధికారంలో ఉన్న కాంగ్రెస్ ఏమీ చేయలేదని, మరోసారి బీజేపీకి అవకాశమిచ్చి చూడాలని థాక్రే తన మనసులో మాట చెప్పేశారు. అంతేకాదు దేశంలోని ఏ జాతీయ పార్టీ, ప్రాంతీయ పార్టీలు ఒంటరిగా పోటీ చేసే పరిస్థితి ప్రస్తుతం లేదన్నారు. 25 ఏళ్ల నుంచి బీజేపీతో ఉన్న అనుబంధాన్ని తెంచుకోవడం కన్నా కొనసాగించడమే మేలన్న అభిప్రాయం పార్టీలో ఎక్కువగా వ్యక్తమవ్వడంతోనే పొత్తు కుదిరిందన్నారు. కాంగ్రెస్ తిరిగి అధికారంలోకి వస్తే హిందుత్వ అజెండా దెబ్బతింటుందనే మద్దతిచ్చామని తెలిపారు. ఈ కారణాలన్నీ పైకి చెప్పేవిగానే ఉన్నా ఆర్ఎస్ఎస్ వత్తిడి మేరకే థాక్రే పొత్తు కుదుర్చుకున్నారన్న అభిప్రాయమూ లేకపోలేదు.

Tags:    

Similar News