బీజేపీ ప్లాన్ వర్క్ అవుట్ కాకుండా?

కర్ణాటక తరహా రాజకీయాలను మహారాష్ట్రలో కమలనాధులు చేద్దామని కలలు కన్నారు. కానీ నెలరోజుల్లో ఉద్ధవ్ థాక్రే నిలదొక్కుకుంటున్నారు. మంత్రి వర్గాన్ని పూర్తి స్థాయిలో విస్తరించారు. కొద్దో గొప్పో [more]

Update: 2020-02-02 18:29 GMT

కర్ణాటక తరహా రాజకీయాలను మహారాష్ట్రలో కమలనాధులు చేద్దామని కలలు కన్నారు. కానీ నెలరోజుల్లో ఉద్ధవ్ థాక్రే నిలదొక్కుకుంటున్నారు. మంత్రి వర్గాన్ని పూర్తి స్థాయిలో విస్తరించారు. కొద్దో గొప్పో అసంతృప్తులు తలెత్తినా వాటిని సర్దుబాటు చేసుకున్నారు. సంకీర్ణంలో భాగస్వామిగా ఉన్న కాంగ్రెస్, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీలతో స్నేహపూర్వకంగా మెలుగుతున్నారు. కాంగ్రెస్ తో అప్పుడప్పుడూ విభేదిస్తున్నా ఉమ్మడి కార్యాచరణ ప్రణాళిక వైపుకే ఉద్ధవ్ థాక్రే మొగ్గు చూపుతున్నారు.

ఉమ్మడి ప్రణాళికతో…..

మహారాష్ట్రంలో కాంగ్రెస్, ఎన్సీపీ, శివసేనలు సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పడు మూడు పార్టీలు కలసి ఉమ్మడి ప్రణాళికను రూపొందించుకున్నాయి. ఈ ప్రణాళిక ప్రకారమే ముందుకు వెళ్లాల్సి ఉంటుంది. కామన్ మినిమమ్ ప్రోగ్రాం ను కాదని ఉద్ధవ్ థాక్రే వెళ్లే పరిస్థితి లేదు. కాంగ్రెస్ తో కొంత విభేదాలున్నప్పటికీ ఎన్సీపీ అధినేత శరద్ పవార్ తో మాత్రం ఉద్ధవ్ థాక్రే టచ్ లోనే ఉంటున్నారు. ప్రతి పక్షం రోజులకొకసారి ఆయనతో సమావేశమవుతున్నారు.

జడ్పీ ఎన్నికలతో….

దీంతో పాటు జిల్లా పరిషత్ ఎన్నికలు కూడా సంకీర్ణ ప్రభుత్వంలో జోష్ నింపాయి. ఇటీవల జరిగిన జిల్లా పరిషత్ ఎన్నికల్లో మహా అఘాడీ కూటమి విజయం సాధించడంతో తమ కూటమికి ప్రజలు మద్దతు తెలిపారన్న ఆత్మవిశ్వాసంతో ఉన్నాయి. మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ సొంత ప్రాంతమైన నాగపూర్ ప్రాంతంలోనూ బీజేపీ ఓటమి చెందడంతో రానున్న ఏ ఎన్నికలనైనా ధీటుగా ఎదుర్కొంటామన్న నమ్మకంతో ఉన్నాయి.

ఎమ్మెల్యేలతో తరచూ….

అయితే కూటమిలో అసంతృప్తులు చెలరేగుతాయన్న కమలనాధుల ఆశలపై ఉద్ధవ్ థాక్రే నీళ్లు చల్లుతున్నారు. ఉద్ధవ్ ధాక్రే ఎమ్మెల్యేలకు ప్రత్యేక సమయం కేటాయిస్తున్నారు. వారి నియోజకవర్గాల్లో సమస్యలను అప్పటికప్పుడే పరిష్కరించాలని ఆదేశిస్తున్నారు. తొలిసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలను చేపట్టినా ఉద్ధవ్ థాక్రే భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని రాజకీయాలు చేస్తున్నారన్న ప్రశంసలు మూడు పార్టీల నుంచి వినపడుతున్నాయి. దీంతో కమలనాధుల కర్ణాటక తరహా ప్లాన్ వర్క్ అవుట్ అయ్యే అవకాశాలు కన్పించడం లేదు.

Tags:    

Similar News