సరైనోడు వచ్చాడు…ఇక చింతలేదట

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల వేళ డీఎంకే కు అసలైన వారసుడొచ్చారు. ఉదయనిధి స్టాలిన్ రూపంలో ఆ పార్టీకి మంచి భవిష్యత్ ఉండనుందన్న అంచనాలు విన్పిస్తున్నాయి. డీఎంకే అధినేత [more]

Update: 2021-04-29 17:30 GMT

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల వేళ డీఎంకే కు అసలైన వారసుడొచ్చారు. ఉదయనిధి స్టాలిన్ రూపంలో ఆ పార్టీకి మంచి భవిష్యత్ ఉండనుందన్న అంచనాలు విన్పిస్తున్నాయి. డీఎంకే అధినేత స్టాలిన్ కుమారుడైన ఉదయనిధి తమిళనాడు ఎన్నికల ప్రచారంలో అట్రాక్షన్ గా మారారు. ఓటర్లు ఎవరివైపు మొగ్గు చూపుతారన్న విషయం పక్కన పెడితే తమిళనాడు ఎన్నికల్లో కరుణానిధి కుటుంబం నుంచి మరో సిసలైన వారసత్వం వచ్చిందనే చెప్పాలి.

కరుణానిధి మరణానికి ముందు…..

ఉదయనిధి స్టాలిన్ సినీ హీరోగా ప్రజలకు తెలుసు. ఆయన కరుణానిధి మరణానికి ముందు వరకూ పెద్దగా రాజకీయాలను పట్టించుకోలేదు. తాత, తండ్రి పార్టీని చూసుకుంటుండటంతో ఉదయనిధి వ్యాపారాల మీదనే ఎక్కువగా దృష్టి పెట్టారు. అయితే కరుణానిధి మరణం తర్వాత రాజకీయాల్లో పూర్తిగా యాక్టివ్ అయ్యారు. ఉప ఎన్నికల్లోనే పోటీ చేయాలని ఒత్తిడి వచ్చినా ఆయన ఆఆలోచన విరమించుకుని ప్రచారానికే పరిమితమయ్యారు.

డీఎంకే యువజన విభాగానికి….

డీఎంకే యువజన విభాగానికి చీఫ్ గా ఉదయనిధిని స్టాలిన్ చేశారు. పార్లమెంటు, శాసనసభ ఉప ఎన్నికల్లో ప్రధాన ప్రచారకర్తగా ఉదయనిధి మారారు. ఉదయనిధి ప్రసంగాలకు ప్రజల నుంచి మంచి రెస్పాన్స్ రావడంతో ఈ శాసనసభ ఎన్నికల్లో ఉదయనిధి స్టార్ క్యాంపెయినర్ అయ్యారు. తండ్రి తనకు అప్పగించిన పనిని సమర్థవంతంగా ఉదయనిధి పూర్తిచేశారు. ప్రధానంగా మోదీ, అమిత్ షాలపై ఉదయనిధి విరుచుకుపడటం మరింత క్రేజ్ పెంచిందంటున్నారు.

మోదీ, షాలపై…..

మోదీ, షాలపై ఉదయనిధి ఘాటు విమర్శలు చేశారు. అరుణ్ జైట్లీ, సుష్మాస్వరాజ్ మరణాలకు మోదీయే కారణమని సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను కరుణానిధి మనవడినని, స్టాలిన్ తనయుడినని, ఐటీ దాడులు చేయాలంటే తన ఇంటికి రావాలని చిరునామాతో సహా చెప్పడం ప్రజలను బాగా ఆకట్టుకుంది. తన తండ్రిని అగౌరవపరిస్తే ఊరుకునేది లేదని ఉదయనిధి వార్నింగ్ ఇచ్చారు. ఉదయనిధి ప్రసంగాలకు మంచి రెస్పాన్స్ లభించింది. దీంతో డీఎంకేకు సరైనోడు నేతగా వస్తున్నాడని ఆ పార్టీ నేతలు, క్యాడర్ ఆనందం వ్యక్తం చేస్తుంది.

Tags:    

Similar News