ఎన్నాళ్లిలా.. సాగదీత….అదే నిజమనుకుంటారుగా?

జగన్ ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు కావస్తుంది. ఇప్పటి వరకూ తెలుగుదేశంపార్టీపై చేసిన ఆరోపణలను ప్రభుత్వం నిగ్గుతేల్చలేకపోయింది. ఈఎస్ఐ స్కామ్ నుంచి అమరావతి రాజధాని ఇన్ సైడర్ ట్రేడింగ్ [more]

Update: 2021-01-27 05:00 GMT

జగన్ ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు కావస్తుంది. ఇప్పటి వరకూ తెలుగుదేశంపార్టీపై చేసిన ఆరోపణలను ప్రభుత్వం నిగ్గుతేల్చలేకపోయింది. ఈఎస్ఐ స్కామ్ నుంచి అమరావతి రాజధాని ఇన్ సైడర్ ట్రేడింగ్ వరకూ కేసు దర్యాప్తు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. విశాఖ భూ కుంభకోణం పరిస్థితి కూడా అంతే. దీంతో తెలుగుదేశం పార్టీపై వైసీపీ నాడు విపక్షంలో చేసిన ఆరోపణలను అధికారంలోకి వచ్చినా ఏమీ తేల్చలేకపోయిందన్న వ్యాఖ్యలు విన్పిస్తున్నాయి.

విపక్షంలో ఉన్నప్పుడు….

తెలుగుదేశం అవినీతిపై విపక్షంలో ఉన్నప్పుడు వైసీపీ పదే పదే విమర్శలు చేసింది. జగన్ తన పాదయాత్రలో సయితం అవే ఆరోపణలు కొనసాగించారు. ప్రధానంగా విశాఖ భూ కుంభకోణంలో టీడీపీ నేతలు ఉన్నారంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. అధికారంలోకి రాగానే దానిపై స్పెషల్ ఇన్విస్టిగేషన్ టీంను ఏర్పాటు చేశారు. అయినా ఇప్పటి వరకూ దానిపై నిజానిజాలను బయటపెట్టలేకపోయింది.

ఇన్ సైడర్ ట్రేడింగ్…..

ఇక అమరావతి ఇన్ సైడర్ ట్రేడింగ్ కధ కూడా ఇలాగే కొనసాగుతుంది. బినామీ పేర్లతో వేలాది ఎకరాలను తెలుగుదేశం పార్టీ నేతలు కొనుగోలు చేశారన్నారు. తెల్ల రేషన్ కార్డులున్న వారి పేరిట కూడా భూముల కొనుగోళ్లు జరిగాయని వైసీపీ ఆరోపించింది. దీనిపై ప్రభుత్వం సీఐడీ విచారణకు ఆదేశించింది. తొలినాళ్లలో కొంత దూకుడు ప్రదర్శించిన సీఐడీ తర్వాత మళ్లీ నెమ్మదించింది. దీనిపై ఇంతవరకూ ఎవరిపై చర్యలు తీసుకోలేదు.

హడావిడి తప్ప…..

ఈఎస్ఐ మందుల కొనుగోళ్లలో అవినీతి జరిగిందంటూ అప్పటి ఆ శాఖ మంత్రి అచ్చెన్నాయుడును అరెస్ట్ చేశారు. దీనిపై కేసు కూడా నమోదు చేశారు. కానీ ఇది కూడా ఒక్క అడుగు కూడా ముందుకు జరగలేదు. పితాని సత్యనారాయణ కుమారుడి ప్రమేయం ఉందని చెప్పినా దానిపై కూడా ఇంతవరకూ అరెస్ట్ చేయలేదు. ఇలా టీడీపీ నేతలపై ఆరోపించిన అన్ని కేసుల్లోనూ విచారణ మందకొడిగా సాగుతుందన్న కామెంట్స్ పార్టీ నుంచే విన్పిస్తున్నాయి. వైసీపీ కావాలనే తమపై విమర్శలు చేసిందని, తమపై అక్రమ కేసులు నమోదు చేస్తుందన్న టీడీపీ వాదనకు బలం చేకూరుతుంది.

Tags:    

Similar News