సత్తా ఏంటో తెలిసిపోయిందిగా….!!

పార్లమెంటు ఎన్నికలు, ఉప ఎన్నికల ఫలితాలతో టీటీవీ దినకరన్ పని అయిపోయిందా? ఆయన మక్కల్ మున్నేట్ర కజగం పార్టీ ఇక బోర్డు తిప్పేయాల్సిందేనా? అంటే అవుననే అంటున్నారు. [more]

Update: 2019-06-04 18:29 GMT

పార్లమెంటు ఎన్నికలు, ఉప ఎన్నికల ఫలితాలతో టీటీవీ దినకరన్ పని అయిపోయిందా? ఆయన మక్కల్ మున్నేట్ర కజగం పార్టీ ఇక బోర్డు తిప్పేయాల్సిందేనా? అంటే అవుననే అంటున్నారు. తమిళనాడులో జరిగిన ఎన్నికల్లో దినకరన్ పార్టీ అట్టర్ ప్లాప్ అయింది. ఇప్పటి వరకూ ఆయనపైనా, ఆయన నాయకత్వపైనా నమ్మకం పెట్టుకుని ఉన్న అనేకమంది నేతలు ఇప్పుడు పునరాలోచనలో పడ్డారు. దినకరన్ వెంట ఉంటే రోడ్డు మీద ఉండటమేనన్న ఫీలింగ్ కు వచ్చేశారు. బలమైన పార్టీలైన అన్నాడీఎంకే, డీఎంకే కూటమిలను ధీటుగా ఎదుర్కొనడంలో టీటీవీ దినకర్ అట్టర్ ప్లాప్ అయ్యారన్నది ఫలితాలను బట్టే తెలిసిపోయింది.

ఆర్కే నగర్ ఉప ఎన్నికతో….

ఆర్కే నగర్ ఉప ఎన్నికలు దినకరన్ లో జోష్ ను పెంచాయి. ఆర్కే నగర్ ఉప ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన దినకరన్ అన్నాడీఎంకే ను మట్టి కరిపించారు. డీఎంకేకు డిపాజిట్లు దక్కలేదు. బీజేపీకి నోటా కంటే ఓట్లు తక్కువగా వచ్చాయి. ఇవన్నీ దినకరన్ లో ఆత్మవిశ్వాసాన్నిపెంచాయి. తన గెలుపుతో అన్నాడీఎంకే నేతలు దిగివస్తారని భావించారు. కానీ అలాంటి ఛాన్స్ లేదని తెలియడంతో ఆయన ప్రభుత్వాన్ని కూల్చేందుకు రెడీ అయిపోయారు. మూడు నెలల్లో ప్రభుత్వం కూలిపోతుందని చెప్పి ఏడాది గడుస్తున్నా ఏమీ చేయలేనిపరిస్థితి.

కొత్త పార్టీని పెట్టి….

దీంతో టీటీవీ దినకరన్ అమ్మ మక్కల్ మున్నేట్ర కజగం పార్టీని స్థాపించారు. మేనత్త శశికళ ఆశీస్సులతోనే ఈ పార్టీని స్థాపించారు. ఆర్కే నగర్ ఉప ఎన్నికల్లో గెలుపుతో జోరుమీదున్న శశికళ, దినకరన్ లు పార్లమెంటు ఎన్నికల్లో సత్తా చాటాలని భావించారు. తద్వారా తాను జైలు నుంచి బయటకు రావచ్చని శశికళ దినకరన్ పార్టీకి అన్ని రకాలుగా సహాయసహకారాలు జైలు నుంచే అందించారు. బీజేపీ మరోసారి అధికారంలోకి వస్తే తాను బయటకు రావడం కుదరదని భావించిన శశికళ ఎక్కువ స్థానాలను దక్కించుకుని కాంగ్రెస్ కు అండగా నిలవాలనుకున్నారు.

నిరాశలో శశికళ….

కానీ శశికళ అనుకున్నది ఒకటయితే జరిగింది మరొకటిగా ఉంది. తమిళనాడులో అన్నాడీఎంకే, బీజేపీ కూటమిని దెబ్బకొట్టగలిగినా కేంద్రంలో మాత్రమ బీజేపీ గెలుపు ఖాయమవ్వడంతో చిన్నమ్మ నిరాశలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇటు దినకరన్ పైనకూడా శశికళ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. దినకరన్ తనవెంట వచ్చిన వారిని కూడా గెలిపించుకోలేక పోవడంతో ఇక అమ్మ మక్కల్ మున్నేట్ర కజగం పార్టీలో చేరేందుకు ఎవరూ సాహసించరన్నది వాస్తవం. దీంతో దినకరన్ వెంట కొద్దిమందిని తన వైపు తిప్పుకునేందుకు పన్నీర్ సెల్వం, పళనిస్వామిలు ప్రయత్నిస్తున్నారు. కొందరు దినకరన్ వెంట ఉన్న వారు స్టాలిన్ పార్టీలో చేరేందుకు సిద్దమవుతున్నారు. మొత్తం మీద పార్లమెంటు, శాసనసభ ఉప ఎన్నికలతో దినకరన్ సత్తా ఏంటో తెలిసిపోయిందన్న కామెంట్లు జోరుగా విన్పిస్తున్నాయి.

Tags:    

Similar News