సిక్కోలు వైపు ట్రంప్ చూస్తున్నారా?

వెనకబడిన జిల్లాగా ఉత్తరాంధ్రాలో శ్రీకాకుళాన్ని చెప్పుకుంటారు. ఇక్కడ కనీస సదుపాయలు లేవు. ఏకంగా జిల్లా కేంద్రం సైతం పెద్ద పల్లెటూరుని తలపిస్తుంది. అటువంటి జిల్లాను అభివృధ్ధి చేయాల్సిన [more]

Update: 2020-02-25 08:00 GMT

వెనకబడిన జిల్లాగా ఉత్తరాంధ్రాలో శ్రీకాకుళాన్ని చెప్పుకుంటారు. ఇక్కడ కనీస సదుపాయలు లేవు. ఏకంగా జిల్లా కేంద్రం సైతం పెద్ద పల్లెటూరుని తలపిస్తుంది. అటువంటి జిల్లాను అభివృధ్ధి చేయాల్సిన అవసరం ఉందని చెప్పడమే కానీ ఇప్పటిదాకా చేసిందేదీ లేదు. ఆ సంగతి అలా ఉంచితే నోరూ వాయీ లేని ఈ జిల్లా నెత్తిన పెద్ద ముప్పుని తెచ్చిపెట్టాలనుకుంటున్నారుట. బయటకు అభివృధ్ధిగా కనిపించే అణు ప్రాజెక్ట్ ని ఇక్కడ ఏర్పాటు చేస్తారట. తేడా వస్తే ఆంధ్ర మ్యాప్ లో సిక్కోలు పూర్తిగా కనుమరుగై మాడి మసి అయిపోతుంది. ఇంతటి పెను విప‌త్తుని తెచ్చే కొవ్వాడ అణు విద్యుత్ కర్మాగారానికి వేగంగా అడుగులు పడుతున్నాయని అంటున్నారు.

ట్రంప్ రాక అందుకేనా?

వాస్తవంగా చూస్తే వెనకబడిన శ్రీకాకుళం జిల్లాను వాడుకోవాలని నాటి యూపీయే సర్కార్ కూడా చూసింది. అప్పట్లోనే కొవ్వాడలో అణు విద్యుత్ కేంద్రం ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. దానికి ముందు గుజరాత్ లో ఈ అణు ప్రాజెక్ట్ పెట్టాలనుకున్నా చైతన్యవంతులైన అక్కడి ప్రజలు గట్టిగా తిప్పికొట్టడంతో దాన్ని తెచ్చి ఏపీలో పెట్టాలనుకున్నారు. నాడు వైఎస్సార్ ఉమ్మడి ఏపీకి సీఎంగా ఉండడంతో కేంద్రంలోని యూపీయే సర్కార్ పని సులువు అయింది. అయితే కొవ్వాడలో అణు విద్యుత్ కేంద్రం పెడితే కాలుష్యంతో పాటు అతి భయకరమైన ప్రమాదాన్ని కళ్ళ ముందే పెట్టుకున్నట్లు అవుతుందని పర్యావరణవేత్తలు, మేధావులు గట్టిగా నాడే హెచ్చరించారు. దాంతో ఉద్యమాలు, ఆందోళనలు పెద్ద ఎత్తున చేసి మరీ ఈ ప్రతిపాదన వెనక్కు వెళ్ళేలా చూశారు. ఇపుడు మోడీ ప్రధాని అయ్యాక మరో మారు ఈ ప్రతిపాదనలకు రెక్కలు వచ్చాయని అంటున్నారు.

మోడీ మోజు…..

నిజానికి అణు విద్యుత్ కేంద్రాన్ని తన సొంత రాష్ట్రంలోనే ఏర్పాటు చేయాలని మోడీ మోజు పడ్డారు. ఆయన గుజరాత్ సీఎంగా ఉన్నపుడు అలా ఈ ప్రాజెక్ట్ ని తన వైపుగా మళ్ళించారు. కానీ అక్కడి ప్రజలు తిరగబడడంతో అది సాకారం కాలేదు. ఇపుడు మోడీ ప్రధాని అయ్యారు. దాంతో ఆయన అణు బంధాన్ని మళ్ళీ గట్టిగా తలచుకుంటున్నారుట. దేశంలో అణు విద్యుతు కర్మాగారాలకు విదేశీ పెట్టుబడులను ఆహ్వానిస్తూ మోడీ సర్కార్ తాజాగా ఆమోదించిన సంగతిని కూడా వామపక్ష నేతలు గుర్తుచేస్తున్నారు. ఇవన్నీ ఇలా ఉంటే ఇపుడు భారత్ లో ట్రంప్ పర్యటన వెనక కొవ్వాడలో అణు విద్యుత్ కేంద్రం ఏర్పాటు విషయం కూడా ఉందని అంటున్నారు. అమెరికాకు చెందిన బుక్ ఫీల్డ్ మేనేజ్మెంట్ సంస్థ ద్వారా కొవ్వాడలో అణు విద్యుత్ కేంద్రం ఏర్పాటు చేయాలన్నది ట్రంప్ ఆలోచనగా సీపీఎం విశాఖ జిల్లా నాయకుడు సీహెచ్ నరసింగరావు ఆరోపిస్తున్నారు.

అల్లుడి కోసమేనట…..

అందులో ట్రంప్ అల్లుడు జేర్డ్ కూస్నెర్ ప్రధాన భాగస్వామిగా ఉన్నారని అంటున్నారు. దాంతో ట్రంప్ ఎలాగైనా కొవ్వాడలో అణు విధ్యుత్ ప్లాంట్ కోసం పట్టుబడుతున్నారని, ఆయనకు భారత్ మీద ప్రేమ కంటే అణు ప్లాంట్ మీద మోజే ఎక్కువని సీపీఎం నేత అంటున్నారు. ఆయన్ని తీసుకువచ్చి భారత్ లో సంబరాలు చేస్తున్న మోడీ ట్రంప్ వలలో పడితే తాము ఊరుకోమని ఆయన హెచ్చరిస్తున్నారు. మరి ట్రంప్ రాక వెనక ఇంత కధ ఉందా అని ఇపుడు అంతా చర్చించుకుంటున్నారు.

అయిదు జిల్లాలు అగ్గి….

నిజానికి అణు విద్యుత్ ప్లాంటుల భద్రత అన్నది పెద్ద ప్రశ్న. అభివృధ్ధి చెందిన దేశాలు కూడా వాటి భద్రత విషయంలో పూర్తిగా సన్నధ్ధంగా లేవు. అలాంటిది వెనకబడిన శ్రీకాకుళం జిల్లా మీద అణు కుంపటి మోపాలనుకుంటే మాత్రం అది ఉత్తరాంధ్రాలో పాటు, గోదావరి జిల్లాలను సైతం సర్వనాశనం చేస్తుందని పర్యావరణవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఈ జిల్లాల రూపురేఖలు కూడా మిగిలే అవకాశాలే లేవని అంటున్నారు. ట్రంప్ టూర్ లో కొవ్వాడ అణు విద్యుత్ ప్రాజెక్ట్ కి కనుక ఆమోదం పడితే మాత్రం ఏపీలోని సగం రాష్ట్రం మీద ఆశలు వదిలేసుకోవడం మంచిదని కూడా అంటున్నారు. ఇపుడు దేశంలో అణు విద్యుతు అవసరం కూడా లేదని, పైగా 80 వేల కోట్ల భారీ పెట్టుబడులు పెట్టి పెట్టాల్సిన అవసరం అంతకంటే లేదని సూచిస్తున్నారు. మరి ట్రంప్ దొర అడుగులకు మడుగులు ఒత్తుతున్న మోడీ సర్కార్ కానీ తలవొగ్గితే ఉత్తరాంధ్రా జిల్లాల నెత్తిన అణు బాంబు పెట్టినట్లే మరి.

Tags:    

Similar News