వరదలోనూ విజయం కొట్టుకుపోయినట్లేనా?

గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు జరగుతున్న వేళ నగరంలో వరద విపత్తు అధికార పార్టీకి ఇబ్బందికరంగా మారిందని చెప్పాలి. దాదాపు జంటనగరాలన్నీ మూడు రోజులు పాటు నీటిలో నానాయి. [more]

Update: 2020-10-22 11:00 GMT

గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు జరగుతున్న వేళ నగరంలో వరద విపత్తు అధికార పార్టీకి ఇబ్బందికరంగా మారిందని చెప్పాలి. దాదాపు జంటనగరాలన్నీ మూడు రోజులు పాటు నీటిలో నానాయి. దాదాపు సగం ప్రాంతాలు నీట మునిగాయి. విద్యుత్ సరఫరా లేదు. దీంతో జంట నగరాల ప్రజలు అనేక అవస్థలు పడ్డారు. వందేళ్లలో ఇంతటి భారీ వర్షపాతం రెండోసారి నమోదు కావడం, ఎప్పుడూ లేనంతగా నగరంలో అనేక ప్రాంతాలు జలమయం కావడంతో స్థానికులు ఆగ్రహంతో ఉన్నారు.

మూడు రోజుల పాటు….

మూడు రోజుల పాటు తాము నీళ్లు, ఆహారం లేకున్నా తమను ఎవరూ పట్టించుకోలేదని నీట మునిగిన ప్రాంతాల ప్రజలు ఆరోపిస్తున్నారు. వరద నీరు తగ్గినా తమ ఇళ్లలో పేరుకుపోయిన బురదను తొలగించుకునేందుకు కూడా సాయం అందించలేదని అనేక చోట్ల మండి పడుతున్నారు. ముఖ్యంగా స్థానిక కార్పొరేటర్లు, ఎమ్మెల్యేలు తమను పట్టించుకోలేదని మీడియా ముందు ఆగ్రహం వ్యక్తం చేసిన సంఘటనలు అనేకం చూశాం.

ఖచ్చితంగా ప్రభావం…..

వరద ప్రభావం జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఖచ్చితంగా పడుతుందని అధికార పార్టీ కూడా అంచనా వేసింది. అయితే సాయం చేయలేని స్థితిలో వర్షపాతంనమోదయిందని, వర్షంతగ్గుముఖం పట్టాక సహాయక చర్యలు చేపట్టామని అధికార పార్టీనేతలు చెబుతున్నప్పటికీ, ప్రజలు ఎంతమేరకు అంగీకరిస్తారనేది ప్రశ్న. గ్రేటర్ హైదరాబాద్ లో 150 డివిజన్లకు గాను దాదాపు వంద మంది కార్పొరేటర్లు అధికార టీఆర్ఎస్ కు చెందిన వారే.

కార్పొరేటర్లపై…….

వీరిలో పదిహేను మందిపైనే ప్రజల్లో అసంతృప్తి ఉందని, వారని మార్చక తప్పదని ఇటీవల మంత్రి కేటీఆర్ తెలిపారు. కానీ వరదల తర్వాత వీరి సంఖ్య మరింత పెరిగే అవకాశముందని పార్టీ వర్గాలే అంగీకరిస్తున్నాయి. వరద సమయంలో ప్రజల చెంతకు వెళ్లలేని కార్పొరేటర్లపై ప్రజలు మండిపడుతున్నందున వారికి తిరిగి టిక్కెట్లు కేటాయించే అంశంపై పార్టీ అధిష్టానం పునరాలోచనలో పడే అవకాశముందంటున్నారు. మొత్తం మీద వరద ముంపు అధికార టీఆర్ఎస్ పార్టీని ఎన్నికల వేళ ఇబ్బంది పెట్టిందనే చెప్పాలి. మరి ఎన్నికల నాటికి సర్దుకుంటుందో? లేదో? చూడాల్సి ఉంది.

Tags:    

Similar News