‌‌Huzurabad : గెలుపోటములను డిసైడ్ చేసేది అదేనట

హుజూరాబాద్ ఉప ఎన్నిక దాదాపు పూర్తయింది. ఇక ఎన్నికల ఫలితాలు మాత్రమే రావాల్సి ఉంది. అయితే ఈ ఎన్నికల్లో కేసీఆర్, ఈటల రాజేందర్ మధ్యనే పోటీ జరిగినట్లు [more]

Update: 2021-10-30 09:30 GMT

హుజూరాబాద్ ఉప ఎన్నిక దాదాపు పూర్తయింది. ఇక ఎన్నికల ఫలితాలు మాత్రమే రావాల్సి ఉంది. అయితే ఈ ఎన్నికల్లో కేసీఆర్, ఈటల రాజేందర్ మధ్యనే పోటీ జరిగినట్లు వాతావరణం ఏర్పడింది. బీజేపీ, టీఆర్ఎస్ పార్టీ లకన్నా వ్యక్తిగతంగా వారిద్దరి మధ్యనే పోరు జరిగిందన్నది మాత్రం వాస్తవం. ఇద్దరిలో ఎవరు గెలిచినా వారికి ఈ ఎన్నిక అనేక పాఠాలను నేర్పనుంది. అయితే ఈ ఉప ఎన్నికలో దళితబంధు పథకమే గెలుపోటములను నిర్ణయిస్తుందన్నది విశ్లేషకుల అంచనా.

దళిత బంధు పథకాన్ని….

ముఖ్యమంత్రి కేసీఆర్ దళితబంధు పథకాన్ని ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టారు. ప్రయోగాత్మంగా పథకాన్ని అమలు చేయడానికి హుజూరాాద్ నియోజకవర్గాన్ని ఎంచుకున్నారు. ఈ పథకానికి రాహుల్ బొజ్జాను అధికారిగా నియమించి సమన్వయం చేసుకోవాలని సూచించారు. హుజూరాబాద్ లో సర్వే కూడా జరిగింది. ఒక్కొక్క దళిత కుటుంబానికి పది లక్షలు ఇవ్వాల్సి రావడంతో ఎలాంటి అవకతవకలు జరగకుండా చూడాలని కేసీఆర్ అధికారులను ఆదేశించారు.

మిగిలిన సామాజికవర్గాల్లో….

తొలి విడతలో కొందరు అర్హులైన వారికి పది లక్షలు అందజేశారు. అయితే ఎన్నికల కమిషన్ ఆదేశాలతో దళితబంధు పథకాన్ని నిలిపేయాల్సి వచ్చింది. అంతకు ముందే ఈ పథకాన్ని దళితులకు మాత్రమే వర్తింప చేయడంతో మిగిలిన సామాజికవర్గాల్లో వ్యతిరేకత కనపడింది. దీతో అధికార టీఆర్ఎస్ హుజూరాబాద్ లో కులపెద్దలను బుజ్జగించి తమకు అనుకూలంగా పనిచేయాలని కోరింది. అయినా మిగిలిన సామాజికవర్గాల్లో వ్యతిరేకత కన్పిస్తుందన్నది వాస్తవం.

పథకాన్ని నిలిపి వేయించారని…

మరోవైపు ఈటల రాజేందర్ కు కూడా దళితబంధు పథకం ఇబ్బందిగా మారనుంది. పథకాన్ని నిలిపేసింది బీజేపీ నేతలేనని అధికార టీఆర్ఎస్ ప్రచారం చేయడంతో ఆ సామాజికవర్గం ఓటర్లు దూరమయ్యే అవకాశాలున్నాయి. దీంతోపాటు హుజూరాబాద్ లో కాంగ్రెస్ పార్టీ చీల్చే ప్రతి ఓటు ఈటల రాజేందర్ కు ఇబ్బంది కలిగించేదే. అందుకే హుజూరాబాద్ లో దళిత బంధు గెలుపోటములను డిసైడ్ చేస్తుంది. ఎవరిది గెలుపు అన్నది తెలియాలంటే మరి కొద్ది గంటలు ఆగాల్సిందే.

Tags:    

Similar News