బీజేపీ బలంగా చీల్చగలిగితే….?

ఆంధ్రప్రదేశ్‌లో తిరుపతి పార్లమెంట్‌ ఉప ఎన్నికల వేడి రాజుకుంది. తెలంగాణ‌లో దుబ్బాక అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గానికి జ‌రిగిన ఉప ఎన్నిక ర‌స‌వ‌త్తరంగా జ‌ర‌గ‌డంతో పాటు అధికార టీఆర్ఎస్ సిట్టింగ్ [more]

Update: 2020-11-25 03:30 GMT

ఆంధ్రప్రదేశ్‌లో తిరుపతి పార్లమెంట్‌ ఉప ఎన్నికల వేడి రాజుకుంది. తెలంగాణ‌లో దుబ్బాక అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గానికి జ‌రిగిన ఉప ఎన్నిక ర‌స‌వ‌త్తరంగా జ‌ర‌గ‌డంతో పాటు అధికార టీఆర్ఎస్ సిట్టింగ్ సీటును సంచ‌ల‌నాత్మక రీతిలో విప‌క్ష బీజేపీ గెలుచుకోవ‌డంతో తిరుప‌తి పార్లమెంటుకు జ‌రిగే ఉప ఎన్నిక ఫ‌లితం ఎలా ఉంటుందా ? అన్న ఆస‌క్తి అంద‌రిలోనూ నెల‌కొంది. దుబ్బాక‌లో మాత్రమే కాదు.. అంత‌కు ముందు తెలంగాణ‌లో పాలేరు, ఖేడ్‌లో జ‌రిగిన ఉప ఎన్నిక‌ల్లోనూ సానుభూతి ప‌నిచేయ‌లేదు. దీంతో తిరుప‌తిలో కూడా సానుభూతి సెంటిమెంట్ ప‌ని చేసే అవ‌కాశాలు ఉండే స్కోప్ లేదు. పైగా ఇక్కడ మృతి చెందిన వైసీపీ సిట్టింగ్ ఎంపీ బ‌ల్లి దుర్గాప్రసాద్ కుటుంబ స‌భ్యులు ఈ ఉప ఎన్నిక‌ల్లో పోటీ చేసేందుకు ఆస‌క్తితో లేక‌పోవడంతో ఇక్కడ అధికార పార్టీ అభివృద్ది వ‌ర్సెస్ ప్రభుత్వ వ్యతిరేక‌త మ‌ధ్యే ఫ‌లితం ఎలా ఉంటుందా ? అన్న ఆస‌క్తి ఉండ‌బోతోంది.

ప్రభుత్వ వ్యతిరేకత…..

ఈ ఉప ఎన్నిక అధికార వైసీపీకి ఎంత ప్రతిష్టాత్మ‌క‌మో ? అటు టీడీపీతో పాటు బీజేపీ కూడా అంతే ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి. ఇప్పటికే ప్రభ‌ుత్వంపై ప్రజ‌ల్లో అనేకానేక అంశాల‌పై వ్యతిరేక‌త వ్య‌క్త‌మ‌వుతోంది. రాజ‌ధాని మార్పు అంశాన్ని ప్రధాన అస్త్రంగా చేసుకుని ఎన్నిక‌ల‌కు వెళుతూ వైసీపీని ఇబ్బంది పెట్టాల‌ని టీడీపీ భావిస్తోంది. అభివృద్ధి, సంక్షేమాన్ని ప్రధాన‌స్త్రంగా చేసుకుని ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించి ప్రభుత్వంపై వ్యతిరేక‌త లేద‌ని నిరూపించుకోవాల‌ని వైసీపీ ప్లాన్ చేస్తోంది. ఇక తిరుప‌తి ప్రముఖ పుణ్యక్షేత్రం కావ‌డంతో అక్కడ ఇటీవ‌ల జ‌రిగిన ప‌రిణామాలు, హిందూత్వ వాదం, జ‌న‌సేన స‌పోర్ట్ ఇత‌ర‌త్రా అంశాల‌ను ప్రధానంగా చేసుకుని స‌త్తా చాటాల‌ని బీజేపీ భావిస్తోంది.

అభ్యర్థుల పేర్లు దాదాపు….

ఇక్కడ బీజేపీ + జ‌న‌సేన క‌లిసి పోటీ చేసినా ఆ కూట‌మికి గెలిచే అవకాశాలు లేవు. అయితే ఆ పార్టీ చీల్చే ఓట్లు మాత్రం పోటీని ఖ‌చ్చితంగా ముక్కోణంగా మార్చేస్తాయ‌న‌డంలో సందేహం లేదు. చంద్రబాబు ఇప్పటికే త‌మ పార్టీ అభ్యర్థిగా గ‌త ఎన్నికల్లో పోటీ చేసిన కేంద్ర మాజీ మంత్రి ప‌న‌బాక ల‌క్ష్మి పేరును అధికారికంగా ప్రక‌టించారు. ఇక తిరుప‌తి పార్లమెంటు ప‌రిధిలో ఉన్న ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో ప‌లువురు నేత‌ల‌కు ఉప ఎన్నిక బాధ్యత‌లు అప్పగించారు. ఇక అధికార వైసీపీ నుంచి ఎవ్వరి పేరు అధికారికంగా ఖ‌రారు కాక‌పోయినా హైద‌రాబాద్‌లో ఉంటోన్న ఓ పారిశ్రామిక వేత్త పేరును ప‌రిశీలిస్తున్నట్టు పార్టీ వ‌ర్గాలు చ‌ర్చించుకుంటున్నాయి.

ఎవరికి అనుకూలం……

పార్లమెంటు ప‌రిధిలోని ఏడు అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల్లోనూ వైసీపీకి త‌ల‌పండిన ఎమ్మెల్యేలు ఉన్నారు. గ‌త ఎన్నిక‌ల్లో ఒక్క తిరుప‌తిలో మాత్రమే టీడీపీ అభ్యర్థి సుగుణ‌మ్మ గ‌ట్టి పోటీ ఇచ్చి కేవ‌లం 700 ఓట్ల తేడాతో ఓడిపోయారు. మిగిలిన చోట్ల వైసీపీ ఎమ్మెల్యేల‌కు భారీ మెజార్టీలు వ‌చ్చాయి. ప్రస్తుతం ఉప ఎన్నిక జ‌రిగితే టీడీపీ గ‌తంతో పోలిస్తే ఎంత వ‌ర‌కు పుంజుకుంటుంది ? అన్నది చూడాలి. తిరుప‌తి పార్లమెంటు ప‌రిధిలో టీడీపీ గ్రాఫ్ ఎన్నిక‌ల కంటే త‌గ్గింద‌న్న విశ్లేష‌ణ‌లు వ్యక్తమ‌వుతున్నా… ప్రభుత్వ వ్యతిరేక‌త కూడా ఉండ‌డంతో అది టీడీపీ, బీజేపీల‌లో ఎవ‌రు క్యాష్ చేసుకుంటార‌న్నది చూడాలి.

బీజేపీ గణనీయంగా చీల్చగలిగితే….

బీజేపీకి ఇక్కడ సంస్థాగ‌తంగా ఓటు బ్యాంకు లేకున్నా… తిరుప‌తితో పాటు కొన్ని సెగ్మెంట్లలో జ‌న‌సేన‌ను అభిమానించే కాపు, బ‌లిజ వ‌ర్గాల‌తో పాటు ప‌వ‌న్ అభిమానులు ఉన్నారు. ఇక తిరుప‌తి పుణ్యక్షేత్రంగా ఉండ‌డంతో ఈ అంశాల‌ను అనుకూలంగా మ‌లుచుకుని స‌త్తా చాటాల‌ని బీజేపీ భావిస్తోంది. బీజేపీ ల‌క్షకు పైన ఓట్లు చీలిస్తే ఎన్నిక‌ల ఫ‌లితం ఉత్కంఠ‌గా మార‌నుంద‌ని అంటున్నారు. గ‌త ఎన్నికల్లో వైసీపీ ఈ సీటును ఏకంగా 2.28 ల‌క్షల ఓట్ల మెజార్టీతో గెలుచుకుంది. ఈ సారి ట్రయాంగిల్ ఫైట్ గ‌ట్టిగా ఉంటే అంత మెజార్టీ రాద‌నే అనుకోవ‌చ్చు. ఏదేమైనా తిరుప‌తి పార్లమెంటులో ట్రయాంగిల్ ఫైట్ జ‌రిగే స్కోపే ఎక్కువుగా ఉంది. మ‌రి ఫ‌లితం ఎలా మ‌లుపులు తిరుగుతుంద‌న్నది మాత్రం వెయిట్ చేయాలి.

Tags:    

Similar News