మొత్తం మీద ఫిక్స్ చేశారు… రెడీ అయ్యారు

బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడింది. ఈ నేపథ్యంలో మహాకూటమి సీట్ల పంపకాలపై దృష్టి పెట్టింది. ప్రధానంగా ఈ కూటమిలో రాష్ట్రీయ జనతా దళ్ ప్రధాన [more]

Update: 2020-10-10 17:30 GMT

బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడింది. ఈ నేపథ్యంలో మహాకూటమి సీట్ల పంపకాలపై దృష్టి పెట్టింది. ప్రధానంగా ఈ కూటమిలో రాష్ట్రీయ జనతా దళ్ ప్రధాన పాత్ర పోషించనుంది. గత ఎన్నికల్లోనూ ఆర్జేడీ అత్యధిక స్థానాలను సాధించింది. అయితే ఈసారి కాంగ్రెస్, ఆర్జేడీల మధ్య సీట్ల పంపకాలపై గత కొద్దిరోజులుగా చర్చలు జరుగుతున్యాయి. ఈ కూటమి నుంచి మాంఝీ పార్టీ, ఉపేంద్ర కుశ్వాహా నేతృత్వంలోని రాష్ట్రీయ లోక్ సమతా పార్టీ బయటకు వెళ్లడంతో వామపక్షాల పంట పండినట్లయింది.

అధిక స్థానాలను……

ఇప్పటికే ఈసారి ఎన్నికల్లో తమకు అత్యధిక స్థానాలు కావాలని కాంగ్రెస్ కోరుతుంది. మొత్తం 243 స్థానాలున్న బీహార్ ఎన్నికల్లో ప్రధాన పార్టీ ఆర్జేడీయేని చెప్పాలి. అయితే వరసగా తేజస్వి యాదవ్ ను బూచిగా చూపి మహాకూటమి నుంచి వెళ్లిపోవడంతో కాంగ్రెస్, వామపక్షాలు తేజస్వి పై మైండ్ గేమ్ ఆడాయంటున్నారు. ఉన్న కొద్ది మంది మిత్రులను వదులుకోవడం ఇష్టం లేని తేజస్వి యాదవ్ ఆ పార్టీ డిమాండ్లకు తలొగ్గక తప్పలేదంటున్నారు.

వంద స్థానాలు మిత్రులకు…..

మొత్తం 243 అసెంబ్లీ స్థానాల్లో 143 స్థానాల్లో రాష్ట్రీయ జనతా దళ్ పోటి చేయనుంది. మిగిలిన వంద స్థానాలను మిత్రులకు వదిలేయాలని నిర్ణయించింది. కాంగ్రెస్ కు 70 స్థానాలు, వామపక్ష పార్టీలకు 30 స్థానాలను కేటాయించనున్నారు. నిజానికి వామపక్ష పార్టీలకు ఈ సంఖ్య ఎక్కువేనంటున్నారు. గత ఎన్నికల్లో మహాకూటమిలో జేడీయూ కూడా ఉండటంతో కాంగ్రెస్, వామపక్షాలకు తక్కువ స్థానాలు దక్కాయి. ఈసారి జేడీయూ ఎన్డీఏలోకి వెళ్లడంతో కాంగ్రెస్ పార్టీ తన కోటా కింద ఎక్కువ స్థానాలను దక్కించుకుంది.

స్థానాలను మాత్రం…..

అయితే తాము కేటాయించిన స్థానాల్లో మాత్రమే పోటీ చేయాలని ఆర్జేడీ షరతు విధించింది. నెంబర్ అయితే ఫిక్స్ అయింది కానీ, ఎక్కడ నుంచి పోటీ చేయాలన్నది ఇంకా ఖరారు కాలేదు. ఆర్జేడీ కాంగ్రెస్, వామపక్షాలు గెలిచే స్థానాలను కేటాయిస్తుందంటున్నారు. ఏ నియోజకవర్గంలోనైనా కాంగ్రెస్, వామపక్షాలు గెలవాలంటే ఆర్జేడీ సహకారం అవసరం. అందుకే ఆర్జేడీ కేటాయించే స్థానాలనే తీసుకోక తప్పని పరిస్థితి ఈ రెండు పార్టీలదీ. మొత్తం మీద మహాకూటమిలో సీట్ల సర్దుబాటు ఒక కొలిక్కి వచ్చినట్లే.

Tags:    

Similar News