తోట త్రిమూర్తులుకు ఝలక్ తప్పదా.?

తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురం మాజీ ఎమ్యెల్యే తోట త్రిమూర్తుల రాజకీయ భవిష్యత్తుపై ఇప్పుడు జిల్లాలో జోరుగా చర్చ నడుస్తుంది. ఈ నియోజకవర్గం నుంచి చెల్లుబోయిన వేణుగోపాల్ కి [more]

Update: 2020-07-24 05:00 GMT

తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురం మాజీ ఎమ్యెల్యే తోట త్రిమూర్తుల రాజకీయ భవిష్యత్తుపై ఇప్పుడు జిల్లాలో జోరుగా చర్చ నడుస్తుంది. ఈ నియోజకవర్గం నుంచి చెల్లుబోయిన వేణుగోపాల్ కి జగన్ మంత్రి పదవి ఇవ్వడం ఈ చర్చ మొదలైంది. తోట త్రిమూర్తులు వర్సెస్ పిల్లి సుభాష్ చంద్ర బోస్ గా దాదాపు మూడు దశాబ్దాల రాజకీయ యుద్ధం నడిచింది. వీరిద్దరి నడుమ యుద్ధం ఏ స్థాయిలో అంటే ఇద్దరికి ఒక్కో సందర్భంలో ఆయా పార్టీని టిక్కెట్ ఇవ్వకపోయినా ఇండిపెండెంట్లుగా పోటీ చేసి చెరోసారి ఒకరిపై మరొకరు గెలిచిన చరిత్ర ఉంది.

గత ఎన్నికల్లో……

అయితే గత ఎన్నికల్లో పిల్లి సుభాష్ చంద్రబోస్ ను మండపేట నుంచి జగన్ పోటీ చేయించారు. బోస్ స్థానంలో అదే సామాజికవర్గానికి చెందిన చెల్లుబోయిన వేణుగోపాల్ ను రంగంలోకి దింపి కాకలు తీరిన తోట త్రిమూర్తులను మట్టికరిపించేలా వ్యూహం పన్నింది వైసిపి. జనసేన చీల్చిన ఓట్లతో ఫ్యాన్ పార్టీ హవాకు ఇక్కడ అడ్డే లేకుండా పోయింది. ఫలితంగా కొత్త అభ్యర్థిగా చెల్లుబోయిన వేణుగోపాల్ నియోజకవర్గంలో అడుగుపెట్టినా ఆయననే విజయలక్ష్మి వరించింది.

దారిలేక అధికారపార్టీ తీర్ధం …

తోట త్రిమూర్తులు ఓటమి తరువాత ఎక్కువ కాలం వేచి చూడలేదు. ఫ్యాన్ కింద సేద తీరితేనే భవిష్యత్తు అని లెక్కేసుకున్నారు. అనుకున్నదే జంప్ అయ్యారు. దాంతో వైసిపి అధినాయకత్వానికి కొత్త చిక్కులు వచ్చి పడ్డాయి. ఒక పక్క రామచంద్రపురం నియోజకవర్గంలో పాత కాపులు తోట, పిల్లి బోస్ ల మధ్య చెల్లుబోయిన వేణు రాజకీయాలు నిత్యం అక్కడ హాట్ హాట్ గా నడిచేవి. బోస్ మంత్రి కావడంతో వైసిపి నేతలంతా ఆయన వెంటే నడుస్తుంటే మరోపక్క తోట త్రిమూర్తులు అనధికారికంగా నియోజకవర్గంలో చక్రం తిప్పేస్తుంటే చెల్లుబోయిన చూస్తూ ఉరుకోవాలిసి వచ్చేది. కోనసీమ వైసిపి పార్లమెంటరీ కి ఇన్ ఛార్జ్ గా తోట త్రిమూర్తులు ను నియమించినా ఆయన రామచంద్రపురం పై పట్టును ఏనాడు వదులుకోవడానికి సిద్ధ పడలేదు. ఇది తట్టుకోలేని వేణు వర్గం ఒకదశలో త్రిమూర్తులపై భౌతిక దాడికి సైతం పార్టీ ఇన్ ఛార్జ్ వైవి సుబ్బారెడ్డి ఎదురుగానే పాల్పడింది. ఆ తరువాత తోట త్రిమూర్తులు వర్గీయులు ఆ వ్యక్తిపై ప్రతిదాడికి పాల్పడటం పార్టీ వర్గాల్లో కలవరాన్ని నింపింది.

కిం కర్తవ్యం …

జీవితంలో ఒక్కసారైనా మంత్రి కావాలన్నది తోట త్రిమూర్తులు ఆశ అన్నది ఆయన సన్నిహితుల మాట. అయితే టిడిపి లో చంద్రబాబు ఆయన కోరిక నెరవేర్చలేదు. దూకుడు గా ఉండే తోట కు ఆ పదవిని అందని ద్రాక్షే చేశారు బాబు. సరే వైసిపి లో అయినా తన కోరిక నెరవేరడానికి తోట త్రిమూర్తులు కు ఛాన్స్ ఇప్పుడు వేణు రూపంలో పూర్తిగా లేకుండా పోయింది. భవిష్యత్తులో జగన్ ఎమ్యెల్సీని చేసినా మంత్రి పదవి వచ్చే అవకాశాలు లేవనే చెప్పాలి. బోస్ ను రాజ్యసభకు పంపడం, వేణు గోపాల్ కి అదే స్థానంలో మంత్రిని చేయడం వల్ల ఒకే నియోజకవర్గంలోని ముగ్గురికి ఉన్నత స్థానం కల్పించడం అయ్యే పని కాదని విశ్లేషకుల అంచనా. కాపు సామాజికవర్గం కోటా లో ఇప్పటికే కురసాల కన్నబాబు కి జగన్ అత్యంత ప్రాధాన్యత ఇచ్చి దగ్గర చేసుకున్నారు. రెండున్నరేళ్ళ తరువాత మంత్రి వర్గంలో మార్పులు చేసి కన్నబాబు ను పక్కన పెట్టినా ఆయన స్థానంలో కాపు సామాజిక వర్గం కోటా లో జక్కంపూడి రాజా, దాడిశెట్టి రాజా, జ్యోతుల చంటిబాబు లు ఉండనే ఉన్నారు. వీరి ముగ్గురిలో ఒకరికి ఆ అవకాశం లభించే పరిస్థితి ఉందని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో నాలుగుసార్లు ఎమ్యెల్యే పదవి చేపట్టిన తోట త్రిమూర్తుల కలలు ఎప్పటికి తీరతాయో మరి.

Tags:    

Similar News