ముందుంది బాబూ… సెకండ్ వేవ్…?

ఇటీవల కరోనా వైరస్ కేసులు కొంత తగ్గుముఖం పట్టాయి. రోజువారీ టెస్టింగ్ ల సంఖ్య పెంచినా కేసుల సంఖ్య తగ్గుతుండటంతో భారత్ లో కరోనా వైరస్ ప్రభావం [more]

Update: 2020-11-04 17:30 GMT

ఇటీవల కరోనా వైరస్ కేసులు కొంత తగ్గుముఖం పట్టాయి. రోజువారీ టెస్టింగ్ ల సంఖ్య పెంచినా కేసుల సంఖ్య తగ్గుతుండటంతో భారత్ లో కరోనా వైరస్ ప్రభావం తగ్గిందని సంబర పడిపోతున్న వేళ వైద్య నిపుణులు బ్యాడ్ న్యూస్ చెప్పేశారు. భారత్ లో కరోనా వైరస్ సెకడం వేవ్ ఉందని నిపుణులు స్పష్టంగా చెబుతున్నారు. ఇప్పటికే ఫ్రాన్స్ వంటి దేశాల్లో కరోనా వైరస్ సెకండ్ వేవ్ ప్రారంభయిన సంగతిని వారు గుర్తు చేస్తున్నారు.

తగ్గినట్లు కనపడుతున్నా…..

గత కొద్దిరోజులుగా కరోనా వైరస్ భారత్ లో కొంత తగ్గింది. కేసుల సంఖ్యలో కూడా స్పష్టంగా మార్పులు కన్పిస్తున్నాయి. గతంలో రోజుకు 70 వేలకు పైగా దేశ వ్యాప్తంగా కరోనా కేసులు నమోదయ్యేవి. గత కొద్దిరోజుల నుంచి నలభై నుంచి యాభై వేల మధ్యనే కేసులు నమోదవుతున్నాయి. రికవరీ రేటు కూడా బాగా పెరిగింది. ప్రస్తుతం భారత్ లో 90.85 శాతం రికవరీ రేటు ఉంది. మరణాల రేటు కూడా బాగా తగ్గింది. ప్రస్తుతం మరణాల రేటు 1.50 శాతంగా ఉంది.

కొన్ని వారాల్లోనే….?

అయితే ఇది సంతోషించదగ్గ పరిణామమే అయినా మరో మూడు నాలుగు వారాల్లో భారత్ లో కరోనా వైరస్ సెకండ్ వేవ్ ప్రారంభమవుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. కరోనా వైరస్ తగ్గుముఖం పడుతుందని భావించిన ప్రజలు నిర్లక్ష్యం పాటిస్తే మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు. వైద్య నిపుణుల అంచనా ప్రకారం ఈ నెల మూడు, నాలుగు వారాల్లో కాని, డిసెంబరు మొదటి వారంలో కాని కరోనా సెకండ్ వేవ్ ఉంటుందని చెబుతున్నారు.

తీవ్రంగా ఉండనుందా?

అయితే సెకండ్ వేవ్ లో కరోనా వైరస్ ప్రభావం తీవ్రంగా ఉండనుందని హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే కరోనా ప్రభావం లేదని భావించి ప్రజలు నియంత్రణ చర్యలు పాటించడం లేదన్నారు. అలాగే పండగల సీజన్ కూడా వైరస్ వ్యాప్తి చెందడానికి ఒక కారణంగా వైద్య నిపుణులు చెబుతున్నారు. ఇప్పటి వరకూ వ్యాక్సిన్ అందుబాటులోకి రాలేదు. ఈలోపు సెకండ్ వేవ్ స్టార్టయితే మరణాల సంఖ్య కూడా భారీగానే ఉండవచ్చని నిపుణులు వార్నింగ్ ఇస్తున్నారు. ప్రజలు కూడా అప్రమత్తంగా లేకపోతే భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు.

Tags:    

Similar News