విశాఖలో కేసులు నిల్…కారణమదేనా ?

విశాఖలో కరోనా కేసులు లేవు. వరసగా మిగిలిన జిల్లాల్లో కూడా ఒకటీ అరా కేసులు పెరుగుతూండగా విశాఖలో మాత్రం కేసులు లేకపోవడం పట్ల రాజకీయ రచ్చ అవుతోంది. [more]

Update: 2020-05-03 15:30 GMT

విశాఖలో కరోనా కేసులు లేవు. వరసగా మిగిలిన జిల్లాల్లో కూడా ఒకటీ అరా కేసులు పెరుగుతూండగా విశాఖలో మాత్రం కేసులు లేకపోవడం పట్ల రాజకీయ రచ్చ అవుతోంది. దీని మీద ఏకంగా మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు కేసులు కనుక దాస్తే ఆ పాపం వైసీపీ సర్కార్ కి ఊరకే పోదు అని శాపాలు పెట్టేశారు. ఇక టీడీపీ ఎమ్మెల్సీలు, తమ్ముళ్ళు కూడా కేసులు లేకుండా ఎలా ఉంటాయి. విశాఖ మెగా సిటీ, కానీ ప్రభుత్వమే రాజధాని రాజకీయం కోసం కేసులు లేవని చెబుతోందని ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు. అసలు ఇంతకీ ఏది నిజం అన్న చర్చ ప్రజలలో కూడా ఉంది.

అందరూ ఇక్కడే….

విశాఖకు ఆరంభంలో పెద్ద ఎత్తున కేసులు వచ్చాయి. దాంతో జనాల్లో భయాలు కూడా ఒక్కసారిగా పెరిగిపోయాయి. విశాఖలో అంతర్జాతీయ విమానాశ్రయం ఉండడం, విదేశాల నుంచి ఉద్యోగాలు చేస్తూ వచ్చిన వారంతా ఇక్కడే ఉండడంతో వారి ద్వారా కరోనా వైరస్ పెద్ద ఎత్తున వ్యాపిసుందని కూడా ఆందోళన చెందారు. ఇక విద్యార్ధులు ఉన్నత చదువుల కోసం అమెరికా ఇతర దేశాలకు వెళ్ళిన వారు కూడా విశాఖలోనే ఉన్నారు. దీనికి తోడు కొన్ని చోట్ల ముస్లిం జనాభా కూడా చెప్పుకోదగిన సంఖ్యలో ఉంది. ఆ మధ్య డిల్లీ ప్రార్ధనలకు వెళ్ళిన వారిలో ఎక్కువగా విశాఖ వాసులు ఉన్నారు. దాంతో కరోనా కేసులు బాగానే ఎగబాకుతాయని అంతా అనుకున్నారు.

అక్కడే ఆగినా ….?

ఇక విశాఖలో కరోనా కేసులు పాతిక దాటడం లేదు. పైగా ఎపుడో కరోనా పాజిటివ్ కేసులు వచ్చిన వారు దాదాపుగా అంతా ఇపుడు డిశ్చార్జి అయ్యారు. ఇక మిగిలినది ఒకరిద్దరే తప్ప ఎవరూ లేరు. దీంతో విశాఖ కరోనా జీరో జిల్లాగా తొందరలో ప్రకటిస్తామని అధికారులు చెబుతున్నారు. పొరుగున ఉన్న విజయనగరంలో ఇప్పటిదాకా ఒక్క కేసు కూడా నమోదు కాలేదు, శ్రీకాకుళంలో ఇపుడిపుడే నాలుగు కేసులు ఉన్నాయి. మొత్తం మీద చూస్తే ఉత్తరాంధ్రా అంతటా కరోనా భయం లేద‌ని అధికారులు అంటున్నారు. దీని వెనక దాపరికం ఏదీ లేదని, కరోనా కేసులను ఎవరూ దాచలేరని మంత్రి అవంతి శ్రీనివాస్ చెబుతున్నారు.

ఇమేజ్ డ్యామేజ్ కాకుండా….?

ఇక విశాఖను రాజధానిగా వైసీపె సర్కార్ ప్రకటించింది కాబట్టి ఆ ఇమేజ్ డ్యామేజ్ కాకుండా వైసీపీ సర్కార్ కేసులను దాచిపెడుతోందని టీడీపీ ఇతర విపక్షాలు మాత్రం విమర్శలు చేస్తూనే ఉన్నాయి. విశాఖలో కరోనా అనుమానితులు అక్కడక్కడా ఉన్నా వారిని రహస్యంగా తరలిస్తున్నారు తప్ప రికార్డులకు ఎక్కించడంలేదని కూడా తీవ్రమైన ఆరోపణలు చేస్తున్నారు. దీని మీద మరో మంత్రి బొత్స సత్యనారాయణ కౌంటర్ వేశారు. రాజధాని అయినంత మాత్రానా కరోనా కేసులు ఉండవా, ఉంటే రాజధానిని వేరే చోటకు మార్చేస్తారా. అలా అయితే ఢిల్లీ, హైదరాబద్ సంగతేంటని కూడా ప్రశ్నిస్తున్నారు. మొత్తం మీద చూసుకుంటే విశాఖ సేఫ్ అని అధికారులతో పాటు, ప్రభుత్వం చెబుతోంది. విపక్షాలు మాత్రం కేసులు ఉన్నాని అంటున్నారు. దీంతో విశాఖవాసులు అయోమయంలో పడుతున్నారు.

Tags:    

Similar News