కొత్త ఎమ్మెల్యేలు.. కంచులే.. మామూలోళ్లు కాదుగా…!

స‌హ‌జంగా కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు అంటే.. ఎలా ఉంటారు ? పైగా రాజ‌కీయంగా ఎలా పునాదులు లేని కుటుంబాల నుంచి వ‌చ్చిన వారి ప‌రిస్థితి ఎలా ఉంటుంది? [more]

Update: 2020-09-11 00:30 GMT

స‌హ‌జంగా కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు అంటే.. ఎలా ఉంటారు ? పైగా రాజ‌కీయంగా ఎలా పునాదులు లేని కుటుంబాల నుంచి వ‌చ్చిన వారి ప‌రిస్థితి ఎలా ఉంటుంది? ఎవ‌రితో మాట్లాడాల‌న్నా.. జంకు, బెరుకు స‌హ‌జం. పైగా.. ప్రత్యర్థుల‌ను ఎలా త‌ట్టుకోవాల‌నే విష‌యంలో చాలా వ‌ర‌కు వ్యూహం అంటూ ఏమీ ఉండ‌దు. ఇది స‌హ‌జంగా జ‌నాలు అనుకునే మాట‌. అదే స‌మ‌యంలో అభివృద్ధిపైనా పెద్దగా విజ‌న్ ఉండ‌ద‌ని భావిస్తారు. గ‌తంలో టీడీపీ త‌ర‌ఫున తొలిసారి విజ‌యం సాధించిన నాయ‌కులు ఇలానే చేశారు కాబ‌ట్టి.. అంద‌రూ ఇలానే అనుకున్నారు. అనుకుంటున్నారు కూడా. అయితే, దీనికి భిన్నంగా వైసీపీ త‌ర‌ఫున తొలిసారి విజ‌యం ద‌క్కించుకున్న ఎమ్మెల్యేలు మాత్రం కంచులుగా మారారు.

తొలిసారి అసెంబ్లీలోకి అడుగుపెట్టి….

వీరి జాబితా చాలానే ఉంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. వీరిలో గుంటూరు జిల్లా చిల‌క‌లూరి పేట ఎమ్మెల్యే విడ‌ద‌ల ర‌జ‌నీ, ఇదే జిల్లా తాడికొండ‌కు చెందిన డాక్టర్ శ్రీదేవి, చిత్తూరు జిల్లా ప‌ల‌మ‌నేరుకు చెందిన వెంక‌టే గౌడ‌, శ్రీకాకుళం జిల్లా ప‌లాస‌కు చెందిన ఎమ్మెల్యే కం మంత్రి సీదిరి అప్పల‌రాజు, కృష్ణాజిల్లా పామ‌ర్రు ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్ వంటివారు చాలా మంది ఊహించని స్పీడ్ తో వ్యవ‌హ‌రిస్తున్నార‌నే టాక్ జోరుగా వినిపిస్తోంది. వాస్తవానికి వీరు తొలిసారి అసెంబ్లీలో అడుగు పెట్టారు. పైగా రాజ‌కీయంగా పెద్ద నేప‌థ్యం ఏమీ లేదు. వివిధ వృత్తుల నుంచి వ‌చ్చి అనూహ్యంగా గ‌త ఏడాది టికెట్ సంపాయించుకుని విజ‌యం సాధించారు.

ఢీ అంటే ఢీ అనే లా…..

దీంతో అంద‌రూ కూడా గెలుపు గుర్రమైతే ఎక్కారు కానీ, స‌మ‌ర్థత ప్రశ్నార్థక‌మే అనుకున్నారు. కానీ, వీరు మాత్రం ప్రత్య‌ర్థుల‌కే కాకుండా సొంత పార్టీలోనూ ఆధిప‌త్య రాజ‌కీయాలుచేయ‌డంలో ఆరితేరారు. విడ‌ద‌ల ర‌జ‌నీ నియోజ‌క‌వ‌ర్గంలో గ‌ట్టి ప‌ట్టు పెంచుకుంటున్నారు. ప్రత్యర్థుల‌కు వాయిస్ లేకుండా ముందుకు సాగుతున్నారు. సొంత పార్టీలోనూ ప‌ట్టు పెంచుకున్నారు. ఇక, డాక్టర్ శ్రీదేవి.. ఢీ అంటే ఢీ అనే టైపులో రాజ‌కీయాలు చేస్తున్నారు. నిన్న మొన్నటి వ‌ర‌కు ఆమె డాక్టర్‌. సౌమ్యురాలు అనుకున్నారు. కానీ, రాజ‌కీయ అవ‌తారం ఎత్తాక పూర్తిగా మారి పోయి మాస్ నాయ‌కురాలిగా మారిపోయారు. ఎవ‌రితోనైనా మాట్లాడి.. నోరు మూయించే రేంజ్‌లో రాజ‌కీయాలు చేస్తున్నారు.

కొత్త ఎమ్మెల్యేలు అన్పించకుండా…

ప‌ల‌మ‌నేరు ఎమ్మెల్యే వెంక‌టే గౌడ కూడా త‌న రేంజ్‌లో తాను దూసుకుపోతున్నారు. మొన్న ఆ మధ్య లాక్ డౌన్ నింబంధనలని ఉల్లఘించి మరీ ఓ వంతెన ప్రారంభోత్సవం చేశారు. దీంతో ఆయనని మీడియా ఏకీపారేసింది. లాక్ డౌన్ సమయంలో సామాజిక దూరం పాటించకుండా ఇలాంటి కార్యక్రమాలు ఏంటని, పలు మీడియా ఛానళ్ళు వెంకటే గౌడపై విమర్శలు చేశాయి. ఈ విమర్శలపై ఆయన కూడా ఘాటుగానే స్పందించారు. అదేవిధంగా పామ‌ర్రు ఎమ్మెల్యే అనిల్ కూడా త‌న‌దైన శైలిలో దూసుకుపోతున్నారు. ఎవ‌రినీ లెక్కచేయ‌డం లేదు. కొత్తక‌దా? అనే మాట కూడా వినిపించ‌కుండా, క‌నిపించ‌కుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

ఇక అప్పలరాజు సంగతి సరేసరి…..

ఇక ఎమ్మెల్యేగా గెలిచిన యేడాదికే మంత్రి అయిన డాక్టర్ సీదిరి అప్పల‌రాజు ప‌రిస్థితి కూడా ఇంతే. ఆయ‌న కూడా తొలిసారి విజ‌యం సాదించారు. అయితే.. ఎప్పుడు ఎలా ఎక్కడ ఎలా మాట్లాడాలో అక్క‌డ అలా మాట్లాడుతూ.. ప్రత్య‌ర్థుల‌కు చుక్కలు చూపిస్తున్నారు. అభివృద్ది కార్యక్రమాల్లోనూ దూసుకుపోతున్నారు. ఇదీ.. కొత్త ఎమ్మెల్యేల కంచు స్టోరీ..!

Tags:    

Similar News