టెన్షన్ నుంచి బయటపడినట్లేనా?

దాదాపు పది నెలల నుంచి టెన్షన్. బయటకు వెళ్లాలంటే భయం. మాస్క్ లేకుండా తిరగాలంటే బెరుకు. ఇదీ అందరి పరిస్థితి. కొంచెం జలుబు చేసినా కోవిడ్ వచ్చిందేమోనన్న [more]

Update: 2020-12-16 18:29 GMT

దాదాపు పది నెలల నుంచి టెన్షన్. బయటకు వెళ్లాలంటే భయం. మాస్క్ లేకుండా తిరగాలంటే బెరుకు. ఇదీ అందరి పరిస్థితి. కొంచెం జలుబు చేసినా కోవిడ్ వచ్చిందేమోనన్న అనుమానం. ఏమాత్రం నలతగా ఉన్నా టెస్ట్ లు చేయించుకుంటేనే బెటరేమోనన్న ఆలోచన. ఇదీ భారతీయులు పది నెలలుగా పడుతున్న టెన్షన్. అయితే ఈ టెన్షన్ కు తెరపడనుంది. భారత్ లోనూ కోవిడ్ టీకా రానుంది. ఈ నెల 25వ తేదీ నుంచి కోవిడ్ టీకాను పంపిణీ చేయనున్నారు.

వణికించి చంపింది….

చైనా నుంచి వచ్చిన వైరస్ భారత్ ను వణికించింది. దాదాపు రెండు నెలలు లాక్ డౌన్ లోనే ఉన్నారు. ఉపాధి అవకాశాలు దెబ్బతిన్నాయి. వలస కార్మికులు వేలాది కిలోమీటర్లు కాలినడకనే తమ స్వస్థలాలకు బయలుదేరి వెళ్లాల్సి వచ్చింది. పెళ్లిళ్లు బంద్. ఇలా భారత్ మొత్తం కోవిడ్ దెబ్బకు కుదేలైపోయింది. దేశ వ్యాప్తంగా దాదాపు కోటి మందికి పైగానే కోవిడ్ బారిన పడ్డారు. లక్షా యాభైవేల మంది మృతి చెందారు.

ఇతర దేశాలతో పోలిస్తే….

అయితే భౌతిక దూరం పాటిస్తూ, మాస్క్ లు ధరిస్తూ కొంత కోవిడ్ ను కంట్రోల్ చేయగలిగారు. ప్రపంచంలోని ఇతర దేశాలతో పోలిస్తే భారత్ లో కేసుల సంఖ్య అంత ప్రమాదకరంగా పెరగకపోవడం విశేషం. 130 కోట్ల జనాభా ఉన్న భారత్ కోవిడ్ నుంచి కోలుకోవడం కష్టమేనని అందరూ అంచనాలు వేశారు. అయితే అందరి అంచనాలను తలకిందులు చేస్తూ కోవిడ్ ను దేశంలో కంట్రోల్ చేయగలిగారు. దీనికి ప్రభుత్వాల పనితీరుతో పాటు ప్రజల సహకారం కూడా తోడయింది. అయితే కోవిడ్ బారిన పడి ఎందరో ప్రాణాలు కోల్పోయారు. ప్రముఖులూ మరణించారు.

వ్యాక్సిన్ పంపిణీకి….

ఇక ఈనెల 25వ తేదీ నుంచి కోవిడ్ వ్యాక్సిన్ అందుబాటులోకి రానుంది. ప్రధాని నరేంద్ర మోదీ ఆరోజున వ్యాక్సిన్ పంపిణీని లాంఛనంగా ప్రారంభిస్తారని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ స్పష్టం చేసింది. తొలుత కోవిడ్ సేవలందించిన వైద్యసిబ్బందికి వ్యాక్సిన్ ను అందజేయనున్నారు. అన్ని రాష్ట్రాలకు కోవిడ్ వ్యాక్సిన్ ను పంపేందుకు కేంద్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. వ్యాక్సిన్ ను నిల్వ ఉంచుకునేందుకు రాష్ట్రాలు కూడా ఏర్పాట్లు పూర్తి చేశాయి. తొలి దశలో మూడుకోట్ల కరోనా వ్యాక్సిన్ ను అందజేసేందుకు అంతా సిద్ధమయింది.

Tags:    

Similar News