“మిస్” అయినోళ్లు ముంచేస్తారా..?

కర్ణాటక లో సంకీర్ణ సర్కార్ గుంభనంగా ఉంది. మంత్రి వర్గ విస్తరణ తర్వాత తలెత్తిన అసమ్మతి ఏ రూపం దాల్చుతుందోనన్న టెన్షన్ వారిని వెంటాడుతూనే ఉంది. ముఖ్యమంత్రి [more]

Update: 2019-01-01 16:30 GMT

కర్ణాటక లో సంకీర్ణ సర్కార్ గుంభనంగా ఉంది. మంత్రి వర్గ విస్తరణ తర్వాత తలెత్తిన అసమ్మతి ఏ రూపం దాల్చుతుందోనన్న టెన్షన్ వారిని వెంటాడుతూనే ఉంది. ముఖ్యమంత్రి కుమారస్వామి, మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్యలు ఎప్పటికప్పుడు కాంగ్రెస్ ఎమ్మెల్యేల అడుగులు ఎటువైపు పడనున్నాయన్న దానిపై ఆరాతీస్తూనే ఉన్నారు. మంత్రి వర్గ విస్తరణ తర్వాత సుమారు ఆరుగురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ అగ్రనేతలకు అందుబాటులో లేకుండా పోవడం కలవర పరస్తోంది. బెళగావి, బళ్లారి జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు టచ్ లో లేకుండా పోవడం చూస్తుంటే ఇబ్బందికర పరిస్థితులు తప్పవన్న సంకేతాలు అందుతున్నాయి.

ఆరుగురు ఎమ్మెల్యేల జాడేదీ?

మాజీ మంత్రి రమేష్ జార్ఖిహోళి మంత్రివర్గ విస్తరణ తర్వాత కన్పించకుండా పోయారు. ఆయన ముంబయిలో ఉన్నట్లు సమాచారం. అలాగే బళ్లారికి రూరల్ ఎమ్మెల్యే నాగేంద్ర, హోస్ పేట్ ఎమ్మెల్యే ఆనంద్ సింగ్, కంప్లి ఎమ్మెల్యే గణేష్ లతో పాటు మరికొందరు మంత్రి వర్గ విస్తరణ అనంతరం టచ్ లో లేరు. వారితో ఫోన్ లో మాట్లాడాలని కాంగ్రెస్ నేతలు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. వీరంతా మంత్రి పదవులను ఆశించన వారే. వీరు బీజేపీకి దగ్గరవుతున్నారన్న వార్తలు వస్తున్నాయి. వీరితో పాటు మరి కొంత మంది కూడా ఉన్నట్లు కాంగ్రెస్ నేతలు అనుమానిస్తున్నారు.

కమలం సమాలోచనలు…

కర్ణాటక రాజకీయాలపై ఇటీవల ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా యడ్యూరప్పతో చర్చించారు. పరిస్థితులకు అనుగుణంగా తమకు అనుకూలంగా మార్చుకోవాలన్న వ్యూహంలో కమలం పార్టీ ఉంది. యడ్యూరప్ప ఢిల్లీ పర్యటన తర్వాత చేసిన వ్యాఖ్యలు కూడా ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. తాము ప్రభుత్వం ఏర్పాటు చేస్తే ప్రధాన ప్రతిపక్ష హోదా కాంగ్రెస్ కు దక్కుతుందని యడ్డీ చేసిన వ్యాఖ్యలతో కాంగ్రెస్ నేతలు అప్రమత్తమయ్యారు.

కాంగ్రెస్ లో టెన్షన్…..

బళ్లారి కాంగ్రెస్ ఎమ్మెల్యేలను అక్కడి బీజేపీ నేత శ్రీరాములు తరలించారన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. బెళగావి నేత, మాజీ మంత్రి రమేష్ జార్ఖిహోళి బీజేపీలో ఖచ్చితంగా చేరే అవకాశాలున్నాయి. ఆయన వెంట ఎంతమంది ఉన్నారన్నదే ఇప్పుడు కాంగ్రెస్ నేతలను టెన్షన్ పెడుతోంది. బీజేపీ అంత సాహసానికి ఒడిగడితే దేశ వ్యాప్తంగా ఆందోళనలు చేయాలన్న ఉద్దేశ్యంతో కర్ణాటక కాంగ్రెస్ నేతలు ఉన్నారు. ఇలా కర్ణాటక సంకీర్ణ సర్కార్ వ్యవహారం దినదినగడంగా మారిందనే చెప్పాలి. మరికొద్దిరోజుల్లోనే కుమారస్వామి భవితవ్యం తేలనుంది.

Tags:    

Similar News