భారం వారిపైనేనా…!!

టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబునాయుడు ఎన్నో ఆశ‌లు పెట్టుకున్న జిల్లా ప్రకాశం. ఇక్కడ అనేక కార్యక్రమాలు చేశారు. అధికారంలో ఉండ‌గా వెలిగొండ ప్రాజెక్టు స‌హా దొన‌కొండ‌లో [more]

Update: 2019-07-05 03:30 GMT

టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబునాయుడు ఎన్నో ఆశ‌లు పెట్టుకున్న జిల్లా ప్రకాశం. ఇక్కడ అనేక కార్యక్రమాలు చేశారు. అధికారంలో ఉండ‌గా వెలిగొండ ప్రాజెక్టు స‌హా దొన‌కొండ‌లో పారిశ్రామిక హ‌బ్‌, ప్రతిష్టాత్మక విద్యాసంస్థల‌కు ఆయ‌న ప్రయత్నాలు చేశారు. అదే స‌మ‌యంలో జిల్లాలో క్లీన్ స్వీప్ చేసేందుకు ఆయ‌న చేయ‌ని ప్రయత్నం లేదు. ముఖ్యంగా జిల్లాలోని కీల‌క నాయ‌కులకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు. కోరిన‌న్ని ప‌నులూ చేసి పెట్టారు. అయిన‌ప్పటికీ.. తాజా ఎన్నిక‌ల్లో జ‌గ‌న్ సునామీ ముందు టీడీపీ చిగురుటాకులా ఒణికి పోయింది. మొత్తం ఈ జిల్లాలోని సీట్లలో కేవ‌లం నాలుగు స్థానాల్లోనే పార్టీ విజ‌యం సాధించింది.

నలుగురే గెలవడంతో….

అద్దంకి, చీరాల‌, కొండ‌పి, ప‌రుచూరు నియోజ‌క‌వ‌ర్గాల్లో మాత్రమే టీడీపీ గ‌ట్టెక్కింది. కొన్ని చోట్ల చాలా తీవ్రమైన ఫైట్ ఎదుర్కొంది. అయిన‌ప్పటికీ.. ఈ నాలుగు స్థానాల్లోనూ విజ‌యం ద‌క్కించుకుంది. మ‌రీ ముఖ్యంగా జిల్లా అధ్యక్షుడుగా ఉన్న ఒంగోలు మాజీ ఎమ్మెల్యే దామ‌చ‌ర్ల జ‌నార్దన్ కూడా ఓట‌మిపాల‌య్యారు. గ‌త ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న శిద్ధా రాఘవ‌రావు ఒంగోలు ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. దీంతో ఇప్పుడు పార్టీని తిరిగి ప‌ట్టాలెక్కించ‌డం నాయ‌కుల ముందున్న ప్రధాన ల‌క్ష్యం. అయితే వీరు ఏమేర‌కు పార్టీని గ‌ట్టెక్కిస్తార‌న్న అనుమానం చంద్రబాబునాయుడులోనూ ఉంది.

ఆయనకు అప్పగించకుంటే….?

టీడీపీ ఓడిన నియోజ‌క‌వ‌ర్గాల్లో చాలా ఘోరంగా ఓడిపోయింది. శిద్ధా ఎంపీగా 2 ల‌క్షల పైచిలుకు ఓట్ల భారీ తేడాతో ఓడిపోయారు. ద‌ర్శి, క‌నిగిరి, మార్కాపురంలో టీడీపీ అభ్యర్థులు 30 వేల పైచిలుకు ఓట్ల మెజార్టీతో ఓడితే గిద్దలూరులో వైసీపీ అభ్యర్థికి ఏకంగా 81 వేల మెజార్టీ రావ‌డం అంటే సామాన్యమైన విష‌యం కాదు. ఇక టీడీపీ నుంచి గెలిచిన వారిలో చీరాల ఎమ్మెల్యే క‌ర‌ణం బ‌ల‌రాంకి, అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటికి మ‌ధ్య ఘ‌ర్షణ‌లు ఇప్పటికీ చ‌ల్లార‌లేదు. దీంతో తాను పార్టీ మారితేనే మంచిద‌నే ధోర‌ణిలో క‌ర‌ణం ఉన్నట్టుగా స్థానిక నాయ‌కులు చెప్పుకొంటున్నారు. దీనిపై చంద్రబాబునాయుడు నేతలతో మాట్లాడే అవకాశముంది.

అంతర్మధనంలో గొట్టిపాటి…..

ఇక‌, ఇదే స‌మ‌యంలో గొట్టిపాటి కూడా తాను పార్టీ మారి త‌ప్పు చేశాన‌నే ధోర‌ణిలో ఆలోచిస్తున్నారు. వైసీపీలో నుంచి టీడీపీ లోకి మార‌డం ద్వారా తాను సాధించింది ఏమీ లేద‌ని ఆయ‌న త‌న అనుచ‌రుల వ‌ద్ద చెప్పుకొంటున్నారు. ఏ మాత్రం అవ కాశం ఉన్నా మ‌ళ్లీ వైసీపీలోకి వెళ్తార‌నే ప్రచారం జ‌రుగుతోంది. ఇక‌, ప‌రుచూరు నుంచి గెలిచిన సాంబ‌శివ‌రావు కార‌ణాలు తెలియ‌క‌పోయినా.. మౌనం పాటిస్తున్నారు. ఇక‌, కొండ‌పి నుంచి గెలిచిన డోలా బాల వీరాంజ‌నేయ స్వామి కూడా అచేతనంగానే ఉండిపోయారు. ఇక జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ఉన్న జ‌నార్థన్‌కు ఇప్పటికే బీజేపీ నుంచి ఆఫ‌ర్లు ఉన్నాయి. ఉప రాష్ట్రప‌తి వెంక‌య్యనాయుడు ఆయ‌న‌కు స‌మీప బంధువు కావ‌డంతో ఆయ‌న ఎప్పుడైనా ఎలాంటి నిర్ణయం అయినా తీసుకుంటార‌ని అంటున్నారు. ఇక క‌నిగిరిలో ఓడిపోయిన క‌దిరి బాబూరావు బీజేపీ వైపు చూస్తున్నట్టు కూడా టాక్ వ‌చ్చింది. ఈ నేప‌థ్యంలో రాబోయే స్థానిక సంస్థల‌ ఎన్నిక‌ల నాటికి పార్టీ ప‌రిస్థితి ఏంట‌నే విష‌యం చ‌ర్చకు వ‌స్తోంది. మ‌రి చంద్రబాబునాయుడు ఈ ప‌రిస్థితిని ఎలా డీల్ చేస్తారో ? ప్రకాశంలో ఐదేళ్ల పాటు పార్టీ ఎలా పోరాటాలు చేసి మ‌ళ్లీ ప్రజ‌ల్లో ప‌ట్టు సాధిస్తుందో ? చూడాలి.

Tags:    

Similar News