టీడీపీ స్టార్ట్ చేసేసింది !!

ఎన్నికలు ఇంకా రాలేదు కానీ విశాఖ జిల్లాలో అధికార తెలుగుదేశం పార్టీ అందరి కంటే ముందుగానే ఎన్నికల ప్రచారాన్ని మొదలుపెట్టేసింది. ఆ పార్టీకి అధికారంలో ఉండడం ఒక [more]

Update: 2019-01-17 11:00 GMT

ఎన్నికలు ఇంకా రాలేదు కానీ విశాఖ జిల్లాలో అధికార తెలుగుదేశం పార్టీ అందరి కంటే ముందుగానే ఎన్నికల ప్రచారాన్ని మొదలుపెట్టేసింది. ఆ పార్టీకి అధికారంలో ఉండడం ఒక విధంగా కలసివస్తోంది. తాజాగా చంద్రబాబు సామాజిక పించన్లు రెట్టింపు చేయడాన్ని ఇపుడు ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. ఇది నిజంగా చంద్రబాబు వృద్ధులకు, పేదలకు ఇచ్చిన కానుక అని వారు చెప్పుకుంటూ టీడీపీ పట్ల సానుకూల వాతావరణాన్ని జనంలో తీసుకువస్తున్నారు. ప్రతీ గ్రామంలోని వార్డు నుంచి ఇపుడు ఇదే ఆయుధంగా చేసుకుని తెలుగుదేశం చేసిన మేలు గురించి జనంలో చర్చకు పెడుతున్నారు

పాలాభిషేకాలు…..

ఇక ఎక్కడికక్కడ చంద్రబాబు చిత్ర పటాలకు పాలాభిషేకాలు చేయైంచడం విశేషం. అది కూడా పించన్ల ప్రయోజనం పొందుతున్న వృద్ధులనే ముందుంచి చేయించడం ద్వారా ఆ లబ్దిదారులకు చంద్రబాబు చేసినదేంటో చెప్పకనే చెబుతున్నారు. ప్రతి ఇంటికి పెద్ద కొడుకుగా చంద్రబాబు ఉన్నారని, ఆయనకు పేదల కష్టం బాగా తెలుసని, అందువల్లనే ఎవరూ కోరకుండానే పింఛన్లు రెట్టింపు చేసి ప్రతి పేదింట్లో కొత్త సంక్రాంతి తెచ్చారని టీడీపీ నాయకులు చెబుతున్నారు. నిజానికి ఈ ప్రచారానికి మంచి స్పందన కూడా లభిస్తోంది.

పింఛన్ల ప్రభావం….

అయిదేళ్ళ క్రితానికి ఇపుడు బాగా పరిస్థితి మారింది. ప్రజల జీవన ప్రమాణాలు కూడా మారాయి. అపుడు వేయి రూపాయలు ఇస్తే బాగా ఉండేది. ఇపుడు ఎటూ చాలని స్థితి. సరిగ్గా అదను చూసి బాబు పెంచిన పించన్ల వల్ల ఇపుడు టీడీపీకి వజ్రాయుధమైపోయిందని చెప్పాలి. పల్లే, పట్నం అన్న తేడా లేకుండా పించను సదుపాయం పొందుతున్న ప్రతి ఒక్కరూ ఇపుడు బాబు నిర్ణయం పట్ల సానుకూలంగా స్పందించడమే కాదు తమను ఆదుకున్న ప్రభుత్వానికి ధన్యవాదాలు చెపుతున్నారంటే పించన్ల ప్రభావం ఏ స్థాయిలో ఉందో అర్ధం చేసుకోవాలి.

ఫెయిల్ అయిన వైసీపీ….

నిజానికి పించన్లను రెట్టింపు చేస్తామని మొదట ప్రకటించినది వైసీపీ. ఆ పార్టీ ప్లీనరీలో ఈ అంశాన్ని గట్టిగా ప్రస్తావించారు. ఆ తరువాత జగన్ పాదయాత్ర సమయంలో కూడా ప్రతీ చోటా చెబుతూ వచ్చారు. అటువంటిది పింఛన్ల పెరుగుదల తమ ఆలోచనేనని వైసీపీ నేతలు ఎక్కడా చెప్పుకోలేకపోవడం కూడా టీడీపీ ప్రచారానికి అనుకూలిస్తోంది. నిజానికి విశాఖ జిల్లాలో వైసీపీ నేతల పనితీరు చాలా అసంతృప్తిగా ఉంది. వారు జనంలోకి పోవడం అన్నది పెద్దగా ఉండదు.

దాన్ని ఆయుధంగా చేసుకుని…..

అదే టైంలో టీడీపీ నేతలు మంత్రుల నుంచి బూత్ కమిటీ వరకూ జనంలోనే ఉంటూ ప్రతీ విషయాన్ని జనాలకు చేరవేయడమే కాకుండా దాని వల్ల పార్టీకి మైలేజ్ తీసుకు వస్తున్నారు. పించన్ల విషయంలో అర్బన్ రూరల్ టీడీపీ అధ్యక్షులిద్దరూ జనంలోనే ఉంటూ విస్త్రుతంగా అవగాహన కల్పించారు. దీన్ని బట్టి చూసుకుంటే వచ్చే ఎన్నికల్లో పించన్లే టీడీపీకి పెద్ద ఆయుధంగా మారుతాయని అంటున్నారు. విశాఖ జిల్లాలో అసలే టీడీపీ బలంగా ఉంది. దానికి ఇపుడు కొత్త ఆయుధం సమకూరింది. త్వరలో మరిన్ని వరాలు కూడా ఉంటాయని టీడీపీ నాయకులు చెబుతున్నారు కూడా.

Tags:    

Similar News