ఇక మిగిలింది అదొక్కటే

ప్రస్తుత పార్లమెంట్ సమావేశాలను కేవలం మూడు రాజధానులకు నిరసన కోసమే టీడీపీ ఎంపి లు పూర్తిగా వినియోగించారు. కేంద్రం జోక్యంతో జగన్ నిర్ణయానికి బ్రేక్ పడుతుందన్న వారి [more]

Update: 2020-02-13 00:30 GMT

ప్రస్తుత పార్లమెంట్ సమావేశాలను కేవలం మూడు రాజధానులకు నిరసన కోసమే టీడీపీ ఎంపి లు పూర్తిగా వినియోగించారు. కేంద్రం జోక్యంతో జగన్ నిర్ణయానికి బ్రేక్ పడుతుందన్న వారి ఆశలకు బిజెపి సర్కార్ నీళ్ళు పోసేసింది. సమావేశాలు మొదలు అయినవెంటనే గల్లాజయదేవ్ లిఖితపూర్వక సమాధానాలు ఆశిస్తూ సంధించిన ప్రశ్నకు తాజాగా కేశినేని నాని అడిగిన ప్రశ్నకు కేంద్రం ఒకే తీరులో బదులిచ్చి సందిగ్దతకు తెరదించేసింది. రాజధాని అంశం రాష్ట్ర పరిధిలోనిది అంటూ తమ చేతుల్లో ఏమి లేదని మరోసారి చెప్పేసింది. దాంతో ఇప్పుడు టిడిపి లో నైరాశ్యం నెలకొంది.

ఇక అక్కడే అడ్డుకోవాలి ….

అత్యున్నత చట్టసభ అయిన పార్లమెంట్ లో టిడిపి కి చుక్కెదురు కావడంతో ఇక తమ ఆశలు అన్ని న్యాయస్థానం పైనే పెట్టుకున్నట్లు తెలుస్తుంది. దీనికోసం రైతులతో ప్రతి అంశంపై కోర్టు కేసులు ఇబ్బడి ముబ్బడిగా దాఖలు చేసే ప్రక్రియను వేగవంతం చేసే ప్రక్రియ ఊపందుకుంది. అమరావతి పై రైతులు వేసే కేసులను ఎదుర్కొనేందుకు ముకుల్ రోహిత్గిని ఎపి సర్కార్ నియమించింది. దీనికోసం ఆయనకు ఐదు కోట్ల రూపాయలను ఎలా చెల్లిస్తారంటూ కూడా రైతులు కోర్టుకి ఎక్కారు.

న్యాయపరంగానే….

అలాగే తమకు ప్రభుత్వం ఇస్తున్న శిస్తును పెంచుతూ ఆదేశాలు ఇవ్వాలంటూ కొన్ని కేసులు దాఖలు అవుతున్నాయి. ఇలా ప్రతి పాయింట్ ను లా పాయింట్ గా మార్చుకుంటూ అడ్డుకోవాలన్నదే చివరి ఆశగా ప్రస్తుతం టిడిపి పెట్టుకుంది. న్యాయపరంగానే ఇక అన్ని అంశాలను ఎదుర్కొనాలని టీడీపీ నిర్ణయించింది. ఇందుకు అవసరమైన నిధులను కూడా సమీకరించాలని భావిస్తుంది. న్యాయపరంగానే జగన్ ను అడ్డుకోగలమని, కేంద్రం సహకరించదని టీడీపీ దాదాపుగా నిర్ణయానికి వచ్చేసింది. దీన్ని జగన్ సర్కార్ ఎలా ఎదుర్కొంటుందో చూడాలి.

Tags:    

Similar News