బలమున్న చోట నాయకత్వం ఎక్కడ?

విశాఖ జిల్లాలో తెలుగుదేశం పార్టీకి పట్టున్న నియోజకవర్గాలు చాలానే ఉన్నాయి. అందులో రూరల్ జిల్లాలో ఎలమంచిలి ఒకటి. ఇక్కడ తెలుగుదేశం ఆవిర్ఘావం తరువాత కాంగ్రెస్ గెలిచింది బహు [more]

Update: 2020-12-31 00:30 GMT

విశాఖ జిల్లాలో తెలుగుదేశం పార్టీకి పట్టున్న నియోజకవర్గాలు చాలానే ఉన్నాయి. అందులో రూరల్ జిల్లాలో ఎలమంచిలి ఒకటి. ఇక్కడ తెలుగుదేశం ఆవిర్ఘావం తరువాత కాంగ్రెస్ గెలిచింది బహు తక్కువ. ఇక్కడ మెజారిటీ ప్రజలు ఎపుడూ సైకిల్ పార్టీకే పట్టం కడుతూ వచ్చారు. జగన్ వేవ్ లో 2019 ఎన్నికల్లో కన్నబాబు రాజు ఎమ్మెల్యేగా గెలిచారు కానీ లేకపోతే ఈ సీటు కచ్చితంగా తెలుగుదేశం ఖాతాలోనిదేనని అంతా అంటారు. ఎక్కడ నుంచో విశాఖకు వలస వచ్చిన పంచకర్ల రమేష్ బాబుని చివరి నిముషంలో ఇక్కడ పోటీకి పెడితే బంపర్ మెజారిటీతో గెలిచారు. అదీ ఎలమంచిలిలో తెలుగుదేశం చరిత్ర.

నడిపించే వారేరీ….?

ఎలమంచిలిలో తెలుగుదేశం పార్టీకి ఇప్పటికీ పెద్ద ఎత్తున క్యాడర్ ఉంది. పార్టీ కోసం పనిచేస్తామంటూ అభిమానించే వారు ఉన్నారు. కానీ వారిని నడిపించే నాయకుడు మాత్రం లేదు. దాదాపుగా ఏడాది క్రితం మాజీ ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు తెలుగుదేశం పార్టీని వీడి వైసీపీలో చేరిపోయారు. ఆయన పార్టీని వీడుతూ చంద్రబాబు మీద పరుష పదజాలంతోనే విమర్శలు చేశారు. లోకేష్ మీద బాణాలు ఎక్కుపెట్టారు. అయినా ఖండిచేవారే లేరంటే అదీ నాయకత్వ దుస్థితి అని చెప్పాలి. ఇక ఆనాటి నుంచి ఇక్కడ తెలుగుదేశం ఇంచార్జి ఎవరూ లేరు. పెద్ద దిక్కు అంతకంటే లేకుండా పోయారు.

అంతా సైకిల్ దిగేశారు…..

పంచకర్ల రమేష్ బాబు కంటే ముందు విశాఖ డైరీ చైర్మన్, తెలుగుదేశం పార్టీకి ఆది నుంచి పెద్ద దిక్కు అయిన ఆడారి తులసీరావు కుటుంబ సభ్యులంతా కట్టకట్టుకుని సైకిల్ దిగిపోయారు. వైసీపీలో చేరిపోయారు. తులసీరావు కుమారుడు ఆనంద్ 2019 ఎన్నికల్లో అనకాపల్లి నుంచి టీడీపీ ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. ఆ వెంటనే ఆయన జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు. ఇక 2013 ఎన్నికల్లొ తెలుగుదేశం తరఫున ఎలమంచిలి మునిసిపాలిటీ చైర్ పర్సన్ గా గెలిచిన ఆడారి కుమార్తె రమాకుమారి సైతం వైసీపీలో చేరిపోయారు. వీరికి ఎలమంచిలిలో మంచి పట్టుంది. గెలుపు ఓటములను శాసించే బలమైన నేపధ్యం ఉంది. దాంతో వీరు వెళ్లిపోవడంతో డల్ అయిన తెలుగుదేశం పార్టీకి దెబ్బ కొడుతూ రమేష్ బాబు కూడా రాజీనామా చేశారు.

కొత్తవారేనా …?

ఇక 2018 కి ముందే మరో బలమైన నాయకుడు ,తెలుగుదేశం లీడర్ సుందరపు విజయకుమార్ పార్టీని వదిలి జనసేనలోకి వెళ్ళిపోయారు. ఆయన 2019 ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు. ఇలా టీడీపీలో బలమైన నాయకులు అంతా చెల్లాచెదురు కావడంతో ఎలమంచిలిలో పసుపు రాజకీయం ఎటూ కాకుండా పోయింది. ఇన్ని నెలలు గడచినా కూడా ఇంచార్జిని నియమించి పార్టీని పటిష్టం చేసేందుకు బాబు గట్టిగా యత్నించడంలేదు అన్న విమర్శలు ఉన్నాయి. జెడ్పీ చైర్ పర్సన్ లాలం భవానీ, ఆమె భర్త తెలుగుదేశం లీడర్ భాస్కరరావు మాత్రమే ఉన్నంతలో పార్టీకి నాయకత్వం వహిస్తున్నారు. మరి బాబు కొత్తవారికి చాన్స్ ఇస్తారా లేక బయటకు వెళ్ళిన వారి మీద ఆశలు పెట్టుకుని ఖాళీగా ఉంచేశారా అన్నది చూడాల్సి ఉంది

Tags:    

Similar News