ఏలూరు టీడీపీ కేండిడేట్‌గా ఆ బాబు కాదట… ఈ బాబట

ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లా ఏలూరు పార్లమెంటు నియోజ‌క‌వ‌ర్గానికి సంబంధించి టీడీపీ ఈక్వేష‌న్లు మారుతున్నాయి. వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి ఇక్కడ టీడీపీ అభ్యర్థిగా కొత్త నేత పేరు వినిపిస్తోంది. పైగా.. [more]

Update: 2021-09-14 12:30 GMT

ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లా ఏలూరు పార్లమెంటు నియోజ‌క‌వ‌ర్గానికి సంబంధించి టీడీపీ ఈక్వేష‌న్లు మారుతున్నాయి. వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి ఇక్కడ టీడీపీ అభ్యర్థిగా కొత్త నేత పేరు వినిపిస్తోంది. పైగా.. ఈయ‌న గతంలో వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి.. త‌ర్వాత‌.. ఆయ‌న కుమారుడు, ప్రస్తుత ముఖ్యమంత్రి జ‌గ‌న్‌కు కూడా స‌న్నిహితంగా మెలిగిన నాయ‌కుడిగా గుర్తింపు పొందారు. ఆయ‌నే కొఠారు దొర‌బాబు. చింత‌ల‌పూడి నియోజ‌క‌వ‌ర్గం జంగారెడ్డి గూడెం మండ‌లం.. ల‌క్కవ‌రం గ్రామానికి చెందిన దొర‌బాబు..ప్ర‌స్తుతం టీడీపీలో చింత‌ల‌పూడి.. పోల‌వరం ప‌రిశీల‌కులుగా ఉన్నారు. అయితే..ఆయ‌న‌కు త్వర‌లోనే ఏలూరు పార్లమెంటు ప‌గ్గాల‌ను అప్పగిస్తార‌నే ప్రచారం జోరుగా సాగుతోంది.

మాగంటి చేతుల్లోనే…?

ఏలూరు పార్లమెంటు నియోజ‌క‌వ‌ర్గం.. నిన్న మొన్నటి వ‌ర‌కు దాదాపు పాతికేళ్లుగా .. మాజీ ఎంపీ మాగంటి వేంక‌టేశ్వర‌రావు ఉర‌ఫ్ బాబు క‌నుస‌న్నల్లోనే ఉంద‌నేది అంద‌రికీ తెలిసిందే. 1996 నుంచి ఆయ‌న ఇక్కడ రాజ‌కీయాల‌ను శాసిస్తున్నార‌నే వాద‌న ఉంది. 1996, 1998, 1999 ఎన్నిక‌ల్లో ఆయ‌న కాంగ్రెస్ త‌ర‌ఫున పోటీ చేశారు. ఈ క్రమంలో 1998లో మాత్రమే ఆయ‌న విజ‌యం ద‌క్కించుకున్నారు. ఆ త‌ర్వాత‌.. 2004లో దెందులూరు అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గం నుంచి పోటీ చేసి.. విజ‌యం సాధించి.. వైఎస్ మంత్రి వ‌ర్గంలో కేబినెట్ బెర్త్‌ను సంపాయించుకున్నారు. ఆ త‌ర్వాత‌.. వైఎస్‌తో త‌లెత్తిన విభేదాల కార‌ణంగా.. ఆయ‌న టీడీపీలోకి చేరిపోయారు.

ప్రత్యక్ష్య రాజకీయాలకు….

ఈ క్రమంలోనే 2009లో టీడీపీ నుంచి ఏలూరు ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. 2014లో మ‌ళ్లీ ఇక్కడ నుంచే పోటీ చేసిన బాబు.. ల‌క్ష ఓట్ల మెజాటీతో గెలిచారు. ఇక‌, గ‌త 2019 ఎన్నిక‌ల్లో జ‌గ‌న్ సునామీలో ల‌క్షా 60 వేల ఓట్ల తేడాతో ప‌రాజ‌యం పాల‌య్యారు. అయితే.. అప్పటికే ఆయ‌న అనారోగ్యంతో ఇబ్బందులు ప‌డ‌డం తెలిసిందే. ఇక‌, ఇటీవ‌ల ఆయ‌న ఇద్దరు కుమారులు ఒక‌రి త‌ర్వాత‌.. ఒక‌రుగా మృత్యువాత ప‌డ‌డంతో ఇక‌, ప్రత్య‌క్ష రాజ‌కీయాల‌కు దాదాపు దూరంగా ఉంటున్నారు. ఈ నేప‌థ్యంలోనే ఏలూరులో టీడీపీకి కీల‌క‌మైన అభ్యర్థి అవ‌సరం ఏర్పడింది.

వైఎస్ కు సన్నిహితుడిగా….

దీంతో ఇదే జిల్లాకు చెందిన దొర‌బాబుకు అవ‌కాశం ఇస్తార‌ని.. టీడీపీ వ‌ర్గాల్లో చ‌ర్చ సాగుతోంది. 2019 ఎన్నిక‌ల‌కుముందు వ‌ర‌కు ఆయ‌న వైజాగ్‌లో సెటిల్ అయ్యారు. అక్కడే వైజాగ్ డిప్యూటీ మేయ‌ర్‌గా ప‌నిచేశారు. దివంగ‌త సీఎం వైఎస్‌కు స‌న్నిహితుడిగా పేరు తెచ్చుకున్నారు. 2004, 2009 ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ విజ‌యం సాధించిన త‌ర్వాత‌.. వైఎస్ ఎప్పుడు విశాఖ వ‌చ్చినా.. ఆయ‌న కార్యక్రమాల‌ను దొర‌బాబు ద‌గ్గరుండి చూసుకునేవారు. త‌ర్వాత‌ వైసీపీలో ఉన్నప్పుడు కూడా జ‌గ‌న్‌కు స‌న్నిహితంగా ఉన్నారనే పేరు తెచ్చుకున్నారు. 2014లో టీడీపీ గెలిచాక మ‌ళ్లీ ఆయ‌న చంద్రబాబుకు దగ్గర‌య్యారు.

బాబుకు సన్నిహితుడిగా…

ప్రస్తుతం త‌న సొంత జిల్లా ప‌శ్చిమ గోదావ‌రిలోనే ఉంటూ.. చింత‌ల‌పూడి, పోల‌వ‌రం నియోజ‌క‌వ‌ర్గాల ప‌రిశీల‌కుడిగా టీడీపీ బాధ్యత‌లు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో బాబుకు కూడా.. స‌న్నిహితంగా ఉంటున్నారు. అధికారంలో ఉన్నప్పుడు కూడా చంద్రబాబు వైజాగ్ వెళ్లిన ప్రతిసారీ.. దొర‌బాబే అన్నీ అయి వ్యవ‌హించేవారు. దీంతో చంద్రబాబుకు కూడా ఆయ‌న స‌న్నిహితుల‌నే పేరు తెచ్చుకున్నారు. ఆర్థికంగా బ‌లంగా ఉన్న నాయ‌కుడిగా ఆయ‌న‌కు గుర్తింపు ఉంది. సామాజిక స‌మీక‌ర‌ణ‌లు ఎలాగూ ఆయ‌న‌కు ప్లస్ కానున్నాయి. ఈ క్రమంలోనే ఏలూరు పార్లమెంటు అభ్యర్థిగా చంద్రబాబు దొర‌బాబుకే మొగ్గు చూపుతున్నార‌నిపార్టీలో చ‌ర్చ సాగుతుండ‌డం గ‌మ‌నార్హం.

Tags:    

Similar News