అక్కడ టీడీపీకి సినిమా చూపిస్తారా ?

నీతులు ఎపుడూ ఎదుటివారికి చెప్పేందుకే అంటారు. తాము అసలు పాటించాల్సిన అవసరమే లేదు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నపుడు ఏకంగా 23 మంది వైసీపీ ఎమ్మెల్యేలను తన పార్టీలోకి [more]

Update: 2020-12-02 03:30 GMT

నీతులు ఎపుడూ ఎదుటివారికి చెప్పేందుకే అంటారు. తాము అసలు పాటించాల్సిన అవసరమే లేదు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నపుడు ఏకంగా 23 మంది వైసీపీ ఎమ్మెల్యేలను తన పార్టీలోకి కండువాలు కప్పి మరీ లాగేశారు. వారిలో ఒక్కరి నుంచి కూడా ఆనాడు రాజీనామాలు చేయించలేదు. ఎన్నికలకు వెళ్ళలేదు. ఇక ఇపుడు టీడీపీ నుంచి నలుగురు ఎమ్మెల్యేలు జై జగన్ అంటూ సైకిల్ దిగిపోయారు. అయితే వారి కుటుంబ సభ్యులే ఫ్యాన్ నీడకు వచ్చారు తప్ప వారు మాత్రం మెడలో ఆ పార్టీ కండువాలు వేసుకోలేదు. ఇప్పటికీ వారు టెక్నికల్ గా టీడీపీ ఎమ్మెల్యేలుగానే ఉన్నారు.

రాజీనామా డిమాండ్ …

విశాఖ సౌత్ నుంచి రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి అర్బన్ జిల్లా టీడీపీ ప్రెసిడెంట్ గా మూడు సార్లు బాధ్యతలు నిర్వహించిన నేత వాసుపల్లి గణేష్ కుమార్. ఆయన ఈ మధ్యనే జగన్ వైపు తిరిగారు. తన ఇద్దరి కుమారులను పార్టీలోకి చేర్పించి తాను మద్దతు ఇచ్చారు. తాజాగా టీడీపీ నేతలు వాసుపల్లి మీద రంకెలు వేస్తున్నారు. ఆయన తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. వాసుపల్లికి ఆ పదవి చంద్రబాబు ఇచ్చారుట. టీడీపీ టికెట్ మీద గెలిచి జగన్ కి జై ఎలా కొడతారు అంటూ తమ్ముళ్ళు ధర్మపన్నాలు వల్లిస్తున్నారు.

అంత సీన్ ఉందా…?

నిజంగా విశాఖ సౌత్ లో ఒకే ఒక్కడుగా వాసుపల్లి నిలిచి గెలుస్తున్నారు. ఆయనే ఒక పార్టీగా ఉన్నారు. ఆయనకు పార్టీని మించి చరిష్మా ఉందని అనుచరులు అంటారు. టీడీపీకి బ్యాక్ బోన్ గా ఉంటూ సిటీలో అనేక కార్యక్రమాలను తన సొంత ఖర్చు తో నిర్వహించిన వాసుపల్లి సైకిల్ దిగిపోగానే సౌత్ లోనే కాదు విశాఖ సిటీలోనూ టీడీపీ సౌండ్ ఇపుడు ఎక్కడా వినిపించడంలేదు ఇక సౌత్ లో ఆయన వెన్నంటి ఉన్న నాయకులు అంతా ఇపుడు వైసీపీలో ఉన్నారు. క్యాడర్ లేక లీడరూ లేక సౌత్ లో కనీసం పార్టీ పదవులు కూడా టీడీపీ అధినాయకత్వం ఎవరికీ ఇవ్వలేకపోయింది. అలాంటిది వాసుపల్లి రాజీనామా చేస్తే తిరిగి పోటీ చేసి గెలిచేటంత సీన్ టీడీపీకి ఉందా అని వాసుపల్లి అనుచరులు అంటున్నారు.

రెడీయేనా…?

వాసుపల్లి వైసీపీకి మద్దతు ఇచ్చేటపుడే క్లారిటీగా చెప్పేశారు. తాను జగన్ రాజీనామా చేయమంటే చేసి తిరిగి పోటీ చేసి నెగ్గుతాను అని కూడా అన్నారు. అంతే కాదు తన మీద స్పీకర్ కి టీడీపీ ఫిర్యాదు చేసి డిస్ క్వాలిఫై కూడా చేయించుకోవచ్చు అని సవాల్ చేశారు. మరి రాజ్యాంగబద్ధంగా ఆ పని టీడీపీ ఇప్పటిదాకా చేయనే లేదు. ఒక్క గన్నవరం ఎమ్మెల్యే వంశీ విషయంలో తప్ప స్పీకర్ కి మిగిలిన ముగ్గురు టీడీపీ ఎమ్మెల్యేల మీద చంద్రబాబు ఫిర్యాదు చేసిందే లేదు. దానికి కారణం ఆ పార్టీ పెద్దలకే తెలియాలి. ఫిర్యాదు చేస్తే స్పీకర్ వారిని డిస్ క్వాలిఫై చేస్తీ వెంటనే ఉప‌ ఎన్నికలు వస్తాయి. ఆ ఉప ఎన్నికల్లో పోటీ చేసి గెలవలేమన్న భయంతోనే టీడీపీ అధినాయకత్వం అలా చేయలేదని వైసీపీ నేతలు విమర్శిస్తున్నారు. మరి ఫిర్యాదు చేయడానికే ధైర్యం లేని నేతలు వాసుపల్లిని రాజీనామా చేయమనడం ఎందుకు అని ప్రశ్నిస్తున్నారు. మొత్తానికి వాసుపల్లి రాజీనామా కనుక నిజంగా చేస్తే అసలైన సినిమా టీడీపీకి చూపిస్తారని కూడా అంటున్నారు.

Tags:    

Similar News