ఆ నలుగురిలో మిగిలేది ఒక్కరేనట.. ఆందోళనలో అధినేత

విశాఖ అర్బన్ జిల్లాలో టీడీపీ గెలుచుకునంది నాలుగు సీట్లు. కళ్ళు చెదిరే విజయం అది నగరానికి నాలుగు దిక్కులూ సైకిల్ పార్టీ కాసేసి వైసీపీ జోరుని నిలువరించింది. [more]

Update: 2020-05-31 06:30 GMT

విశాఖ అర్బన్ జిల్లాలో టీడీపీ గెలుచుకునంది నాలుగు సీట్లు. కళ్ళు చెదిరే విజయం అది నగరానికి నాలుగు దిక్కులూ సైకిల్ పార్టీ కాసేసి వైసీపీ జోరుని నిలువరించింది. నిజానికి వైసీపీకి ఉత్తరాంధ్ర మొత్తం దాసోహం అయింది. అయినా కూడా ఈ నాలుగు సీట్లు టీడీపీ గెలుచుకోవడం, అందునా విశాఖ వంటి మెగా సిటీలో అధికార పార్టీని నిలువరించడం అంటే మాటలు కాదు. ఇక ఓటమి పాలయి ఇపుడు టీడీపీకి ఏడాది అయింది. ఇపుడు విశాఖలో పార్టీ పరిస్థితి ఏంటి అంటే గెలిచిన నలుగురిలోనూ సఖ్యత లేదు. పార్టీని ఏడాదిగా వదిలేశారు. ఇంకా నాలుగేళ్లకాలం మిగిలి ఉంది. మరి ఈ టీడీపీ ఎమ్మెల్యేలు ఏం చేస్తారన్నది ఇపుడు పెద్ద చర్చగా ఉంది.

జంపింగులేనా…?

విశాఖ జిల్లాలో ఉన్న నలుగురు ఎమ్మెల్యేలలో ముగ్గురు ఎమ్మెల్యేలు పార్టీ గీత దాటుతారని తెగ ప్రచారం సాగుతోంది. ఆపరేషన్ ఆకర్ష్ కి వైసీపీ తెర తీసిన వేళ విశాఖ నుంచి గంటా పేరు మళ్ళీ గట్టిగా వినిపిస్తోంది. ఆయన బాటలో మరో ఇద్దరు ఎమ్మెల్యేలు నడుస్తారని కూడా అంటున్నారు. వారు విశాఖ పశ్చిమ ఎమ్మెల్యే గణబాబు, దక్షిణ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ అంటున్నారు. మొత్తం ఏడుగురు ఎమ్మెల్యేలు వైసీపీకి మద్దతుగా సైకిల్ దిగిపోతారని అంటున్నారు. అందులో విశాఖలోనే ముగ్గురి పేర్లు ఉండడం విశేషం.

వాసన వచ్చిందా…?

ఇక గంటా పార్టీ మారుతారని వాసన మీడియా కంటే ముందే మంత్రి అవంతి శ్రీనివాస్ కి వచ్చిందా అన్న డౌట్లు వస్తున్నాయి. చాన్నాళ్ల తరువాత ఆయన మళ్లీ గంటాను టార్గెట్ చేశారు. గంటాను రాజకీయ వ్యాపారి అనేశారు. ఆయన కర్చీఫ్ వదిలేసినంత సులువుగా పార్టీ మారుస్తారని కూడా హాట్ కామెంట్స్ చేశారు. మరి ఇదే కనుక నిజం అయితే గంటా వైసీపీలోకి వచ్చేస్తున్నట్లే లెక్క. ఇక ఈ మధ్యనే జగన్ని ఎల్జీ పాలిమర్స్ ఘటనలో సహాయ కార్యక్రమాల విషయంలో బాగా సర్కార్ పనిచేసిందని కితాబు ఇచ్చిన గణబాబు మీద కూడా అనుమానాలు ఉన్నాయి. వాసుపల్లికి ఇప్పటికే టీడీపీ మూడుసార్లు టికెట్ ఇచ్చేసింది. మరో సారి ఇస్తుందని గ్యారంటీ లేదు, ఇచ్చిన గెలుపు ఎలా ఉంటుందో తెలియదు, దాంతో ఆయన కూడా భవిష్యత్తు గురించి గట్టిగానే ఆలోచన చేస్తున్నారని అంటున్నారు.

వీరాభిమానేనా…?

బాలయ్య వీరాభిమానిగా ఉన్న విశాఖ తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు మాత్రం టీడీపీని వీడకపోవచ్చునని అంటున్నారు. ఆయన తెలుగుదేశానికి కట్టుబడిపోతారని అంటున్నారు. పైగా ఆయనతో రాయబేరాలు చేసినా కూడా టీడీపీ పట్ల ఉన్న కమిట్మెంట్ పరంగా ఆయన ఇప్పటికైతే రాలేరని కూడా అంటున్నారు. ఇక ఆయనకు వైసీపీలో కూడా మిత్రులు ఉన్నారు. ఏకంగా విజయన‌గరం జిలా మంత్రి బొత్స సత్యనారాయణతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. అలాగే ఆయన అవసరం కూడా విశాఖ తూర్పులో వైసీపీకి ఉంది. కానీ పార్టీ మీద, అంతకంటే ముందు నందమూరి కుటుంబం పట్ల ఉన్న ప్రేమతో ఆయన ఒక్కరే విశాఖ టీడీపీలో మిగిలిపోతారని అంటున్నారు. చూడాలి ఇది రాజకీయం, ఎపుడేం జరుగుతుందో ఎవరికీ తెలియదు.

Tags:    

Similar News