ఎమ్మెల్యే రేసులో టీడీపీ కీల‌క నేత‌.. బాబుకు లేఖ..!

వ‌చ్చే 2024 ఎన్నిక‌ల‌కు సంబంధించి టీడీపీ నేత‌లు.. అప్పుడే టికెట్ల కోసం క‌ర్చీఫ్‌లు ప‌రుచుకుంటున్న ప‌రిస్థితి క‌నిపిస్తోంది. నిజానికి చాలా నియోజ‌క‌వ‌ర్గాల్లో పార్టీకి నాయ‌కులు లేరు. పార్టీకి [more]

Update: 2021-07-22 00:30 GMT

వ‌చ్చే 2024 ఎన్నిక‌ల‌కు సంబంధించి టీడీపీ నేత‌లు.. అప్పుడే టికెట్ల కోసం క‌ర్చీఫ్‌లు ప‌రుచుకుంటున్న ప‌రిస్థితి క‌నిపిస్తోంది. నిజానికి చాలా నియోజ‌క‌వ‌ర్గాల్లో పార్టీకి నాయ‌కులు లేరు. పార్టీకి ఇన్‌చార్జ్‌లు లేని నియోజ‌క‌వ‌ర్గాల్లో చంద్ర‌బాబు ఇప్పుడిప్పుడే ఎవ‌రో ఒక నేత‌ను సెట్ చేసుకుంటూ వ‌స్తున్నారు. ఎవ‌రో ఒక‌రిని డ‌బ్బున్న నేత‌ను చూసి.. ఈ మూడేళ్లు నియోజ‌క‌వ‌ర్గంలో పార్టీని పోషించండి.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో టిక్కెట్ మీదే అని చెపుతున్నారు. కానీ, కొన్ని చోట్ల మాత్రం ఒక నియోజ‌క‌వ‌ర్గానికి ఇద్ద‌రు చొప్పున నాయ‌కులు రంగంలోకి దిగుతున్నారు. ఈ ప‌రిస్థితి పార్టీని ఇబ్బందుల్లోకి నెడుతోంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ఇలాంటి ఘ‌ట‌నే ఒకటి విజ‌య‌వాడ‌లో చోటు చేసుకుంది. బెజ‌వాడ‌లో ఇటీవ‌ల కాలంలో టీడీపీ త‌ర‌ఫున గ‌ట్టి వాయిస్ వినిపిస్తున్న యువ నాయ‌కుడు కొమ్మారెడ్డి ప‌ట్టాభి రాం.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో టికెట్ ఆశిస్తున్నారు.

అధికార ప్రతినిధిగా…..

ప్ర‌స్తుతం పార్టీ అధికార ప్ర‌తినిధిగా ఉన్న ప‌ట్టాభి.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో త‌న‌కు తూర్పు నియోజ‌క‌వ‌ర్గం కేటాయించాల‌ని.. అధినేత చంద్ర‌బాబును కొన్నాళ్లుగా కోరుతున్న మాట వాస్త‌వ‌మే. అయితే.. దీనిపై చంద్ర‌బాబు ఏమీ చెప్ప‌లేని ప‌రిస్థితి నెల‌కొంది. ఎందుకంటే.. తూర్పు నియోజ‌క‌వ‌ర్గం నుంచి వ‌రుస విజ‌యాలు ద‌క్కించుకున్న గ‌ద్దె రామ్మోహ‌న్ ఉన్నారు. అయితే.. ఆయ‌న పార్టీ వాయిస్ వినిపించడంలో వెనుక‌బ‌డుతున్నారు.కానీ, బాబుకు కావాల్సిన నేత‌గా ఆయ‌న గుర్తింపు పొందారు. అదేస‌మ‌యంలో ప్ర‌భుత్వంపై మాత్రం ఆయ‌న కామెంట్లు చేయ‌డం లేదు. ఇదిలావుంటే.. కొమ్మారెడ్డి పట్టాభి మాత్రం ప్ర‌భుత్వంపై తీవ్ర విమ‌ర్శ‌లు చేయ‌డంతోపాటు.. ఆరోప‌ణ‌ల‌తో విరుచుకుప‌డుతున్నారు.

బలమైన వాయిస్ గా….

విజ‌య‌వాడ‌లో మాట్లాడుతున్న నాయ‌కుడు ఎవ‌రైనా ఉంటే.. ప‌ట్టాభి పేరు మాత్ర‌మే ముందు వినిపిస్తోంది. ఇక వైసీపీ వాళ్లు సైతం ప‌ట్టాభి విమ‌ర్శ‌ల‌ను త‌ట్టుకోలేక ఆయ‌న ఇంటి ద‌గ్గ‌ర్లోనే ఆయ‌న‌పై దాడి చేసిన‌ట్టు ఆరోప‌ణ‌లు కూడా వ‌చ్చాయి. ప‌ట్టాభి ఇప్పుడు మీడియాలో పార్టీకి బ‌ల‌మైన వాయిస్‌గా ఉన్నారు. ఈ నేప‌థ్యంలోనే త‌న‌కు వచ్చే ఎన్నిక‌ల్లో టికెట్ ఇస్తే.. అసెంబ్లీలో గ‌ట్టి గ‌ళం వినిపిస్తాన‌ని.. పార్టీని బ‌లోపేతం చేస్తాన‌ని కూడా ప‌ట్టిభి పేర్కొంటున్నారు. తాజాగా ఇదే విష‌యంపైఆయ‌న చంద్ర‌బాబు లేఖ కూడా రాసిన‌ట్టు ప‌ట్టాభి వ‌ర్గం ప్ర‌చారం చేస్తోంది. కానీ, గ‌ద్దెను కాద‌ని.. ప‌ట్టాభికి ఇస్తారా ? ఆర్థికంగా బ‌లంగా ఉన్న గ‌ద్దెను ప‌క్క‌న పెడ‌తారా ? అన్న‌ది డౌటే.

లేఖలు రాస్తూ….?

ఆ మాట‌కు వ‌స్తే గ‌త ఎన్నిక‌ల‌కు ముందే అప్ప‌టి విజ‌య‌వాడ మేయ‌ర్ కోనేరు శ్రీథ‌ర్ సైతం గ‌ద్దెను టార్గెట్ చేస్తూ త‌న‌కు తూర్పు టిక్కెట్ కావాల‌ని బాబును ప‌దే ప‌దే క‌లిసేవారు. ఇక విజ‌య‌వాడ ఎంపీ కేశినేని నానితో విబేధిస్తోన్న బుద్ధా వెంక‌న్న‌, బొండా ఉమా త‌దిత‌రులు టీడీపీ లో యువ‌నేత‌లుగా ఉన్న వారిని మాకూ ఎంపీ టిక్కెట్ కావాల‌ని బాబుకు లేఖ‌లు రాయిస్తూ ఎగ‌దోస్తోన్న ప‌రిస్థితి ఉంది. ఇది పార్టీ స‌ర్వనాశ‌నానికే అని స్థానిక కేడ‌ర్ గ‌గ్గోలు పెడుతోంది.

Tags:    

Similar News