వైసీపీ స్కూల్ స్టార్ట్ చేసిందంటే?

టిడిపి నుంచి బయటకు పోయే వారందరికి యువనేత నారా లోకేష్ బాగా లోకువగా దొరికిన ట్లున్నారు. పార్టీకి గుడ్ బై కొట్టేందుకు ఎవరి కారణాలు వారికున్నా చినబాబు [more]

Update: 2019-12-29 09:30 GMT

టిడిపి నుంచి బయటకు పోయే వారందరికి యువనేత నారా లోకేష్ బాగా లోకువగా దొరికిన ట్లున్నారు. పార్టీకి గుడ్ బై కొట్టేందుకు ఎవరి కారణాలు వారికున్నా చినబాబు పై తలో రాయి విసిరి పెదబాబు మనసు బాధ పెట్టి మరీ జంప్ అవుతున్నారు. ఈ పరిణామం అధినేత చంద్రబాబు ను మరింత కలవరపెడుతుంది. ఎన్నికల ముందు తరువాత కూడా తెలుగుదేశం వీడిన తమ్ముళ్ళు తమపై లోకేష్ పెత్తనం అధికం కావడం వల్లే కష్టమైన ఇష్టమైన పార్టీని వీడిపోతున్నామని వేదనతో మీడియాకు చెప్పి వెళ్లేవారు. తాజాగా ఇటీవల గన్నవరం ఎమ్యెల్యే వల్లభనేని వంశీ అయితే ఒక రేంజ్ లో చినబాబు పై తన ఆగ్రహాన్ని వ్యక్తం చేసి రెండు వారాలపాటు ఏకంగా వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే.

మరో నేత ఇదే మాట ….

ఇటీవలే జగన్ ఎపి లో మూడు రాజధానుల ఏర్పాటు అవసరమని అసెంబ్లీలో ప్రకటించారు. దీనిపై రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర దుమారమే మొదలైంది. పార్టీలకు అతీతంగా ప్రాంతాల వారీగా నేతలు తమ గొంతు వినిపించాలిసిన పరిస్థితి ఏర్పడింది. అవిభాజ్య ఆంధ్రప్రదేశ్ ను గతంలో కేంద్రం విడతీసినప్పుడు ప్రాంతాల వారీగా నేతలు గొంతెత్తి తమ ప్రాంత అభివృధ్ధికోసం మాట్లాడారు. తాజాగా విశాఖ టిడిపి లో జగన్ రేపిన చిచ్చు సునామీ గా టిడిపిని ముంచేలా మారింది. ఆ పార్టీ నేతలు ఇప్పటికే మాజీ మంత్రి విశాఖ ఎమ్యెల్యే గంటా శ్రీనివాసరావు నేతృత్వంలో జగన్ నిర్ణయానికి జై కొట్టేశారు. మరో మాజీ ఎమ్యెల్యే రెహమాన్ ఒక అడుగు ముందుకు వేసి టిడిపి కి రాజీనామా చేసి మరింత ఘాటైన విమర్శలు చేశారు. యువనేత లోకేష్ నాయకత్వం చేపట్టాకా టిడిపి లో పరిస్థితికి మారిపోయిందంటూ చినబాబు నాయకత్వం పై విమర్శలు గుప్పించి గుడ్ బై కొట్టేశారు.

ఉత్తరాంధ్రా దెబ్బకొట్టేలాగే ఉందే …?

ఉత్తరాంధ్ర లో ఇప్పుడు టిడిపి కి గడ్డుకాలమే ఎదురయ్యేలా వుంది. అమరావతి కేంద్రంగా అభివృద్ధి కేంద్రీకృతం చేసేందుకు టిడిపి అధినేత ఒక ప్రణాళిక సిద్ధం చేసి అమల్లో ఉండగా అధికారం కోల్పోయారు. కొత్తగా వచ్చిన వైసిపి సర్కార్ బాబు ప్లాన్ పూర్తిగా మార్చేసింది. దాంతో దీనిపై టిడిపి తనను నమ్మి భూములు ఇచ్చిన రైతుల కోసం ఉద్యమించక తప్పని పరిస్థితి ఏర్పడింది. అలా చేయడం వల్ల ఏపీలోని ఉత్తరాంధ్ర, రాయలసీమ వాసులకు దూరం జరగక తప్పని వాతావరణం ఏర్పడింది.

వలసలను ఆపాలంటే?

ఈ నేపథ్యంలోనే ఉత్తరాంధ్ర లో వున్న టీడీపీ నేతలు వైసిపి గూటి వైపు చూస్తున్నారు. వీరిలో ఎమ్యెల్యేలే కాదు ద్వితీయశ్రేణి టీం కూడా నెమ్మది నెమ్మదిగా అధికారపార్టీ నీడలోనే తమ అభివృద్ధి ఉందని అభిప్రాయపడుతున్నట్లు తెలుస్తుంది. కీలకమైన ఉత్తరాంధ్రా నేతలంతా సైకిల్ దిగిపోకుండా చేయాలంటే ఏం చేయాలన్నదానిపై ఇప్పుడు పసుపు పార్టీ లో తీవ్ర చర్చ మొదలైనట్లు తెలుస్తుంది. విశాఖ లో జగన్ పాగా వేయకుండానే పరిస్థితి ఇలా ఉంటే ఇక పూర్తిగా అక్కడ వైసిపి స్కూల్ స్టార్ట్ చేశాక ఎలా ఉంటుందన్న ఆందోళన సైకిల్ పార్టీలో పెరిగిపోతుంది. దీనికి బాబు మార్క్ స్కెచ్ ఎలా వుండబోతుందో చూడాలి.

Tags:    

Similar News