టీడీపీలో ఆ నేత‌ రాజ‌కీయం.. యూట‌ర్న్ తీసుకుంటుందా..?

తెలంగాణ టీడీపీలో సంచ‌ల‌నం చోటు చేసుకుంది. ప్రస్తుత పార్టీ అధ్యక్షుడు ఎల్. ర‌మ‌ణ‌కు వ్యతిరేకంగా కొంద‌రు చ‌క్రం తిప్పుతున్నార‌ని, ఆయ‌న‌ను పార్టీ ప‌ద‌వి నుంచి దింపేసేందుకు వ్యూహాత్మకంగా [more]

Update: 2020-09-28 14:30 GMT

తెలంగాణ టీడీపీలో సంచ‌ల‌నం చోటు చేసుకుంది. ప్రస్తుత పార్టీ అధ్యక్షుడు ఎల్. ర‌మ‌ణ‌కు వ్యతిరేకంగా కొంద‌రు చ‌క్రం తిప్పుతున్నార‌ని, ఆయ‌న‌ను పార్టీ ప‌ద‌వి నుంచి దింపేసేందుకు వ్యూహాత్మకంగా వ్యవ‌హ‌రిస్తున్నార‌ని రాజ‌కీయంగా చ‌ర్చ జ‌రుగుతోంది. ఎల్‌.ర‌మ‌ణ రాష్ట్ర విభ‌జ‌న త‌ర్వాత‌.. తెలంగాణ టీడీపీకి అధ్యక్షుడిగా ఎంపిక‌య్యారు. ఇక‌, అప్పటి నుంచి ఆయ‌నే కొన‌సాగుతున్నారు. ఈ మ‌ధ్య కాలంలో అనేక ఎదురు దెబ్బలు త‌గిలాయి. పైగా రెండు ఎన్నిక‌లు వ‌చ్చాయి. ఒక స్థానిక స‌మ‌రం కూడా వ‌చ్చింది. 2014, 2018 రాష్ట్ర అసెంబ్లీ ఎన్నిక‌ల్లో టీడీపీ ఆశించిన విధంగా దూసుకుపోయింది లేదు. 2018 అసెంబ్లీ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకుని పోటీ చేసిన టీడీపీ కేవ‌లం స‌త్తుప‌ల్లి, అశ్వారావుపేట సీట్ల‌తో మాత్రమే స‌రిపెట్టుకుంది. ఇందులో స‌త్తుప‌ల్లి ఎమ్మెల్యే పార్టీ మారిపోగా ప్రస్తుతం పార్టీకి ఒక్క అశ్వారావుపేట ఎమ్మెల్యే మచ్చా నాగేశ్వర‌రావు మాత్రమే ఉన్నారు.

సమర్థవంతమైన నేత కాదని…..

ఇక గ‌త అసెంబ్లీ ఎన్నిక‌ల్లో పార్టీ అధ్యక్షుడి హోదాలో ఉండి కూడా ఆయ‌న పోటీ చేయ‌క‌పోవ‌డం విమ‌ర్శల‌కు తావివ్వడం ఒక‌టి అయితే.. ఆయ‌న‌పై టిక్కెట్లు అమ్ముకున్నార‌న్న ఆరోప‌ణ‌లు కూడా సొంత పార్టీ నేత‌ల నుంచే వ‌చ్చాయి. రాజేంద్రన‌గ‌ర్ లాంటి చోట్ల ఆయ‌న పార్టీలో ఎవ‌రికి తెలియ‌ని వారికి సీట్లు ఇచ్చార‌న్న విమ‌ర్శలు ఉన్నాయి. ఇక గ‌తేడాది లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో పార్టీ పోటీ చేయ‌కుండా దూరంగా ఉంది. పైగా.. పార్టీలో చంద్రబాబు నాయ‌క‌త్వంపై పెల్లువ‌బికిన విమ‌ర్శల‌ను కూడా ఎల్. ర‌మ‌ణ స‌మ‌ర్ధవంతంగా అరిక‌ట్టే ప్రయ‌త్నం చేయ‌లేక‌పోయారు.

నేతలు వెళ్లిపోతున్నా…..

ఇక‌, పార్టీ నుంచి నేత‌లు జారిపోతున్నా.. ఎక్కడిక‌క్కడ గ్రూపులు క‌ట్టి.. పార్టీని భ్రష్టు ప‌ట్టిస్తున్నా.. చంద్రబాబు ఎల్‌.ర‌మ‌ణ‌పై చ‌ర్యలు తీసుకోలేదు. అయితే, వాస్తవానికి టీడీపీలో పార్టీ అధ్యక్ష ప‌ద‌వి రెండేళ్లే. ప్రతిసారీ రెన్యువ‌ల్ అవుతుంది. ర‌మ‌ణ ఏడేళ్లుగా పార్టీ అధ్యక్షుడిగా ఉంటున్నారు. ఎప్పుడూ ర‌మ‌ణేనా.. త‌మ‌కు మాత్రం అవ‌కాశం ఇవ్వరా? అనే నేత‌లు తెలంగాణ టీడీపీలో చాలా మంది ఉన్నారు. ఇలాంటి వారిలో రావుల చంద్రశేఖ‌ర్ రెడ్డి కీల‌క‌మైన నాయ‌కుడు. చంద్రబాబు అంత్యంత స‌న్నిహితుడైన ఆయ‌న తెలంగాణ టీడీపీ అధ్యక్ష రేసులో ఉన్నారు. ఈ విష‌యంపై చంద్రబాబుతోనూ రావుల గ‌తంలో చ‌ర్చలు జ‌రిపారు. అయితే, ఇప్పటి వ‌ర‌కు ర‌మ‌ణ విష‌యంలో బాబు చ‌ర్యలు తీసుకోలేదు.

సొంత పార్టీ నేతలే…..

ఈ క్రమంలో తాజాగా లేఖాస్త్రం సంధించార‌నే ప్రచారం జ‌రుగుతోంది. తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్ రమణను మార్చాలంటూ చంద్రబాబుకు సొంతపార్టీ నేతలు లేఖ రాయ‌డం సంచ‌ల‌నంగా మారింది. కొంతమంది సీనియర్ నాయకులతో పాటు పార్టీ పార్లమెంటరీ అధ్యక్షులు అంద‌రూ కూడా ఆ లేఖపై సంతకం పెట్టినట్లు తెలియవచ్చింది. ఏడేళ్లుగా రాష్ట్రంలో టీడీపీ పరిస్థితి దిగజారిపోతోందని, అధ్యక్ష మార్పుతోపాటు పార్టీని ప్రక్షాళన చేయాల్సిన అవసరం కూడా ఉందని ఆ లేఖలో పేర్కొన్నారు. అయితే, ఈ లేఖ వెనుక రావుల చంద్రశేఖ‌ర్ ఉన్నార‌నే ప్రచారం జోరుగా సాగుతుండ‌డం గ‌మ‌నార్హం. మ‌రి ఇది ఎలాంటి మ‌లుపు తిరుగుతుందో ? చూడాలి.

Tags:    

Similar News