అక్కడ టీడీపీకి ఆ ఇద్దరే ఆశా కిర‌ణాలు

ప్రకాశం జిల్లాలో టీడీపీకి బ‌ల‌మైన నాయ‌కులు ఉన్నారు. మంచి వాక్చాతుర్యంతోపాటు.. దూకుడు ఉన్న నాయ‌కులు ఈ జిల్లాలో క‌నిపిస్తారు. అయితే.2019 ఎన్నిక‌ల్లో పార్టీ ఇక్క‌డ కేవ‌లం నాలుగు [more]

Update: 2021-01-18 13:30 GMT

ప్రకాశం జిల్లాలో టీడీపీకి బ‌ల‌మైన నాయ‌కులు ఉన్నారు. మంచి వాక్చాతుర్యంతోపాటు.. దూకుడు ఉన్న నాయ‌కులు ఈ జిల్లాలో క‌నిపిస్తారు. అయితే.2019 ఎన్నిక‌ల్లో పార్టీ ఇక్క‌డ కేవ‌లం నాలుగు స్థానాల్లోనే గెలుపు గుర్రం ఎక్కింది. రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ తునాతున‌క‌లు అయినా నాలుగు స్థానాల్లో విజ‌యం సాధించ‌డం అంటే గ్రేటే. ఈ న‌లుగురిలో చీరాల నుంచి గెలిచిన సీనియ‌ర్ నాయ‌కుడు.. క‌ర‌ణం బ‌ల‌రాం పార్టీ మారిపోయారు. వాస్తవానికి ఈయ‌న వ‌ల్ల పార్టీకి గ‌తంలోను, ఇప్పుడు కూడా ఎలాంటి ప్రయోజ‌నం లేకుండా పోయింది. ఇక పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మంత్రిగా ఉన్న శిద్ధా రాఘ‌వ‌రావు కుటుంబం కూడా ఫ్యాన్ కింద‌కు చేరిపోయింది. మిగిలిన వారిలో చాలా మంది మౌనంగా ఉంటున్నారు. అయితే.. ఓ ఇద్దరు కీల‌క నేత‌లు మాత్రం టీడీపీకి వెన్నుద‌న్నుగా నిలుస్తుండ‌డంతో పాటు పార్టీకి జిల్లాలో ఆశాకిర‌ణంగా, మార్గద‌ర్శకంగా నిలుస్తున్నారు.

వత్తిడులు తీవ్రంగా వచ్చినా….

ప్రకాశం జిల్లా ప‌రుచూరు నియోజ‌క‌వ‌ర్గం నుంచి జ‌గ‌న్ సునామీని త‌ట్టుకుని మ‌రీ విజ‌యం సాధించిన ఏలూరి సాంబ‌శివ‌రావు, అద్దంకి నియోజ‌క‌వ‌ర్గం నుంచి టీడీపీ త‌ర‌ఫున విజ‌యం సాధించిన గొట్టిపాటి ర‌వి కుమార్‌లు ( ఓట‌మి లేకుండా నాలుగోసారి) ఇద్దరూ కూడా పార్టీ సంక్లిష్ట ప‌రిస్థితుల్లో ఉన్నా దూసుకు పోతున్నారు. స‌హ‌జంగానే పార్టీ అధికారం కోల్పోయిన త‌ర్వాత‌.. అధికారంలో ఉన్న పార్టీ నుంచి ప్రతిప‌క్ష నేత‌పై ఒత్తిడి ఉంటుంది. ఈ క్రమంలోనే వైసీపీ నుంచి టీడీపీ నేత‌ల‌పై ఒత్తిళ్లు వ‌చ్చాయి. పార్టీలు మారిపోవాలంటూ.. తీవ్రంగా వేధింపులు కూడా ఎదుర‌య్యాయి. అయితే ఆ వేధింపులు త‌ట్టుకోలేని వారు.. పార్టీ మారిపోగా.. పార్టీకోసం ఎన్ని వేధింపులు వ‌చ్చినా ఎదుర్కొంటామ‌నే రీతిలో ఈ ఇద్దరు వ్య‌వ‌హ‌రించారు. ఏలూరి, గొట్టిపాటి పార్టీ మారిపోతున్నారంటూ అధికార పార్టీ ఎంత మైండ్ గేమ్ ప్రచారం చేసినా.. ఎన్ని ఇబ్బందులు పెట్టినా వీరు ఏ మాత్రం జంక‌లేదు.

పార్టీలో జోష్…..

ముఖ్యంగా బాప‌ట్ల పార్లమెంటు ప‌రిధిలోకి వ‌చ్చే తూర్పు ప్రకాశంలో ఏలూరి, గొట్టిపాటిలు పార్టీకి అండ‌గా ఉన్నారు. ఏలూరి ఏకంగా చంద్రబాబు తోడ‌ళ్లుడు ద‌గ్గుబాటి వెంక‌టేశ్వర‌రావును ఓడించ‌డంతో పాటు ఆయ‌న ప‌డుతోన్న క‌ష్టాన్ని ప్రత్యేకంగా గుర్తించారు. ఈ క్రమంలోనే ఆయ‌న‌కు బాప‌ట్ల పా ర్లమెంటు నియోజ‌క‌వ‌ర్గం ఇంచార్జ్ ప‌ద‌విని అప్పగించారు. దీంతో మ‌రింత‌గా ఏలూరి దూసుకుపోతున్నా రు. యువ నాయ‌కుడు కావ‌డం, టీడీపీలో అంద‌రినీ క‌లుపుకొని పోయే వ్యక్తిగా గుర్తింపు ఉండ‌డం, ఎలాంటి అవినీతి ఆరోప‌ణ‌లు లేక‌పోవ‌డం ఏలూరికి క‌లిసి వ‌స్తున్న ప్రధాన అంశం. ఏలూరి నిత్యం ప్రజ‌ల మ‌ధ్యే ఉంటున్నారు. ఏలూరి దూకుడు తూర్పు ప్రకాశం, గుంటూరు జిల్లాల్లో పార్టీలో మాంచి జోష్ ఇచ్చింది.

ఆర్థికంగా ఇబ్బందులు ఎదురయినా…?

ఇక‌, గొట్టిపాటి ర‌వి విష‌యానికి వ‌స్తే తిరుగులేని వ్యక్తిగ‌త ఇమేజ్ ఉంది. కాంగ్రెస్‌, వైసీపీ, టీడీపీ ఏ పార్టీ నుంచి పోటీ చేసినా ర‌విదే గెలుపు. వైసీపీ నుంచి గెలిచి టీడీపీలోకి వ‌చ్చిన 23 మంది ఎమ్మెల్యేల్లో గెలిచిన ఏకైక ఎమ్మెల్యేగా ర‌వికుమార్ చ‌రిత్ర క్రియేట్ చేశారు. పాత ప‌రిచ‌యాల నేప‌థ్యంలో వైసీపీ అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత పార్టీ మారిపోవాలంటూ.. ఒత్తిళ్లు వ‌చ్చాయి. వ్యాపారాల‌పై అధికారుల దాడులు పెరిగాయి, కేసులు న‌మోద‌య్యాయి. అయినా కూడా గొట్టిపాటి ఎక్కడా వాటికి లొంగిపోకుండా పార్టీలో దూసుకు పోతున్నారు. ఈ ఇద్దరు నేత‌లు నియోజ‌క‌వ‌ర్గాల్లో అధికార పార్టీని ఎదుర్కొని టీడీపీని నిల‌బెడుతున్నట్టే ఇత‌ర నేత‌లు కూడా క‌ష్టప‌డితే ప్రకాశంలో టీడీపీకి చాలా వ‌ర‌కు పున‌ర్వైభ‌వం వ‌చ్చిన‌ట్టే..!

Tags:    

Similar News