Tdp : నెల్లూరులో టీడీపీ లెక్కేంటి…? అదే జరుగుతుందనా?

నెల్లూరు కార్పొరేషన్ ఎన్నికలు త్వరలో జరగనున్నాయి. ఇక్కడ టీడీపీ పోటీకి సిద్ధమయింది. ఒంటరిగానే బరిలోకి దిగాలని తెలుగుదేశం పార్టీ నిర్ణయించింది. ఈ మేరకు అభ్యర్థుల ఎంపిక పై [more]

Update: 2021-11-02 05:00 GMT

నెల్లూరు కార్పొరేషన్ ఎన్నికలు త్వరలో జరగనున్నాయి. ఇక్కడ టీడీపీ పోటీకి సిద్ధమయింది. ఒంటరిగానే బరిలోకి దిగాలని తెలుగుదేశం పార్టీ నిర్ణయించింది. ఈ మేరకు అభ్యర్థుల ఎంపిక పై దృష్టి పెట్టింది. నెల్లూరు కార్పొరేషన్ ఎన్నికలు జరుగుతాయని ఎప్పటి నుంచో అందరికీ తెలుసు. అందుకే ముందుగానే టీడీపీ నేతలు కూడా మానసికంగా సిద్ధమయిపోయారు. ఇక్కడ వైసీపీకి పట్టున్నప్పటికీ గణనీయమైన స్థానాలను సాధించాలన్న లక్ష్యంతో టీడీపీ నేతలున్నారు.

ఇప్పటి వరకూ గెలవకపోయినా…?

నెల్లూరు నగర పరిధిలో ఉన్న రూరల్, టౌన్ అసెంబ్లీ నియోజకవర్గాల్లో టీడీపీ గెలిచింది లేకపోయినా, వైసీపీ నేతల్లో ఉన్న విభేదాలు తమకు అనుకూలంగా మారతాయని టీడీపీ అంచనా వేస్తుంది. టీడీపీకి అభ్యర్థుల కొరత కూడా ఏమీ లేదు. అనేక మంది టిక్కెట్ల కోసం క్యూ కడుతున్నారు. ఆర్థిక భారాన్ని తామే భరిస్తామని చెబుతూ ముందుకు వస్తుండటంతో టీడీపీ నేతలలో ఉత్సాహం అలుముకుంది.

సోమిరెడ్డి నేతృత్వంలో…

నెల్లూరు కార్పొరేషన్ ఎన్నికల బాధ్యతను మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పర్యవేక్షిస్తున్నారు. బీద రవిచంద్ర, అబ్దుల్ అజీజ్, కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి ఈ ఎన్నికపై దృష్టి పెట్టారు. అభ్యర్థుల ఎంపికను ప్రత్యర్థులను బట్టి చేయాలని టీడీపీ నిర్ణయించింది. మేయర్ అభ్యర్థిని కూడా ముందుగా ప్రకటించకుండా డివిజన్లలో ప్రచారాన్ని జోరుగా నిర్వహించాలని భావిస్తుంది. తమకు నెల్లూరు నగరంలో ఉన్న పట్టు ఏంటో ఈ ఎన్నిక ద్వారా నిరూపించాలనుకుంటోంది.

తమ హయాంలోనే..?

నెల్లూరు కార్పొరేషన్ లో అభివృద్ధి తమ హయాంలోనే జరిగిందని టీడీపీ చెబుతోంది. ఎన్నడూ లేని విధంగా అప్పటి మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ 1500 కోట్లు ఖర్చు చేసి అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, మంచినీటి సరఫరా వ్యవస్థను మెరుగుపర్చారన్న విషయాన్ని గుర్తు చేస్తుంది. జనసేన, బీజేపీలు కూడా ఈ ఎన్నికల్లో తలపడనున్నాయి. మొత్తం మీద స్థానిక సంస్థల ఎన్నికలను బహిష్కరించిన తర్వాత టీడీపీ తొలిసారి నెల్లూరు కార్పొరేషన్ ఎన్నికల్లో బరిలోకి దిగాలని నిర్ణయించింది.

Tags:    

Similar News