వీక్ పాయింట్‌లో టీడీపీ త‌మ్ముళ్ల కుమ్ములాట‌

నెల్లూరు టీడీపీలో చిత్రమైన ప‌రిస్థితి తెర‌మీదికి వ‌చ్చింది. ఇక్కడ నేత‌లు ఉన్నదే త‌క్కువ‌. వారిలోనూ ఆధిప‌త్య పోరు కొన్నాళ్లుగా సాగుతోంది. నువ్వు నాకు చెప్పేది ఏంటి ? [more]

Update: 2020-12-27 00:30 GMT

నెల్లూరు టీడీపీలో చిత్రమైన ప‌రిస్థితి తెర‌మీదికి వ‌చ్చింది. ఇక్కడ నేత‌లు ఉన్నదే త‌క్కువ‌. వారిలోనూ ఆధిప‌త్య పోరు కొన్నాళ్లుగా సాగుతోంది. నువ్వు నాకు చెప్పేది ఏంటి ? అని నేత‌లు ఒక‌రిపై ఒక‌రు గుస్సాగా ఉన్నారు. మ‌రికొంద‌రు.. ప్రజ‌ల్లో గెల‌వ‌డం చేత‌కాని వాళ్లు కూడా మాపై పెత్తనం చెలాయిస్తున్నారంటూ.. ఓ మాజీ మంత్రిని ఉద్దేశించి ఘాటుగా చేసిన వ్యాఖ్యలు.. అధినేత చంద్రబాబు వ‌ర‌క కూడా చేరాయి. దీంతో నెల్లూరులో టీడీపీ బ‌తికి బ‌ట్టక‌డుతుందా? అనేది సందేహంగా ఉంది. గ‌త ఏడాది ఎన్నిక‌ల్లో నెల్లూరు జిల్లాను వైసీపీ క్లీన్ స్వీప్ చేసేసింది. ఆ త‌ర్వాత కూడా బీద మ‌స్తాన్‌రావు లాంటి నేత‌లు వైసీపీలోకి వెళ్లిపోయారు.

ఎన్నికలకు ముందు వైసీపీలోకి…

దీనికితోడు.. బ‌ల‌మైన రెడ్డి సామాజిక వ‌ర్గానికి చెందిన ఇద్దరు నేత‌లు ఎన్నిక‌ల‌కు ముందు వైసీపీలోకి చేరిపోయారు. త‌ర్వాత బీసీ వ‌ర్గానికి చెందిన ప‌లువురు జిల్లా స్థాయి నేత‌లు కూడా వైసీపీ బాట ప‌ట్టారు. బీద పార్టీ మారిపోయాక ఆయ‌న‌ సోద‌రుడు ర‌విచంద్ర యాద‌వ్‌ ఉన్నా పార్టీలో కీల‌క ప‌ద‌విని క‌ట్టబెట్టినా.. ఎవ‌రితోనూ ఆయ‌న క‌లుపుకొని ముందుకు సాగ‌డం లేదు. ఇక‌, నెల్లూరు రూర‌ల్ నుంచి పోటీ చేసి ఓడిపోయిన మైనార్టీ వ‌ర్గానికి చెందిన అజీజ్ నెల్లూరు పార్లమెంట‌రీ పార్టీ అధ్యక్షుడు అయ్యాక అన్నీ తానే అయి వ్యవ‌హ‌రించ‌డం.. జిల్లాకు చెందిన నాయ‌కుల‌కు మింగుడు ప‌డ‌డం లేదు. పోనీ.. నేరుగా వ్యతిరేకిద్దామా ? అంటే.. అధినేత వ‌ద్ద మంచి మార్కులు ఉన్నాయి.

రెడ్డి సామాజికవర్గం…..

మ‌రోవైపు మాజీ మంత్రి, ఐదుసార్లు ఓడిపోయిన సోమిరెడ్డి చంద్రమోహ‌న్ రెడ్డి పార్టీని గాడిలో పెట్టే ప్రయ‌త్నం చేస్తున్నా ఆయ‌న మాట ఎవ‌రూ ప‌ట్టించుకోవ‌డం లేదు. జిల్లా టీడీపీలో రెడ్డి సామాజిక వ‌ర్గం ఆధిప‌త్యం త‌గ్గుతూ వ‌స్తోంది. బీసీ నేత‌గా ఉన్న ర‌విచంద్ర యాద‌వ్ త‌న సామాజిక వ‌ర్గంతో పాటు బీసీల‌ను ఎంక‌రేజ్ చేస్తుండ‌డంతో పార్టీలో అర‌కొరాగా ఉన్న రెడ్లకు న‌చ్చడం లేదు. దీనికి తోడు చంద్రబాబు మైనార్టీ వ‌ర్గానికి చెందిన అజీజ్‌కు పార్లమెంట‌రీ పార్టీ ప‌గ్గాలు ఇవ్వడంతో బీసీ, రెడ్లకు న‌చ్చని ప‌రిస్థితి.

వైసీపీకి లోపాయికారిగా…..

దీంతో టీడీపీ ప‌రిస్థితి నానాటికీ తీసిక‌ట్టుగా ఉంద‌నే ప్రచారం జ‌రుగుతోంది. చిత్రమైన ప‌రిస్థితి ఏంటంటే రెడ్డి సామాజిక వ‌ర్గానికి చెందిన అతి స్వల్ప సంఖ్యలో ఉన్న టీడీపీ నేత‌లు వైసీపీకి లోపాయికారీగా స‌హ‌క‌రిస్తూ త‌మ ప‌నులు చేయించుకుంటున్నారు. దీంతో టీడీపీ జెండా ఎక్కడా క‌నిపించ‌డం లేదు. ఇక‌, నెల్లూరు సిటీకే చెందిన మ‌రో మాజీ మంత్రి పొంగూరు నారాయ‌ణ ఎన్నిక‌ల త‌ర్వాత ఎక్కడ ఉన్నారో.. కూడా తెలియ‌డం లేదు. దీంతో టీడీపీ ప‌రిస్థితి ఒక అడుగు ముందుకు ప‌ది అడుగులు వెనక్కి చందంగా మారింది. ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో నెల్లూరులో పార్టీని గాడిలో పెట్టడం చంద్రబాబుకు సాధ్యమ‌య్యేలా లేదు.

Tags:    

Similar News