టీడీపీలో ఇక్కడ జూనియ‌ర్లే.. హీరోలు

మొక్కలేని చోట ఆముదం మొక్కే మ‌హావృక్షమ‌ని అంటారు క‌దా.. ఇప్పుడు అలానే ఉంది క‌ర్నూలు జిల్లా టీడీపీ రాజ‌కీయం. ఈ జిల్లాలో ఒక‌ప్పుడు అంతెందుకు గ‌త ఏడాది [more]

Update: 2020-05-05 12:30 GMT

మొక్కలేని చోట ఆముదం మొక్కే మ‌హావృక్షమ‌ని అంటారు క‌దా.. ఇప్పుడు అలానే ఉంది క‌ర్నూలు జిల్లా టీడీపీ రాజ‌కీయం. ఈ జిల్లాలో ఒక‌ప్పుడు అంతెందుకు గ‌త ఏడాది ఎన్నిక‌ల వ‌ర‌కు కూడా కీల‌క‌మైన నాయకులు టీడీపీ త‌ర‌పున చ‌క్రం తిప్పారు. వీరిలో కేఈ కృష్ణమూర్తి, కోట్ల, భూమా ఫ్యామిలీలు స‌హా ప‌లువురు కీల‌క నాయ‌కులు టీడీపీ త‌ర‌ఫున పోటీ చేశారు. ఐదేళ్ల టీడీపీలో వీళ్లంతా ఓ రేంజ్‌లో చ‌క్రం తిప్పారనే చెప్పాలి. వీరిలో కేఈ కృష్ణమూర్తి డిప్యూటీ సీఎంగా కూడా బాధ్యత‌లు నిర్వహించారు. ఇక‌, భూమా అఖిల ప్రియ కూడా మంత్రిగా చ‌క్రం తిప్పారు. మిగిలిన నాయ‌కుల్లో కూడా చాలా మంది టీడీపీని త‌మ త‌మ నియోజ‌క‌వ‌ర్గాల్లో ఉరుకులు ప‌రుగులు పెట్టించారు.

గత ఎన్నికల్లో…..

గ‌త ఏడాది ఎన్నిక‌ల్లోనూ కీల‌క‌మైన నాయ‌కులు టీడీపీ త‌ర‌ఫున రంగంలోకి దిగారు. అయితే, వైసీపీ తుఫాన్ ధాటికి నాయ‌కులు క‌కావిక‌ల‌య్యారు. ఎన్నో ఆశ‌లు పెట్టుకున్న నాయ‌కులు ఓడిపోయారు. అస‌లు జిల్లాలో టీడీపీ ఖాతా కూడా తెర‌వ‌లేదు. రెండు ఎంపీ సీట్లలోనూ పార్టీ ఘోరంగా ఓడిపోయింది. అనంత‌రం ప‌రిస్థితి కేవ‌లం ఆరు మాసాల్లోనే ఇక్కడ మారిపోయింది. సీనియ‌ర్లు అనుకున్న టీడీపీ నాయ‌కులు పార్టీకి దూర‌మ‌య్యారు. కేఈ కుటుంబం నుంచి ప్రభాక‌ర్ టీడీపీకి దూర‌మ‌య్యారు. టీజీ ఫ్యామిలీలో వెంక‌టేష్ బీజేపీలో చేరారు. కొడుకు భ‌ర‌త్ టీడీపీలో ఉంటున్నాడు.

సీనియర్ నేతలంతా….

ఇక‌, కాంగ్రెస్ నుంచి వ‌చ్చి ఎంపీగాను, ఎమ్మెల్యేగాను పోటీ చేసిన కోట్ల కుటుంబం ఫుల్ సైలెంట్ అయిపోయింది. ఇప్పుడు అస‌లు టీడీపీలో ఉన్నారో లేదో కూడా తెలియ‌ని ప‌రిస్థితి ఏర్పడింది. ఎస్వీ మోహన్ రెడ్డి కూడా ఎన్నిక‌ల‌కు ముందే వైసీపీలోకి జంప్ చేసేశారు. ఫ‌లితంగా ఇక్కడ ‌టీడీపీకి సీనియ‌ర్లు లేర‌నే చెప్పాలి. వైసీపీ నుంచి వ‌చ్చిన పాణ్యం మాజీ ఎమ్మెల్యే కూడా ఇప్పుడు టీడీపీలో చురుగ్గా ఉండ‌డం లేదు. గౌరు చ‌రిత దంప‌తులు బ‌ల‌వంతంగా టీడీపీలో చేరి పోటీ చేశారు. ఈ క్రమంలోనే వారు మ‌ళ్లీ వైసీపీలోకి వెళ్లిపోతార‌ని అంటున్నారు. ఇక బ‌న‌గాన‌పల్లి ఎమ్మెల్యే జ‌నార్థన్‌రెడ్డి చూపులు కూడా వైసీపీ వైపే ఉన్నాయ‌న్న టాక్ వ‌స్తోంది.

అందరూ జూనియర్లే….

దీంతో ఒక‌ప్పుడు నిత్యం క‌ర్నూలు టీడీపీలో క‌నిపించిన సంద‌డి ఇప్పుడు క‌నిపించ‌డం లేదు. పైగా జూనియ‌ర్లే .. సీనియ‌ర్లుగా చ‌లామ‌ణి అవుతున్నారు. భూమా కుటుంబం నుంచి వ‌చ్చి.. ఇంకా పార్టీ తీర్థం కూడా పుచ్చుకోని నాగిరెడ్డి వార‌సుడు భూమా జ‌గ‌ద్విఖ్యాత్ రెడ్డి నంద్యాల‌లో చ‌క్రం తిప్పుతున్నారు. కేఈ కుమారుడు గ‌త ఎన్నిక‌ల్లో పోయిన త‌ర్వాత మౌనంగా ఉంటున్నారు. ఇక‌, టీజీ వెంక‌టేష్ త‌న‌యుడు భ‌ర‌త్ క‌ర్నూలులో చ‌క్రం తిప్పుతున్నారు.

ఆ పేరు ఎత్తడానికే…?

మొత్తంగా ఇప్పుడు క‌ర్నూలులో ఏ కార్యక్రమం జ‌ర‌గాల‌న్నా.. చంద్రబాబు గ‌తంలో సీనియ‌ర్లతో మీటింగులు పెట్టేవారు. అయితే ఇప్పుడు మాత్రం వీరు త‌ప్ప ఆయ‌న‌కు ఎవ‌రూ క‌నిపించ‌డం లేదు. కేఈ .. కృష్ణమూర్తి రిటైర్ అయ్యారు. ప‌త్తికొండ‌లో ఆయ‌న వార‌సుడు కేఈ. శ్యాంబాబుదే రాజ్యం. మిగిలిన నియోజ‌క‌వ‌ర్గాల్లో కూడా ఇప్పుడున్న సీనియ‌ర్లు వ‌చ్చే ఎన్నిక‌ల వ‌ర‌కు కంటిన్యూ అయ్యే ప‌రిస్థితి లేదు. దీంతో ఇప్పుడు బాబు అస‌లు క‌ర్నూలు పేరు కూడా ఎత్తడం లేద‌ని అంటున్నారు. మ‌రి రాబోయే రోజుల్లో ఇక్కడ రాజ‌కీయాలు ఎలా మార‌తాయో ? చూడాలి.

Tags:    

Similar News