కడప వాష్ అవుట్… మిగిలిన నేతలు కూడా?

వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో కడప జిల్లాలో టీడీపీకి మంచి పట్టే ఉంది. బలమైన నాయకత్వం కూడా ఉంది. కానీ వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయిన పది [more]

Update: 2020-03-21 03:30 GMT

వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో కడప జిల్లాలో టీడీపీకి మంచి పట్టే ఉంది. బలమైన నాయకత్వం కూడా ఉంది. కానీ వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయిన పది నెలల్లోనే కడప గడపలో టీడీపీకి చోటు లేకుండా పోతుంది. పేరున్న నాయకులంతా పార్టీని వీడి వెళ్లిపోతున్నారు. ఎన్నికల ఫలితాలు వెలువడిన మరుసటి రోజు నుంచే కడప జిల్లా ఎఫెక్ట్ తెలుగుదేశం పార్టీ పై పడిందనే చెప్పాలి. ఇక కడప జిల్లాలో టీడీపీ కోలుకోవడం కష్టమేనని చెప్పాలి. ఉన్న నేతలు కూడా పెద్దగా పనికి వచ్చే నేతలు కాకపోవడంతో పార్టీ అధిష్టానానికి కడప దిగులు పట్టుకుంది.

మొన్నటి వరకూ బలంగా….

2019 ఎన్నికల పోలింగ్ వరకూ కడప జిల్లాలో టీడీపీ బలంగా కన్పించింది. జగన్ ను ఢీకొట్టి పార్టీ జెండాను కడప లో ఎగరేస్తామని చెప్పారు. చంద్రబాబు కూడా ఎన్నికలకు ముందు కడప జిల్లాపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. కడప జిల్లాకు నీళ్లు అందించడం, కడప స్టీల్ ఫ్యాక్టరీకి శంకుస్థాపన చేయడం తనకు కలసి వస్తుందనుకున్నారు. అందుకే కడప జిల్లాపై ఎన్నికలకు ముందు ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. సుదీర్ఘకాలంగా శత్రువులుగా ఉన్న రామసుబ్బారెడ్డి, ఆదినారాయణరెడ్డి చేతులు కలిపి ఫ్యాక్షన్ రాజకీయాలకు తెరదించానని సగర్వంగా ప్రకటించుకున్నారు.

కౌంటింగ్ రోజు నుంచే….

తీరా కౌంటింగ్ పూర్తయిన రోజు నుంచే కడప జిల్లా నుంచి చంద్రబాబుకు షాక్ ల మీద షాకులు తగులుతున్నాయి. తొలుత కడప జిల్లాకు చెందిన సీఎం రమేష్ రాజ్యసభ పదవి ఇచ్చినా ఆయన బీజేపీలో చేరిపోయారు. ఇది చంద్రబాబుకు తెలిసి జరిగినా క్యాడర్ లో మాత్రం నిస్తేజం నెలకొంది. అదే జిల్లాకు చెందిన వరదరాజులు రెడ్డి సయితం పార్టీకి దూరంగా ఉంటున్నారు. ఆయన కూడా వైసీపీలోకి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు.

కీలక నేతలందరూ వెళ్లిపోవడంతో…..

తాజాగా జమ్మలమడుగు నేత రామసుబ్బారెడ్డి టీడీపీని వీడటం నిజంగా కోలుకోలేని దెబ్బే. ఇక జమ్మలమడుగులో టీడీపీ జెండా కట్టేవారే ఉండరు. అదే నియోజకవర్గంలో ఉన్న ఆదినారాయణరెడ్డి ఎప్పుడో కాషాయ కండువా కప్పేసుకున్నారు. ఇక పులివెందుల టీడీపీ నేత సతీష్ రెడ్డి కూడా వైసీపీ నీడకు వచ్చేస్తున్నారు. మిగిలిన నేతల్లో చెప్పుకోదగింది బీటెక్ రవి, పార్టీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి మాత్రమే. వీరిద్దరూ జిల్లాను ఎలా నెట్టుకువస్తారన్నది ప్రశ్నే. టోటల్ గా కడపలో టీడీపీ వాష్ అవుట్ అయిందనే చెప్పాలి. నేతలు వెళ్లిపోయినా కొత్తవారిని తయారు చేసుకుంటామని చంద్రబాబు చెబుతున్న మాటలు కడపలో మాత్రం సాధ్యం కాదు.

Tags:    

Similar News