ప‌సుపు కోట ప‌రేషాన్‌.. క‌ళ్లు తెర‌వ‌క‌పోతే.. డిపాజిట్ గల్లంతే?

ప్రధాన ప్రతిప‌క్షం టీడీపీకి కంచుకోట వంటి ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాలో ఆ పార్టీ జెండా మోసే నాయ‌కులు, పార్టీని న‌డిపించే నాయకులు కూడా క‌నిపించ‌డం లేదు. గ‌త [more]

Update: 2021-06-01 12:30 GMT

ప్రధాన ప్రతిప‌క్షం టీడీపీకి కంచుకోట వంటి ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాలో ఆ పార్టీ జెండా మోసే నాయ‌కులు, పార్టీని న‌డిపించే నాయకులు కూడా క‌నిపించ‌డం లేదు. గ‌త ఎన్నిక‌ల్లో ఓట‌మి నుంచి ప‌లు గ్రామాల్లో కేడ‌ర్ నిర్వేదంలోకి వెళ్లిపోయింది. ఎక్కడిక‌క్కడ కీల‌క నేత‌లు, కేడ‌ర్ వైసీపీలోకి వెళ్లిపోతున్నా.. నియోజ‌క‌వ‌ర్గాల ఇన్‌చార్జ్‌లు, మాజీ ఎమ్మెల్యేలు చేష్టలుడిగి చూడ‌డం త‌ప్పా చేసేదేం ఉండ‌డం లేదు. 2014 ఎన్నిక‌ల్లో ఒక్క తాడేప‌ల్లిగూడెం త‌ప్ప ( ఇక్కడ కూడా మిత్రప‌క్షం బీజేపీ గెలిచింది) అన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లోనూ సైకిల్ విజ‌యం సాధించింది. ఇక‌, 2019 ఎన్నిక‌ల‌కు వ‌చ్చేస‌రికి.. ఇక్కడ కేవ‌లం ఉండి, పాల‌కొల్లు త‌ప్ప ఆ పార్టీకి మిగిలింది ఏమీలేదు. వీటిలోనూ ఒక్క పాల‌కొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు మాత్రమే కొంత యాక్టివ్‌గా ఉన్నారు. ఉండి ఎమ్మెల్యే రామ‌రాజు.. అధికార పార్టీ నేత‌ల‌తో మిలాఖ‌‌త్ అయిపోయార‌నే వార్తలు వ‌స్తున్నాయి. దీంతో పార్టీ కార్యక్రమాలు ఏమైనా జ‌రుగుతున్నాయ‌ని అంటే.. అది పాల‌కొల్లులో మాత్రమే.

ఒక్క పాలకొల్లులోనే…?

రామానాయుడు అటు నియోజ‌క‌వ‌ర్గంలోనూ, ఇటు రాష్ట్ర స్థాయిలోనూ బ‌ల‌మైన వాయిస్ వినిపించ‌డంతో పాటు అసెంబ్లీలో ఏకంగా ముఖ్యమంత్రి జ‌గ‌న్‌నే గ‌ట్టిగా టార్గెట్ చేస్తున్నారు. జిల్లాలో పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎంపీలు, ఎమ్మెల్యేలు.. మంత్రులుగా ఉండి కనుసైగతో జిల్లాను శాసించిన వారు ఒక్క ఓటమితో గప్‌చుప్‌ అయ్యారు. హేమాహేమీల్లాంటి టీడీపీ నాయకులు అనుకున్నవారు సైతం ఏమైపోయారో తెలియని పరిస్థితి. దీంతో జిల్లాలో తెలుగుదేశం ఖాళీ అయిపోయిందా ? చేవ చచ్చిందా అన్న అనుమానాలు కేడర్‌లో ఉన్నాయట. అసెంబ్లీ ఎన్నికల్లో తగిలిన ఎదురు దెబ్బ నుంచి పంచాయతీ, మున్సిపల్‌ ఎన్నికల్లో కోలుకుందామని జిల్లాలోని టీడీపీ నేతలు భావించారు. కానీ మరింత దెబ్బ తప్పలేదు. నేతలకే కాదు.. కేడర్‌కు కూడా ఇబ్బందులు ఎదుర‌య్యాయి. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత ఒక ప్రణాళిక ప్రకారం టీడీపీని నడిపించే నాయకులు లేడన్నది పార్టీ వర్గాలు చెప్పేమాట.

అప్పుడు ఉన్న దూకుడు….?

పంచాయతీలు పోయాయి. మున్సిపాలిటీలలో ఒకటి రెండు వార్డులకే పరిమితమైన దుస్థితి నెలకొంది. ఇక పరిషత్‌ ఎన్నికల సరేసరి. జిల్లాలో వైసీపీ ఎత్తుగడల ముందు టీడీపీ నేతల వ్యూహాలు తేలిపోతున్నాయి. ఎదురు నిలబడటం కాదు కదా.. ఎదురు మాట్లాడే పరిస్థితి లేదు. దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌లో మునుపటి దూకుడు లేదు. కేసుల వల్ల భయపడ్డారో ఏమో సైలెంట్‌ అయిపోయారు. చింతమనేని పరిస్థితిని చూసిన జిల్లాలోని ఇతర టీడీపీ నేతలు నాకెందుకు వచ్చిన గొడవలే అని సర్దుకున్నట్టు చెబుతున్నారు. మాజీ ఎంపీ తోట సీతారామలక్ష్మి, మాగంటి బాబుల అలికిడి లేదు. దాదాపు వీరి రాజ‌కీయం ముగిసిన‌ట్టే. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జిల్లా అంతా తానే అన్న‌ట్టుగా ఉన్న మాజీ జ‌డ్పీచైర్మ‌న్ ముళ్ల‌పూడి బాపిరాజు స్థానికంగా కంటే విజ‌య‌వాడ‌లోనే ఎక్కువుగా ఉంటోన్న ప‌రిస్థితి.

ఉన్నా లేనట్లుగానే ఉంటూ…?

2004, 2009లో టీడీపీ అధికారంలో లేకపోయినా.. జిల్లాలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ గట్టి పోటీ ఇచ్చింది. ఇటీవల ముగిసిన ఎన్నికల్లో అభ్యర్థులు దొరక్క విలవిల్లాడాల్సిన దుస్థితి ఎదురైంది. జిల్లా నుంచి పొలిట్‌బ్యూరో సభ్యుడిగా మాజీ మంత్రి పితాని సత్యనారాయణ ఉన్నారు. మరో మాజీ మంత్రి జవహర్‌ కొవ్వూరులో పాగా వేసేందుకు ప్రయ‌త్నాలు చేస్తున్నారు. ఇద్దరూ ఉన్నారంటే ఉన్నారు అంతే. యాక్టివ్‌గా మాత్రం లేర‌ని పార్టీ సీనియ‌ర్లు సైతం వ్యాఖ్యానిస్తున్నారు. దీంతో జిల్లా వ్యాప్తంగా పార్టీని ప‌ట్టుకునే నాథుడు లేర‌నేది వాస్తవం. తిరుప‌తి ఉప ఎన్నిక ఎలానూ ముగిసిన నేప‌థ్యంలో మ‌రి ఇప్పటికైనా..ప‌సుపు కోట‌పై చంద్రబాబు దృష్టి పెడ‌తారో లేదో చూడాలి. ఎలాగూ సీమ‌, నెల్లూరు జిల్లాల్లో పార్టీ పుంజుకునే ప‌రిస్థితి లేదు… మ‌రీ పార్టీకి కంచుకోట లాంటి జిల్లాల్లో అయినా కోలుకోకుంటే బాబుకు క‌ష్టమే అని చెప్పాలి.

Tags:    

Similar News