అక్కడ టీడీపీ ఉన్నా లేనట్లేనా? ఎందుకంటే?

విజ‌య‌న‌గ‌రం జిల్లా చీపురుప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గంలో టీడీపీ ప‌రిస్థితి ఏంటి ? ఇక్కడ పార్టీ త‌ర‌ఫున వినిపించే గ‌ళం ఏదైనా ఉందా ? ఒక‌ప్పుడు పార్టీకి కంచుకోట వంటి [more]

Update: 2020-07-26 00:30 GMT

విజ‌య‌న‌గ‌రం జిల్లా చీపురుప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గంలో టీడీపీ ప‌రిస్థితి ఏంటి ? ఇక్కడ పార్టీ త‌ర‌ఫున వినిపించే గ‌ళం ఏదైనా ఉందా ? ఒక‌ప్పుడు పార్టీకి కంచుకోట వంటి ఈ నియోజ‌క‌వ‌ర్గంలో పార్టీ ప్రస్తుత ప‌రిస్థితి దారుణ‌మేనా ? అంటే.. ఔన‌నే అంటున్నారు ప‌రిశీల‌కులు. ఇక్కడ నుంచి ప్రాతినిథ్యం వ‌హించిన నాయ‌కులు మౌనం పాటిస్తుండ‌డం.. అధికార వైఎస్సార్ సీపీకి చెందిన సీనియ‌ర్ నాయ‌కుడు, మంత్రి బొత్స స‌త్యనారాయ‌ణ దూకుడుగా ఉండ‌డంతో ఇక్కడి టీడీపీ ప‌రిస్థితి నానాటికీ తీసిక‌ట్టుగా మారుతోంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

బొత్స రాకతో…..

నియోజ‌క‌వ‌ర్గంలో ఆది నుంచి టీడీపీకి గ‌ట్టి ప‌ట్టుంది. పార్టీ ప్రారంభించిన 1983 నుంచి వ‌రుస‌గా ఐదుసార్లు జ‌రిగిన ఎన్నిక‌ల్లో టీడీపీనే గెలుపు గుర్రం ఎక్కింది. 1983లో త్రిపురాన వెంక‌ట‌ర‌త్నం వంటి ప్రజానాయ‌కుడితో ప్రారంభ‌మైన టీడీపీ ప్రస్థానం.. 1999 వ‌ర‌కు అంటే వ‌రుస‌గా గ‌ద్దె బాబూరావు గెలుపు వ‌ర‌కు వెనుదిరిగి చూసుకోవాల్సిన ప‌నిలేకుండా పోయింది. ఇక్కడ నుంచి ప్రాతినిధ్యం వ‌హించిన నాయ‌కుల్లో టంకాల స‌ర‌స్వత‌మ్మ, కింబూరి రామ్మోహ‌న్‌రావులు కూడా పార్టీని బ‌లోపేతం చేశారు. అయితే, బొత్స స‌త్యనారాయ‌ణ రంగ ప్రవేశంతో.. టీడీపీ హ‌వా స‌న్నగిల్లడం ప్రారంభించింది.

వరస విజయాలు…

2004, 2009లో బొత్స స‌త్యనారాయ‌ణ కాంగ్రెస్ త‌ర‌ఫున వ‌రుస విజ‌యాలు ద‌క్కించుకున్నారు. అనంత‌రం.. ఆయ‌న మంత్రిగా కూడా వైఎస్ హ‌యాంలో చ‌క్రం తిప్పారు. ఈ క్రమంలోనే టీడీపీ అనుకూల ఓటు బ్యాంకును కాంగ్రెస్ ప‌రం చేసేందుకు బొత్స అనేక అభివృద్ధి కార్యక్ర‌మాలు చేశారు. బొత్స చేసిన కృషి లేదా ఆయ‌న వ్యవ‌హార శైలి ప్రభావంతో టీడీపీ ఓటు బ్యాంకు స‌గానికి స‌గం ప‌డిపోయింది. అయితే, 2014లో మ‌ళ్లీ ఇక్కడ టీడీపీ విజ‌యం ద‌క్కించుకుంది. కానీ, ఇది కూడా గుడ్దిలో మెల్ల అనే సామెత‌నే నిజం చేసింది. ఎందుకంటే.. వాస్తవానికి రాష్ట్ర విభ‌జ‌న‌తో కాంగ్రెస్ తుడిచిపెట్టుకు పోయింది. చాలా నియోజ‌క‌వ‌ర్గాల్లో క‌నీసం డిపాజిట్లు కూడా రాలేదు. కానీ, బొత్స స‌త్యనారాయ‌ణమాత్రం ఇక్కడ కాంగ్రెస్ నుంచి పోటీ చేసి.. అంత వ్యతిరేక‌త‌లోనూ బ‌ల‌మైన పోటీ ఇచ్చి రెండో స్థానంలో నిలిచారు.

చివరకు గెలిచినా….

అయితే, చివ‌రాఖ‌రుకు టీడీపీ విజ‌యం సాధించింది. ఇక్కడ కిమిడి మృణాళిని గెలిచి, మంత్రి కూడా అయ్యారు. దాదాపు ప‌దేళ్ల త‌ర్వాత విజ‌యం ద‌క్కిన నేప‌థ్యంలో పార్టీని బ‌లోపేతం చేసుకునేందుకు ఏమైనా ప్రయ‌త్నాలు సాగాయా? అంటే లేద‌నే చెప్పాలి. పైగా ఆమె శ్రీకాకుళం జిల్లాకు చెందిన వారు కావ‌డంతో ఇక్క‌డ కార్యక‌ర్తల‌కు ఎంత మాత్రం అందుబాటులో లేరు. ఇక ఆమె మంత్రిగా ఉన్నప్పుడు ఆమె కుమారుడు నాగార్జున పూర్తిగా చ‌క్రం తిప్పడంతో ఆమెపై తీవ్ర ఆరోప‌ణ‌లు కూడా వ‌చ్చాయి.

విజిటింగ్ ప్రొఫెసర్ గా….

ఇక గ‌తేడాది ఎన్నిక‌ల్లో టీడీపీ నుంచి మృణాళిని కుమారుడు నాగార్జున పోటీ చేశారు. ఆ ఎన్నిక‌ల్లో వైఎస్సార్ సీపీ త‌ర‌ఫున బొత్స స‌త్యనారాయ‌ణ విజ‌యం సాధించారు. ఇక‌, ఆ త‌ర్వాత అయినా.. పార్టీని బ‌లోపేతం చేసుకునేందుకు టీడీపీ మాజీ మంత్రి మృణాళిని ఎక్కడా ప్రయ‌త్నించ‌డం లేదు. క‌నీసం పార్టీ జెండా మోసే వారు కూడా క‌నిపించ‌డం లేదు. ఇక విదేశాల్లో ఉండి వ‌చ్చిన నాగార్జున వైజాగ్‌లో నివాసం ఉంటూ నియోజ‌క‌వ‌ర్గానికి విజిటింగ్ ప్రొఫెస‌ర్ మాదిరిగా వ‌స్తున్నార‌న్న విమ‌ర్శలు ఉన్నాయి. దీంతో మున్ముందు ఇక్కడ పార్టీ ప‌రిస్థితి దార‌ణ‌మ‌నే నివేదిక‌లు చంద్రబాబుకు అందాయి. మ‌రి ఏం చేస్తారో చూడాలి.

Tags:    

Similar News