మమ్మల్ని కొన్నిరోజులు వదిలేయండయ్యా ప్లీజ్

తెలుగుదేశం పార్టీ పార్లమెంటరీ నియోజకవర్గాలకు ఇన్ ఛార్జిలను నియమించినా ఫలితం లేకుండా పోయింది. అసెంబ్లీ నియోజకవర్గాలకు ఇన్ చార్జులుగా ఉండేందుకు ఎవరూ ప్రస్తుత పరిస్థితుల్లో ఇష్టపడటం లేదని [more]

Update: 2020-10-23 05:00 GMT

తెలుగుదేశం పార్టీ పార్లమెంటరీ నియోజకవర్గాలకు ఇన్ ఛార్జిలను నియమించినా ఫలితం లేకుండా పోయింది. అసెంబ్లీ నియోజకవర్గాలకు ఇన్ చార్జులుగా ఉండేందుకు ఎవరూ ప్రస్తుత పరిస్థితుల్లో ఇష్టపడటం లేదని తెలుస్తోంది. నిజానికి పార్టీ ఇన్ ఛార్జి పదవి అంటే వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా టిక్కెట్ దక్కుతుందన్నమాట. అయితే వచ్చే ఎన్నికల సంగతి దేముడెరుగు ముందు తమ వ్యాపారాలను కాపాడుకోవాలంటూ అనేక మంది నేతలు నియోజకవర్గాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు.

ఫలితాలు వచ్చిన నాటి నుంచే….

ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల ఫలితాలు వన్ సైడ్ గానే వచ్చాయని చెప్పాలి. విభజన తర్వాత చంద్రబాబు నాయకత్వంపై ప్రజల్లో విశ్వాసం మరింత పెరుగుతుందన్న నేతల ఆశలకు గండికొడుతూ ఫలితాలు వచ్చాయి. దీంతో వచ్చే ఎన్నికల నాటికి పరిస్థితులు ఎలా ఉంటాయోనన్న ఆందోళన పార్టీ నేతల్లో బయలుదేరింది. నారా లోకేష్ సమర్థత, నాయకత్వంపై నమ్మకం లేదు. దీంతో ఎన్నికల ఫలితాల తర్వాత నుంచి రాష్ట్రంలోని దాదాపు వందకు పైగా నియోజకవర్గాల్లో టీడీపీ నేతలు యాక్టివ్ గా లేరు.

ఇన్ ఛార్జి పదవిని తీసుకునేందుకు…..

అయితే ఇప్పుడు పార్లమెంటరీ నియోజకవర్గాలకు చంద్రబాబు ఇన్ ఛార్జిలను నియమించారు. వారు తమ పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల నేతలతో సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. కానీ ఈ సమావేశాలకు నేతల నుంచి పెద్దగా స్పందన లేదని తెలుస్తోంది. నియోజకవర్గాల వారీగా ఇన్ ఛార్జిల పేర్లను వీళ్లు పరిశీలించే ప్రయత్నం చేస్తున్నారు. గత ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలయిన నేతలతో పాటు ముఖ్య నేతల పేర్లను కూడా వీరు సేకరిస్తున్నారని తెలిసింది.

వ్యాపారాలే ముఖ్యమంటూ…

కానీ గత ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలయిన నేతలు ఎక్కువగా వ్యాపారాలపై దృష్టి పెట్టారు. వచ్చే ఎన్నికల నాటికి తాము ఆర్థికంగా సన్నద్ధులం కావాలంటే వ్యాపారాలపై దృష్టి పెట్టక తప్పదని నేతల ఎదుటే చెబుతున్నట్లు తెలిసింది. వ్యాపారాలను వదిలేసి నియోజవర్గాల్లోనే ఉండమంటే, వచ్చే ఎన్నికల్లో పార్టీ నిధులను ఇస్తుందా? అని ఎదురు ప్రశ్నిస్తున్నట్లు తెలిసింది. దీంతో పార్లమెంటరీ నియోజకవర్గ ఇన్ ఛార్జులు తలలు పట్టుకుంటున్నారు. ఇన్ ఛార్జి నియామకం వారి చేతులో లేకపోయినప్పటికీ, ఎవరు పేరు పంపాలన్న దానిపై పార్లమెంటరీ నియోకవర్గ ఇన్ ఛార్జులు ఇబ్బంది పడుతున్నారట. మొత్తం మీద నియోకవర్గ ఇన్ ఛార్జి పదవిని ఇపట్లో చేపట్టడం కష్టమేనని చెప్పే వారి సంఖ్య టీడీపీలో ఎక్కువగా ఉందట.

Tags:    

Similar News