తెలుగుదేశానికి ఏదో అవుతోంది…?

తెలుగుదేశం పార్టీ అంటేనే క్యాడర్ బేస్డ్ పార్టీ అని చెప్పుకుంటారు. ఆ పార్టీకి కార్యకర్తలే రక్షణ కవచాలు. అందుకే నేతలు ఎంతమంది వెళ్ళిపోయినా కూడా పార్టీ నాలుగు [more]

Update: 2021-03-06 00:30 GMT

తెలుగుదేశం పార్టీ అంటేనే క్యాడర్ బేస్డ్ పార్టీ అని చెప్పుకుంటారు. ఆ పార్టీకి కార్యకర్తలే రక్షణ కవచాలు. అందుకే నేతలు ఎంతమంది వెళ్ళిపోయినా కూడా పార్టీ నాలుగు దశాబ్దాలుగా బతికి బట్టకడుతోంది. ఇక తెలుగుదేశానికంటూ కొన్ని కంచు కోటలు ఉన్నాయి. అవి ఎప్పటికీ బీటలు వారవు. ఆరు నూరు అయినా కూడా తెలుగుదేశంకే ఓటేస్తూ వస్తాయి. కానీ 2019 నుంచి సీన్ రివర్స్ లో నడుస్తోంది. టీడీపీ కంచుకోటలు మంచుకోటలుగా మారిపోతున్నాయి.

ఇద్దరికీ ఒకేలా…?

ఇక తెలుగుదేశం పార్టీ విషయానికి వస్తే కుప్పం, హిందూపురం సీట్లను సైకిల్ పార్టీకి అంకితం అయినట్లుగానే భావిస్తారు. ఇక్కడ ఎవరు నామినేషన్ వేసినా గెలుపు ఖాయం, మెజారిటీనే చూడమంటారు. అలాంటి ఈ రెండు చోట్ల పంచాయతీ ఎన్నికల్లో పసుపు పార్టీ దారుణంగా ఓడింది. చంద్రబాబును ఏడు సార్లు గెలిపించిన కుప్పంలో ఈసారి పంచాయతీ ఎన్నికలు జరిగితే మొత్తం 88 సర్పంచులకు గానూ 74 మంది వైసీపీ మద్దతుదారులే గెలిచారు. అంటే ఇక్కడ చంద్రబాబుకు ప్రమాద ఘంటికలు మోగినట్లేనని భావిస్తున్నారు. ఇక హిందూపురం ఏనాడైతే ఎన్టీయార్ పోటీ చేశారో నాటి నుంచి అది నందమూరి పురం అయిపోయింది. మరి అలాంటి చోట్ల రెండు సార్లు గెలిచిన బాలయ్యకు పంచాయతీ పోరు చుక్కలు చూపించింది. ఏకంగా 52 పంచాయతీలకు ఎన్నికలు జరిగితే 47 చోట్ల వైసీపీ మద్దతుదారులు గెలవడం ద్వారా హిందూపురానికే షాక్ ఇచ్చేశారు.

కూసాలు కదులుతున్నాయి….

తెలుగుదేశం పార్టీకి పటిష్టమైన కార్యకర్తలు ఉన్నారు. పోలింగ్ బూత్ దాకా ఆ పార్టీకి గట్టి యంత్రాంగం ఉందని ఇంతకాలం గొప్పలు చెప్పుకున్నారు. కానీ పంచాయతీ ఎన్నికల్లో మాత్రం టీడీపీకి దారుణమైన ఫలితాలు వచ్చాయి. కార్యకర్తలు కూడా మార్పు కోరుకుంటున్నారా అన్నదే ఇపుడు తెలుగుదేశంలో చర్చగా ఉందిట. చంద్రబాబు ఎంతసేపూ తాను మారకుండా పార్టీ నేతలను మారాలంటారు. అందుకే ఈసారికి వారి మైండ్ సెట్ చేంజ్ అయిందా అన్నదే ఈ ఫలితాలను చూస్తే అర్ధమవుతోంది అన్న విశ్లేషణలు ఉన్నాయి. మొత్తానికి చూసుకుంటే పంచాయతీ ఎన్నికల ఫలితాలు మాత్రం తెలుగుదేశం బలహీనతను డొల్లతనాన్ని బట్ట బయలు చేశాయని అంటున్నారు. ఒకవేళ అధికార పార్టీ దౌర్జన్యాలే చేసిందనుకున్నా దాన్ని అడ్డుకోకపోవడం కూడా టీడీపీ ఫెయిల్యూరే అంటున్నారు. టోటల్ గా తెలుగుదేశం పార్టీకి ఏదో అయింది అన్న మాట మాత్రం గట్టిగా వినిపిస్తోంది.

Tags:    

Similar News