దిగిపో…దిగిపో… అంటున్నారే…?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శాంతిభద్రతలు దారుణంగా క్షీణించాయట. అందువల్ల వెంటనే వైసీపీ సర్కార్ ని రద్దు చేసి రాష్ట్రపతి పాలన విధించాలట. ఇదీ తెలుగు తమ్ముళ్ళ డిమాండ్. దీనికి [more]

Update: 2020-03-02 03:30 GMT

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శాంతిభద్రతలు దారుణంగా క్షీణించాయట. అందువల్ల వెంటనే వైసీపీ సర్కార్ ని రద్దు చేసి రాష్ట్రపతి పాలన విధించాలట. ఇదీ తెలుగు తమ్ముళ్ళ డిమాండ్. దీనికి అర్ధం ఏమైనా ఉందా అంటే ఫక్త్ కక్కుర్తి రాజకీయం తప్ప అంటారు ఎవరైనా. జగన్ సీఎం కుర్చీలో కూర్చుని పట్టుమని పది నెలలు కూడా కాలేదు, మొదటి రోజు నుంచే జగన్ దిగిపో అంటూ తమ్ముళ్ళు పెడుతున్న పెడబొబ్బలు ఆ పార్టీకి ఎంత వరకూ మంచి చేస్తాయో తెలియదు కానీ అధికార దాహం బాగా ఎక్కువైందని జనాలకు బాగా బోధపడుతోంది.

బాబు గో బ్యాక్…

విశాఖ ఎయిర్ పోర్టులో బాబు గో బ్యాక్ అంటూ వచ్చిన మనిషిని వెనక్కి పంపారట. అలా వెళ్ళిపోయిన ఆయన సామాన్యుడు కాడుట. ఏపీని ముమ్మారు ఏలిన‌ రాజతిలకమట. నాలుగు దశాబ్దాల రాజకీయ అనుభవశాలిట. దేశంలోనే గొప్ప నాయకుడిగా ఉన్న చంద్రబాబునే గో బ్యాక్ అంటారా. తిరుగు టపాలో పంపుతారా అంటూ తమ్ముళ్ళు చిందులేస్తున్నారు. దీంతో వారిలో ఎక్కడేలేని ఆవేశం కట్టలు తెంచుకుంటోంది. అందుకే విశాఖ ఘటనను బూచిగా చూపిస్తూ గవర్నర్ దగ్గరకు వెళ్ళిన టీడీపీ తమ్ముళ్ళు జగన్ ని గద్దె దింపాలని కోరుతున్నారు.

ఇదేనా విధానం….?

జగన్ ఏపీలో పాలన చేస్తున్నారు. తప్పులుంటే తప్పకుండా విపక్షం విమర్శలు చేయాలి. కానీ అధినేత చంద్రబాబే తన స్థాయి, అనుభవాన్ని మరచి తెల్లారి లేస్తూనే జగన్ని తిట్ల దండకంతో వేడి రాజేస్తారు. ఆ మీదట వరసగా పదమూడు జిల్లాల తమ్ముళ్ళూ పల్లవి అందుకుంటారు. ఇలా రోజుకు మూడు పొద్దులూ జగన్ మీద వ్యక్తిగత దూషణలకు దిగుతూ రెచ్చగొడుతున్న పాపమంతా మోస్తున్న పచ్చ పార్టీ నేతలు శాంతిని ఎక్కడ మిగిల్చారని వైసీపీ నేతలు అంటున్నారు. వారి మాటలకు తాము కౌంటర్లు కూడా ఇవ్వకూడదా అని ప్రశ్నిస్తున్నారు. ఇక చంద్రబాబు లాంటి పెద్ద మనిషి కుప్పం నుంచి మాట్లాడుతూ విశాఖలో వైసీపీ భాగోతాలు బయటపెడతాను, వారి సంగతి తేలుస్తానంటూ రెచ్చిపోయిన తరువాత కదా విశాఖలో గో బ్యాక్ అన్నారన్నది కూడా వైసీపీ నేతలు గుర్తు చేస్తున్నారు. ఇలా అగ్గిని వారే రాజేసి ఆజ్యమూ వారే పోసి తప్పు మా మీద నెడతారేంటి అంటున్నారు ఫ్యాన్ పార్టీ సోదరులు.

నాలుగేళ్ళూ ఎలా….

తొలి ఏడాదినే చివరి ఏడాదిగా మార్చేసి ఎన్నికల వేడిని అలా రగిలిస్తూ పోతున్న ప్రతిపక్షం, దాని ట్రాప్ లో పడిపోతున్న అధికారం పక్షం తీరు చూస్తే నాలుగేళ్ళు ఎట్టా గడిచేనూ అన్న డౌట్లు ఏపీలోని తటస్థులు, మేధావులకు కలుగుతున్నాయి. ప్రజాస్వామ్యంలో అధికార, ప్రతిపక్ష పార్టీలు నిర్మాణాత్మకంగా ఉండాలి. బాబు లాంటి వారు ఇపుడు పెద్ద మనిషిగా ఉండాలి. కానీ జరుగుతున్నది వేరుగా ఉంది. రాజకీయాలు స్థాయి దాటి వ్యక్తిగత కక్షలకు చేరుకున్నాయి. దాంతోనే ఏపీలో శాంతి భద్రత అన్న చర్చ సాగుతోంది. వైసీపీని గద్దె దించాలని కోరుతున్న తమ్ముళ్ళు ఏపీలో శాంతి లేకుండా చేయడంలో తామే అగ్ర భూమికని పోషిస్తున్నామన్న సంగతిని గుర్తు చేసుకుంటే మంచిది. ఎన్నికల్లోనే రాజకీయాలు తరువాత అభివ్రుధ్ధి అన్న ఒకనాటి చంద్రబాబు మాటలను ఆయనతో బాబు తమ్ముళ్ళూ అమలు పరచాలి. అలాగే అధికార పక్షం కూడా ప్రతి విమర్శలకు పోకుండా ప్రభుత్వం చేసే మంచి పనులను జనాలకు చెప్పుకుంటే బెటరేమో.

Tags:    

Similar News